వైయ‌స్ఆర్‌ బిడ్డగా నాలుగు అడుగులు ముందుకు..

సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

మహానేత వైయస్‌ఆర్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాలను 
ఆవిష్కరించిన సీఎం వైయస్‌ జగన్‌

ఇద్దరు మహానుభావుల విగ్రహాలను ఆవిష్కరించడం సంతోషంగా ఉంది

పేదలు, రైతుల సంక్షేమం అంటే గుర్తుకొచ్చే పేరు మహానేత వైయస్‌ఆర్‌

మంచి చేసిన వైయస్‌ఆర్‌ ఒక్క అడుగు వేస్తే.. మీ  బిడ్డగా నాలుగు అడుగులు ముందుకు వేయగలిగా..

ఏప్రిల్‌ 14న విజయవాడలో అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ

రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచ్చిన ఘనత వైయస్‌ఆర్‌కే దక్కుతుంది

గ్రానైట్‌ పరిశ్రమలకు కొత్త శ్లాబ్‌ సిస్టమ్‌

చిన్న గ్రానైట్‌ పరిశ్రమలకు కరెంటు చార్జీల్లో యూనిట్‌కు రూ.2 తగ్గింపు

 ప్రాజెక్టు వెలిగొండను 2023 సెప్టెంబర్‌ నాటికి పూర్తి చేస్తా 

మొగిలిగుండ్ల చెరువుకు బూచేపల్లి సుబ్బారెడ్డి పేరు

ద‌ర్శి: పేదల సంక్షేమం అంటే ముందుగా గుర్తొచ్చే పేరు దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తెలిపారు. రైతుల సంక్షేమం, ఉచిత విద్యుత్‌‌, ఫీజు రీయంబర్స్‌మెంట్‌, ఆరోగ్యం.. ఇలా ఎంతో మంచి చేశార‌న్నారు. ఆయన ఒక అడుగు వేస్తే.. వైయ‌స్ఆర్ బిడ్డగా తాను నాలుగు అడుగులు ముందుకు వేస్తానని సీఎం వైయ‌స్ జగన్‌ మరోసారి వేదిక సాక్షిగా ప్రకటించారు. ఇచ్చినమాట ప్రకారం.. 95 శాతం మేనిఫెస్టో హామీలను ఇప్పటికే నెరవేర్చామని, దేవుడి దయ.. ప్రజల ఆశీస్సులతో మరింత మంచి చేస్తామని మాటిచ్చారు.  మంచి చేస్తే మనిషికి మరణం ఉండదని, ప్రతీ గుండెలోనూ సజీవంగా నిలిచే ఉంటారనడానికి నిదర్శనం ఇవాళ జరిగిన విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమమే అని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం చీమకుర్తిలో మహానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాలను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆవిష్క‌రించారు. అనంతరం.. బహిరంగ సభలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రసంగించారు.

  •  

    ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే....:

    చెరగని చిరునవ్వులతో ఆప్యాయతలు పంచిపెడుతున్న ప్రతిఅక్కా, ప్రతి చెల్లెమ్మ, ప్రతి సోదరుడు, స్నేహితుడుకి, ప్రతి అవ్వా తాతలకు చేతులు జోడించి పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు. 

    ఇద్దరు మహానుభావుల విగ్రహావిష్కరణలో పాలుపంచుకున్నా...
    ఈ రోజు ఇద్దరు మహానుభావుల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాలుపంచుకున్నాను. ఒక మనిషి మంచి చేస్తే ఆ మనిషికి చావు ఉండదని.. ఆ మనిషి చనిపోయిన తర్వాత కూడా ప్రతిగుండెలోను కూడా బ్రతికుంటాడు అనేదానికి నిజమైన ఉదాహరణ.. ఈ రోజు జరిగిన ఈ రెండు విగ్రహావిష్కరణలు.

