చంద్ర‌బాబువ‌న్నీ బురద రాజకీయాలు

వ‌ర‌ద బాధితుల‌కు ప‌రిహారం శ‌ర‌వేగంగా అందించినా బుర‌ద‌జ‌ల్లుతున్నాడు

హుద్‌హుద్‌లో రూ.22వేల కోట్ల నష్టమ‌ని చెప్పిన ఆ పెద్ద మనిషి ఇచ్చింది రూ.550 కోట్లు మాత్ర‌మే

బాబు హ‌యాంలో నెల‌లు ప‌ట్టేది.. మ‌నం వారంలోగా అంద‌జేస్తున్నాం

ఏ సీజ‌న్‌లో పంట న‌ష్ట‌పోతే ఆ సీజ‌న్ ముగిసేలోగా ప‌రిహారం

ప్ర‌తి కుటుంబానికి నిత్యావ‌స‌రాల‌తో పాటు అదనంగా రూ.2 వేల సాయం

చెరువులు గండ్లు పడకుండా జాగ్రత్త తీసుకోవాలి

తాగునీటికి కొరత రాకుండా తగిన చర్యలు తీసుకోవాలి

క‌లెక్ట‌ర్ల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశం

వరద బాధిత జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌

తాడేప‌ల్లి: పంట నష్టంపై ఎన్యుమరేషన్‌ పూర్తయినకొద్దీ.. వెంటనే సోషల్ ఆడిట్‌ కూడా నిర్వహించాల‌ని, పూర్తిగా ధ్వంసమైన ఇళ్ల స్థానంలోనే కొత్త ఇళ్లను మంజూరు చేసి వెంటనే పనులు కూడా మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించారు. ఇళ్లు లేని వారికి తాత్కాలిక వసతి ఏర్పాటు చేయాలని, మళ్లీ నివాస వసతి ఏర్పడేంతవరకూ వారిని జాగ్రత్తగా చూసుకోవాల‌ని సూచించారు. వరద బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల పురోగతిపై వైయ‌స్ఆర్‌ కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. పాక్షికంగా దెబ్బతిన్న, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు పరిహారం, 104 కాల్‌ సెంటర్‌కు వచ్చిన కాల్స్, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలు, రూ.2వేల అదనపు సహాయం పంపిణీ, నిత్యావసరాల పంపిణీ, అధికారుల క్షేత్రస్థాయి పర్యటనల, రోడ్ల తాత్కాలిక పునరుద్ధరణ, చెరువుల భద్రత, గండ్లు పూడ్చివేత, తాగునీటి సరఫరా, గల్లంతైన వారికి నష్టపరిహారం, మరణించిన పశువులకు పరిహారం సహా పలు అంశాల‌పై ముఖ్య‌మంత్రి స‌మీక్షించారు. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో కురుస్తున్న వర్షాలపై కూడా సమాచారం అడిగి తెలుసుకున్నారు. అంశాలవారీగా ప్రగతిని అడిగి తెలుసుకొని అధికారులకు పలు ఆదేశాలిచ్చారు. 

చెరువులు గండ్లు పడకుండా జాగ్రత్త తీసుకోవాల‌ని సీఎం సూచించారు. చెరువుకు, చెరువుకు మధ్య అనుసంధానం ఉండాల‌ని, చెరువు నిండగానే అదనంగా వచ్చే నీటిని నేరుగా కాల్వలకు పంపించే వ్యవస్థ ఉండాలని, భవిష్యత్తులో దీనిపై దృష్టిపెట్ట‌ల‌ని క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించారు. తాగునీటి వసతుల పునరుద్ధరణపై దృష్టిపెట్టాల‌ని సూచించారు. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడంతో నీటిని నిల్వచేయలేని పరిస్థితి ఏర్ప‌డింద‌ని, అలాగే చాలాచోట్ల తాగునీటి సరఫరాకు ఆధారమైన చెరువులకు కూడా గండ్లు పడ్డాయని, వీటిమీద ఆధారపడ్డ పట్టణాల్లో, గ్రామాల్లో తాగునీటికి కొరత రాకుండా తగిన చర్యలు తీసుకోవాల‌ని ఆదేశించారు. వచ్చే వేసవికాలాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని బలమైన ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయాల‌న్నారు. నిత్యావసరాలు అందించిన ప్రతి కుటుంబానికి కూడా అదనపు సహాయం రూ.2వేలు అందాల‌ని ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లినప్పుడు వచ్చే విజ్ఞప్తులపై ఉదారంగా స్పందించాల‌ని సూచించారు. ఆర్బీకేల ద్వారా విత్తనాలను పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామ‌ని, ఆర్బీకేల్లో విత్తనాలు అందుబాటులో ఉంచామ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ తెలిపారు. 

