పేద‌ల సొంతింటి క‌ల సాకారానికి ఎంత‌ఖ‌ర్చైనా ప‌ర్వాలేదు

ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి

ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాల‌న్న విష‌యాన్ని గుర్తుపెట్టుకోవాలి

పాల‌న సుల‌భ‌త‌రంగా, ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండాలి

క్షేత్రస్థాయిలో లక్ష్యాలు పెట్టుకుని ఉపాధిహామీ పనులు చేపట్టాలి

డిసెంబర్‌ నాటికి 4,545 డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం పూర్తికావాలి

ఈనెల 28న విశాఖ‌లో 1.23 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం

అదే రోజున 1.79 లక్షల పీఎంఏబై, వైయ‌స్ఆర్ -గ్రామీణ్‌ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తున్నాం

ఆప్షన్ - 3 ఎంపిక చేసుకున్న ఇళ్ల నిర్మాణంపైనా కలెక్టర్లు దృష్టిపెట్టాలి

కోర్టు కేసుల కారణంగా 42,639 ఇళ్ల నిర్మాణం పెండింగు

కేసులు ప‌రిష్కారం కాని ప‌క్షంలో ప్రత్యామ్నాయ స్థలాలను ఎంపిక చేయాలి

గంట‌లోపే స‌మీక్ష పూర్త‌వ్వాలి.. సమీక్ష పేరుతో అనవసరంగా కాలహననం వద్దు

క‌లెక్ట‌ర్లు, ఇత‌ర అధికారుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశం

`స్పంద‌న‌`పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌

తాడేపల్లి: ‘‘పరిపాలన అనేది సులభతరంగా ఉండాలి. ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలి.  ప్రజల పట్ల మరింత మానవ‌తా దృక్పథంతో ఉండాలి. ఈ విషయాలను ఎప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలి. ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి’’ అని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి 26 జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఇత‌ర అధికారుల‌కు సూచించారు. 26 జిల్లాలను ఎందుకు ఏర్పాటు చేశామన్న విషయం అందరికీ తెలియాలన్నారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో స్పందనపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి `స్పంద‌న‌` వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఉపాధి హామీ కార్యక్రమం కింద చేపట్టిన పనులు, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్‌ క్లినిక్స్, డిజిటిల్‌ లైబ్రరీలు, ఏఎంసీలు, బీఎంసీలు, గృహనిర్మాణం, జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం, జగనన్న భూ హక్కు మరియు భూ రక్ష, ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు భూ సేకరణ, నాడు-నేడు, స్పందన కింద అర్జీల పరిషారం తదితర అంశాలపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సుదీర్ఘంగా సమీక్షించారు. ప‌లు అంశాల‌పై క‌లెక్ట‌ర్లు, జిల్లాల అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. 

ఈ సందర్భంగా సీఎం వైయ‌స్‌ జగన్ ఏం మాట్లాడారంటే..

ఉపాధిహామీ పనులు..
ఏప్రిల్, మే, జూన్‌... నెలల్లో ముమ్మరంగా పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. కనీసం 60 శాతం పనులను ఈనెలల్లో చేయాలి. కలెక్టర్లు ఈ మూడు నెలల్లో పనులు ముమ్మరంగా పనిచేయడంపై దృష్టిపెట్టాలి. ప్రతిజిల్లాలో కూడా ప్రతిరోజూ కనీసం 1 లక్ష పనిదినాలు చేయాలి. నెలలో కనీసంగా 25 లక్షల పని దినాలు చేపట్టాలి. క్షేత్రస్థాయిలో లక్ష్యాలు పెట్టుకుని ఉపాధిహామీ పనులు చేపట్టాలి. విస్తృతంగా పర్యటనలు చేసి, సమీక్షలు చేసి.. ఈ లక్ష్యాలను సాధించాలి. కలెక్టర్లు, జేసీలు, పీడీలు, ఎంపీడీఓలు.. ఇలా ప్రతి అధికారి ప్రత్యేక దృష్టిపెట్టాలి. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్‌ క్లినిక్‌లు, ఆర్బీకేలు, డిజిటల్‌ లైబ్రరీలు.. అన్నింటినీకూడా పూర్తిచేయాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఉపాధి హామీ నిధులు ఈనెలాఖరులోగా వచ్చేలా అధికారులు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కంపెనీల నుంచి సిమెంట్ స‌ప్ల‌య్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి కలెక్టర్లు ఒక నోడల్‌ అధికారిని నియమించుకోవాలి, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి.

సిమెంటు, స్టీలు, ఇసుక, మెటల్‌ సరఫరా సవ్యంగా సాగేలా నోడల్‌ అధికారికి బాధ్యతలు అప్పగించాలి. గ్రామాల్లో ఈ భవనాల నిర్మాణ బాధ్యతలను ఒకరికన్నా ఎక్కువ మందికి అప్పగించడం వల్ల పనులు చురుగ్గా సాగుతాయి. ప్రతి సచివాలయం పరిధిలో మరోసారి పునఃపరిశీలన చేసి.. భవనాల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలి. డిసెంబర్‌ నాటికి 4,545 డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం పూర్తికావాలి. అదే సమయానికి ఇంటర్నెట్‌ కేబుల్‌కూడా సంబంధిత గ్రామాలకు చేరుకుంటుంది. గ్రామాల్లోనే వర్క్‌ఫ్రం హోం అందుబాటులోకి వస్తుంది.

