గిరి‘జనం’ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

ఏజెన్సీ ప్రాంత ప్ర‌జ‌ల‌కు త్వ‌ర‌లో మెరుగైన వైద్య సేవ‌లు

రూ.400 కోట్లతో పాడేరులో మెడికల్‌ కాలేజీ, సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి

మెడికల్‌ కాలేజీ కోసం టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ నుంచి 35 ఎకరాలు కేటాయింపు

నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటాం

డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని

విశాఖపట్నం: గిరిజన ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్యపరిరక్షణపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. పాడేరులో రూ.400 కోట్లతో మెడికల్‌ కాలేజీతో పాటు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేయనున్నామని ఆయన చెప్పారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రులు ధర్మాన కృష్ణదాస్, అవంతి శ్రీనివాస్‌ పర్యటించారు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు స్థలం పరిశీలించారు. అనంతరం పాడేరులోని వైద్యాధికారులతో మంత్రుల బృందం సమీక్షా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. మెడికల్‌ కాలేజీ కోసం టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ నుంచి 35 ఎకరాలు కేటాయించామననారు. పాడేరు మెడికల్‌ కాలేజీ ఆవరణలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయనున్నామన్నారు. మెడికల్‌ కాలేజీ తరగతులు త్వరగా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. 

దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గిరిజనుల ఆరోగ్యపరిరక్షణకు కార్యక్రమాలు జరిగేవని, ఆ తరువాత ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ గిరిజనుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక దృష్టిసారించారన్నారు. రానున్న రోజుల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ఆరోగ్యరంగానికి సంబంధించి వినూత్న మార్పులకు సీఎం వైయస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారన్నారు. రూ.400 కోట్లతో పాడేరులో నిర్మాణకాబోయే మెడికల్‌ కాలేజీ, సూపర్‌స్పెషాలిటీకి సంబంధించి ఆగస్టులో టెండర్లు పిలువనున్నామన్నారు. రానున్న కొద్ది నెలల్లోనే దీనికి కావాల్సిన కార్యక్రమాలు పూర్తి చేసి నిర్మాణాలు కూడా మొదలయ్యేలా.. త్వరగా ఆ నిర్మాణాలు కూడా పూర్తయ్యేలా చర్యలు తీసుకోనున్నామన్నారు. గిరిజనులకు సంబంధించి సరైన వైద్య సదుపాయాలు లేక ప్రాణాలు కోల్పోతున్నారని, వాటిని త్వరగా నివారించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. 

Back to Top