ఆ పెద్ద మ‌నిషివి బురద రాజకీయాలు.. 
వ‌ర‌ద విప‌త్తు స‌మ‌యంలో కలెక్టర్లు, అధికారులు బాగా పనిచేసి పరిహారాన్ని శ‌ర‌వేగంగా బాధితుల‌కు అందిస్తే.. దానిపైన కూడా చంద్ర‌బాబు బురద జల్లుతున్నాడ‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మండిప‌డ్డారు. వరద బాధిత ప్రాంతాల్లో బాధితులను ఆదుకునేందుకు ఇంతటి శరవేగంగా చర్యలను తీసుకోవడం అన్నది గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. గతంలో చంద్ర‌బాబు హ‌యాంలో కనీసం నెల పట్టేద‌ని, ఇప్పుడు వారం రోజుల్లోనే బాధితుల‌కు స‌హాయాన్ని అందించామ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వివ‌రించారు. బాధిత కుటుంబాలకు అన్నిరకాలుగా నష్టపరిహారాన్ని అందించామ‌ని, గతంలో ఇల్లు ధ్వంసమైతే పరిహారం అందడానికి నెలరోజులు పట్టేదన్నారు. దురదృష్టవశాత్తు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి పరిహారం ఇవ్వాలంటే గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో నెలరోజులు పట్టేదని, గ‌ల్లంతైన వారికి ఎలాంటి పరిహారం ఇచ్చేవారు కాదన్నారు. అలాంటిది ఇవాళ వారంరోజుల్లో ఆయా కుటుంబాలకు పరిహారం ఇచ్చి వారిని అదుకున్నామ‌ని చెప్పారు. గతంలో రేషన్, నిత్యావసరాలు ఇస్తే చాలు అనుకునేవాళ్లు.. మనం వీటిని ఇవ్వడమే కాకుండా రూ.2వేలు అదనపు సహాయం కూడా ఇచ్చామ‌ని సీఎం చెప్పారు. గతంలో ఎప్పుడూ కూడా ఇలా చేయలేదన్నారు.

సీజన్‌ ముగిసేలోగా నష్టపోయిన రైతులకు సహాయం చేసిన దాఖలాలు లేవని, ఇప్పుడు నష్టపోయిన రైతులకు యుద్ధప్రాతిపదికన ఎన్యుమరేషన్‌ పూర్తిచేసి..సీజన్‌లోగా వారికి సహాయం అందిస్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ క‌లెక్ట‌ర్ల‌కు వివ‌రించారు. గతంలో ఇన్‌పుట్‌సబ్సిడీ అందాలంటే కనీసం సంవత్సరం.. ఆ తర్వాత కూడా ఇచ్చిన దాఖలాలు లేవని, ఇవాళ పంట నష్టపోయిన సీజన్‌ ముగిసేలోగానే మనం అందిస్తున్నామ‌ని చెప్పారు. రూ.6వేల కోట్లు నష్టం జరిగితే.. ఇచ్చింది రూ.34 కోట్లే అని విమర్శలు చేస్తున్నారని, జరిగిన నష్టంలో 40శాతం రోడ్లు రూపేణా, 30శాతానికిపైగా పంట రూపేణా, సుమారు 18శాతం ప్రాజెక్టులకు జరిగిన నష్టం రూపేణా జరిగింద‌న్నారు. హుద్‌హుద్‌లో రూ.22వేల కోట్ల నష్టం జరిగిందని చెప్పారని, ఇచ్చింది మాత్రం రూ.550 కోట్లేన‌ని, అదంతా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింద‌న్నారు. రూ.22వేల కోట్లు నష్టం వచ్చిందని చెప్పిన పెద్ద మనిషి చంద్ర‌బాబు.. ఇచ్చింది రూ.550 కోట్లు మాత్ర‌మేన‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వివ‌రించారు. 
 

తాజా వీడియోలు

Back to Top