ఆరోగ్యశ్రీ పరిధిలోకి బ్లాక్‌ ఫంగస్‌ చికిత్స

కరోనాతో తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలను ఆదుకునేందుకు అడుగులు

పిల్లలు రోడ్డునపడకుండా తక్షణ సాయం అందించేందుకు సీఎం నిర్ణయం

డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని

విజయవాడ: కరోనాను ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చి ఎంతోమంది నిరుపేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలో చేరుస్తూ మరో కీలక నిర్ణయం తీసుకున్నారని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. కరోనా నివారణ, వ్యాక్సినేషన్, ఆస్పత్రుల్లో వైద్య సేవలపై సీఎం అధ్యక్షతన సమీక్ష అనంతరం మంత్రి ఆళ్ల నాని మీడియాతో మాట్లాడారు. కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులు చనిపోయి ఒంటరైన పిల్లలను మానవతా దృక్పథంతో ఆదుకోవాలని సీఎం వైయస్‌ జగన్‌ సూచించారన్నారు. తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు అనాథలవ్వకుండా, రోడ్డునపడకుండా తక్షణ సాయం అందించే విధంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. అందుకు సంబంధించిన విధి విధానాలను రూపొందిస్తున్నారన్నారు.  

కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, కోవిడ్‌ కేర్‌ సెంటర్లు, ఆస్పత్రుల్లో వైద్య సేవలు, శానిటేషన్, ఆహారం, వ్యాక్సిన్‌ వంటి అంశాలపై సీఎం వైయస్‌ జగన్‌ క్షుణ్ణంగా చర్చించారన్నారు. ఆక్సిజన్‌ కాన్‌సంట్రేటర్స్‌ కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో కూడా పెట్టాలని, తద్వారా ఆస్పత్రుల మీదపడే భారం కొంతైనా తగ్గుతుందని సీఎం సూచించారన్నారు. పాజిటివ్‌ పేషెంట్లకు సంబంధించిన కుటుంబీలకు కరోనా లక్షణాలు ఉంటే వారికి తక్షణ చికిత్స అందించాలనే లక్ష్యంగా ఫీవర్‌ సర్వే జరుగుతుందన్నారు. సర్వేలో ప్రభుత్వం దృష్టికి వచ్చిన కేసులకు సంబంధించి డాక్టర్ల సూచనల మేరకు హోంఐసోలేషన్, కోవిడ్‌ కేర్‌ సెంటర్లకు, ఆస్పత్రులకు పంపించడం జరుగుతుందన్నారు. 

 

Back to Top