కరోనాకు భయపడాల్సిన అవసరం లేదు 

డిప్యూటీ సీఎం ఆళ్ల నాని

 
 శ్రీకాకుళం: కరోనాకు భయపడాల్సిన అవసరం లేదని.. జాగ్రత్తలు పాటించాలని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సూచించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని చెప్పారు. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 81 కరోనా కేసులు నమోదయ్యాయని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలిపారు. ఆదివారం ఆయన శ్రీకాకుళంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..  రాష్ట్రంలో మొత్తం కరోనా బారినపడిన వారి సంఖ్య 1097కి చేరుకుందని..835 మంది చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 4 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. 3576 మందికి నెగిటివ్‌ వచ్చిందన్నారు. 1145 మంది విదేశాల నుంచి వచ్చారని..వీరితో 4271 మంది కాంటాక్ట్‌ అయ్యారన్నారు. ఢిల్లీ నుంచి 230, ముంబై నుంచి  488 మంది వచ్చారని.. ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో ఒకరిని గుర్తించి పరీక్షలు చేశామన్నారు. కరోనా బాధితులను కోవిడ్‌ ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. 

శ్రీకాకుళంలో కరోనా ల్యాబ్‌..
శ్రీకాకుళం జిల్లాలో కరోనా ల్యాబ్‌ ఏర్పాటు చేశామని.. ర్యాపిడ్‌, ట్రూనాట్‌ కిట్స్‌ ద్వారా పరీక్షలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. జిల్లాలోనే ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేస్తున్నామన్నారు. జెమ్స్‌ ఆసుపత్రిని జిల్లా కోవిడ్‌ ఆసుపత్రిగా చేశామని చెప్పారు. 32 క్వారంటైన్‌ కేంద్రాల్లో పూర్తి సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు.పాతపట్నం ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించామన్నారు. 50 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని..పారిశుద్ధ్య కార్యక్రమాలు, నిత్యావసర సరుకులు అందేవిధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. గుజరాత్‌లో ఉన్న మత్స్యకారులను తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేశామని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు.

Back to Top