ఇళ్లనిర్మాణం..
తొలిదశలో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నాం. లే అవుట్లలో 11.9 లక్షలు, సొంతప్లాట్లు లేదా పొసిషన్‌ సర్టిఫికెట్లు పొందన వారి స్థలాల్లో 3.7 లక్షల ఇళ్ల నిర్మాణం చేయాలి. ఇళ్ల నిర్మాణంపై దృష్టిపెట్టాలి. కోర్టు కేసుల కారణంగా 42,639 ఇళ్ల నిర్మాణం పెండింగులో పండింది. ఈ కేసుల పరిష్కారం కోసం ప్రయత్నాలు చేయాలి. వీలుకాని పక్షంలో ప్రత్యామ్నాయ స్థలాలను ఎంపిక చేయాలి. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం అందాలి. అర్హులకు ఇళ్లు రాకుండా కత్తిరించడం అన్నది సరైనది కాదు. అర్హులందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాల్సిందే, దీనికి ఎంత ఖర్చైనా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కలెక్టర్లు దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.

ఆప్షన్ - 3 ఎంపిక చేసుకున్న ఇళ్ల నిర్మాణంపైనా కలెక్టర్లు దృష్టిపెట్టాలి. ప్రతి వేయి ఇళ్లకూ ప్రత్యేకంగా ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ను పెట్టాలి. ఇళ్ల నిర్మాణం పూర్తిచేసే బాధ్యతను వారికి అప్పగించాలి. రోజూ వారి నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలి. లే అవుట్లలో కనీస మౌలిక సదుపాయాల కల్పన పనులు శరవేగంగా పూర్తిచేయాలి. ఆప్షన్ - 3 కింద ఇళ్ల నిర్మాణాన్ని ఈనెల 28న ప్రారంభిస్తున్నాం. అదే రోజు 1.23 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. అదే రోజున 1.79 లక్షల పీఎంఏబై, వైయ‌స్ఆర్ -గ్రామీణ్‌ ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభిస్తున్నాం. తద్వారా మొత్తంగా చూస్తే మొదటి విడత ఇళ్ల నిర్మాణంలో భాగంగా 15.6 లక్షలు, టిడ్కోలో 2.62 లక్షలు, విశాఖపట్నంలో 1.23 లక్షలు, పీఎంఏవై-వైయ‌స్ఆర్ గ్రామీణ్‌ ద్వారా 1.79లక్షల ఇళ్లు నిర్మాణాలు జరుగుతాయి. అంటే 21.24 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతున్నట్టు లెక్క. అలాగే పెద్ద లే అవుట్లలో బ్రిక్‌ తయారీ యూనిట్లు నెలకొల్పడంపైనా దృష్టిపెట్టాలి. 

ఇళ్ల నిర్మాణం జరుగుతున్న లే అవుట్లలో నీరు, కరెంటు సదుపాయాలను కల్పించాలి. మురుగునీరు పోచే సదుపాయాలను కూడా కల్పించాలి. ఇళ్ల నిర్మాణం కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న స్థానిక ప్రజాప్రతినిధులను సత్కరిస్తాం. మండలానికో సర్పంచి, మున్సిపాలిటీలో కౌన్సిలర్, జిల్లాకు ఒక ఎంపీపీ, జిల్లాకు ఒక జడ్పీటీసీ చొప్పున వారికి అవార్డులు ఇస్తాం.

ఇళ్ల నిర్మాణం, స్కూళ్లు, ఆస్పత్రుల్లో నాడు – నేడు, సమగ్ర భూసర్వే, స్పందనలో అర్జీల పరిష్కారంలో నాణ్యత, ఎస్‌డీజీ లక్ష్యాలు, ఉపాధిహామీ పనులు, సచివాలయాల పనితీరు.. ఈ అంశాల్లో ప్రగతి ఆధారంగా కలెక్టర్లు, జేసీల పనితీరును మదింపు చేస్తాం. ఏసీబీ, ఎస్‌ఈబీ, దిశ, సోషల్‌మీడియా ద్వారా వేధింపుల నివారణ అంశాల్లో ప్రగతి ఆధారంగా ఎస్పీల పనితీరును మదింపు చేస్తాం. ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించి ముందుకు సాగాలి. ఒక గంటలోపలే సమీక్ష చేసుకుని.. పనిలో ముందుకుసాగాలి. సమీక్ష పేరుతో అనవసరంగా కాలహననం వద్దు. సమీక్షలు క్రమం తప్పకుండా ముందుకు సాగాలి`` అని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ క‌లెక్ట‌ర్లు, ఇత‌ర అధికారుల‌కు సూచించారు.

తాజా వీడియోలు

Back to Top