మార్కెట్‌ ఇంటలిజెన్స్‌ వ్యవస్థను బలోపేతం చేయాలి

వ్యవసాయ సలహా బోర్డుల విధివిధానాలు ఖరారు చేయాలి

ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తేమ కొలిచే సాధనాలు అందుబాటులో ఉంచాలి

సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

తాడేపల్లి: వ్యవసాయ సలహా బోర్డుల ఏర్పాటుపై విధివిధానాలను ఖరారు చేయాలని సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయ సలహా బోర్డులను రైతు భరోసా కేంద్రాలకు అనుబంధం చేయాలని సూచించారు. వ్యవసాయ శాఖపై సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పంటలోనూ ప్రభుత్వం తరఫున ఎంత కొనుగోలు చేయాల్సి ఉంటుంది, ఆ మేరకు రోజువారీగా ఎంత సేకరణ చేయాలి? చేస్తున్నారా..లేదా? అన్నదానిపై వివరాలు ఇవ్వాలని అధికారులను సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తేమ కొలిచే సాధనాలను అందుబాటులో ఉంచాలన్నారు. వీటిని ప్రతి రైతు భరోసా కేంద్రం వద్ద అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

మే 30న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నామని అధికారులు సీఎం వైయస్‌ జగన్‌కు వివరించారు. ఈలోగా మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ వ్యవస్థను బలోపేతం చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో వ్యవసాయ సలహా బోర్డుల ఏర్పాటుపై విధి విధానాలు ఖరారు చేయాలని సీఎం సూచించారు. వీటిని రైతుభరోసా కేంద్రాలకు (ఆర్బీకే) అనుసంధానం చేయాలని సూచించారు. 

జూన్‌ 6న మత్స్యకార భరోసాకు సిద్ధం అయ్యామని సీఎంకు అధికారులు తెలిపారు. రైతు భరోసాకు సంబంధించి గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితా ఉంచుతున్నామని.. ఎవరైనా పేరు లేకపోతే దరఖాస్తు చేసుకునేలా ప్రచారం చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.

లాక్‌డౌన్‌ పొడిగింపు, కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలపై చర్చ
లాక్‌డౌన్‌ పొడిగింపు, కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. కేంద్ర హోంశాఖ ఇచ్చిన సూచనల మేరకు ఎక్కడెక్కడ కంటైన్‌మెంట్‌ జోన్లు ఉండాలో గుర్తించాలని, అనుసరించాల్సిన విధానాలపై విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు. అనుమతులు ఉన్న దుకాణాల వద్ద పాటించాల్సిన ఎస్‌ఓపీలను ఇవ్వాలన్నారు.   

క్వారంటైన్లలో సదుపాయాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారా.. లేదా..? అని సీఎం వైయస్‌ జగన్‌ ఆరా తీశారు. సమస్యలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న దానిపై తనకు తెలియజేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 1,08,403 ఉన్నాయని, నిన్న ఒక్క రోజే 5,943 మందికి పరీక్షలు చేశామని, ప్రతి పది లక్షల మందిలో 2030 మందికి పరీక్షలు జరుగుతున్నాయని, పాజిటివిటీ కేసుల రేటు 1.41 శాతం కాగా, దేశవ్యాప్తంగా 3.82శాతం ఉందని, రాష్ట్రంలో మరణాల శాతం 2.16 శాతం ఉంటే దేశవ్యాప్తంగా 3.28శాతం ఉందని అధికారులు వివరించారు.  
 

Back to Top