ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రిలయన్స్‌, ఆదిత్య బిర్లా భారీ పెట్టుబడులు

నేడు వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయ‌నున్న సీఎం వైయ‌స్‌ జగన్‌ 

రూ.1,700 కోట్లతో ఆదిత్య బిర్లా కార్బన్‌ బ్లాక్‌ మానుఫ్యాక్చర్‌ ఫెసిలిటీ 

రూ.1,024 కోట్లతో రిలయన్స్‌ బయోగ్యాస్‌ ప్లాంట్లు 

మొత్తం 10 కంపెనీలు..రూ.4,883 కోట్ల పెట్టుబడులు, 4,046 మందికి ఉద్యోగాలు

తాడేప‌ల్లి: రాష్ట్ర పారిశ్రామిక రంగ అభివృద్ధిలో మరో కీలక ఘట్టానికి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు శ్రీకారం చుట్ట‌నున్నారు. రిలయన్స్‌ బయో ఎనర్జీ, ఆదిత్య బిర్లా గ్రూప్‌తోపాటు  పలు సంస్థలు రాష్ట్రంలో నెలకొల్పుతున్న పరిశ్రమలకు ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ నేడు క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. సుమారు రూ.4,178 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటవుతున్న పలు పరిశ్రమలకు భూమిపూజ నిర్వహించనున్నారు. ఇవి కాకుండా రూ.655 కోట్లతో నెలకొల్పిన ఆగ్రో ప్రాసెసింగ్‌ యూనిట్లను ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌ ప్రారంభించనున్నారు. మొత్తంగా సుమారు రూ.4,833 కోట్ల పెట్టుబడులు రానుండగా కొత్తగా 4,046 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.   

రిలయన్స్‌ బయో ఎనర్జీ రాష్ట్రంలో 8 ప్రాంతాల్లో వ్యవసాయ వ్యర్ధాల నుంచి బయో గ్యాస్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. మొత్తం రూ.1,024 కోట్ల పెట్టుబడితో తొలి దశలో కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, కర్నూలు, నెల్లూరులో బయో గ్యాస్‌ ప్లాంట్లను నెలకొల్పనుంది. తద్వారా 576 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

ఆదిత్య బిర్లా గ్రూప్‌ రూ.1,700 కోట్ల పెట్టుబడితో తిరుపతి జిల్లా నాయుడుపేటలో మాన్యుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ కార్బన్‌ బ్లాక్‌ను ఏర్పాటు చేయనుంది. దీనిద్వారా 250 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. వీటితో పాటు హెల్లా ఇన్‌ఫ్రా, వెసువియస్‌ ఇండియా లిమిటెడ్, ఏపీఐఐసీ, ఏపీ ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్, అన ఒలియో ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన పలు ప్రాజెక్టులకు సీఎం వైయ‌స్‌ జగన్‌ వర్చువల్‌గా శంకుస్థాపనలతో పాటు పలు యూనిట్లను ప్రారంభిస్తారు.

Back to Top