    తెలుగునేలమీద గుర్తుండిపోయే శిఖరం– వైయస్సార్‌
    పేదల సంక్షేమం.. రైతుల సంక్షేమం ఈ పదాలు చెప్పినప్పుడు తెలుగునేల మీద ఎప్పటికీ కూడా గుర్తుండిపోయే ఒక శిఖరం దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి గారు. రైతులకు ఉచిత విద్యుత్‌ అంశం తీసుకుంటే.. ఆ రోజుల్లో రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వాలంటే ఇలా తీగలు చూపించి..  బట్టలు ఆరేసుకోవడానికి ఈ తీగలు తరమవుతాయి అన్న పరిస్థితులు. అలాంటి పరిస్థితులలో రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వగలుగుతాము.. ఇచ్చి తీరుతాం అని చెప్పి మొట్టమొదటి సంతకం పెట్టి అమలు చేసిన దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి గారు గుర్తుకువస్తారు. 

    పేదవాడి గొప్ప చదువుల కోసం –ఫీజు రీయింబర్స్‌మెంట్‌.
    పేదవాడు ఆ పేదరికం నుంచి బయటకు రావాలంటే ఆ పిల్లలు గొప్పగా చదువుకోవాలి. చదువొక్కదానివల్లనే ఆ పేదరికం నుంచి బయటకు వస్తాడని గతంలో రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని తీసుకువచ్చి... ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అట్టడున ఉన్న పేద వర్గాలకు చదువు అనే ఆస్తిని పంచిపెట్టిన దివంగత నేత రాజశేఖర్‌ రెడ్డి గారే గుర్తుకు వస్తారు. 

    పేదవాడు ఆరోగ్యం బాగాలేకపోయినప్పుడు కుయ్‌.. కుయ్‌ అంటూ సైరన్‌ మోగినప్పుడు ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర్‌రెడ్డిగారే గుర్తుకు వస్తారు. 
    లక్షల ఇళ్ల నిర్మాణాలు, జలయజ్ఞం ఇలాంటి వన్నీ చెప్పుకుంటూ పోతే దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి గారు వేసిన అడుగులు ఎప్పటికీ మర్చిపోలేని పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది.

    ఆయన కొడుకుగా నాలుగు అడుగులు వేస్తూ...
    అంత మంచి చేసిన దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి గారు ఒక అడుగు వేస్తే.. ఆయన కొడుకుగా జగన్‌ మీ బిడ్డగా నాలుగు అడుగులు ముందుకు వేస్తాడని మాట ఇవ్వడమే కాకుండా... దేవుని చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులతో ఈరోజు.. ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో  95 శాతం హామీలను నెరవేరుస్తూ అడుగులు ముందుకు వేయగలిగాం.

    నాన్నగారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించాల్సిందిగా ఎప్పటి నుంచో నా తమ్ముడు బూచేపల్లి శివ చాలా సందర్భాలలో అడిగాడు. ఇవాళ నాన్నగారి విగ్రహంతో పాటు, నాన్నగారితో పాటు కలిసి అడుగులు వేసిన బూచేపల్లి సుబ్బారెడ్డి గారి విగ్రహాన్ని కూడా ఇవాళ ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది.

    ఏప్రిల్‌లో విజయవాడలో అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ...
    ప్రజల గుండెల్లో కలకాలం ఉండే నాయకులు, వారి చేసిన మంచి పనులకు మద్ధతుగా వారి మనస్తత్వం కూడా కనిపిస్తోంది.  కాబట్టే ఒకవైపు నాన్నగారైనా, మరోవైపు సుబ్బారెడ్డి గారైనా ఇలాంటి నాయకులను ఎవరూ మర్చిపోలేరు.  మరోవైపు విజయవాడలో అంబేద్కర్‌ గారి విగ్రహాన్ని కూడా రాబోయే ఏప్రిల్‌ 14న అవిష్కరణ కూడా చేయబోతున్నాం.
    గాంధీగారైనా, అంబేద్కర్, పూలే అయినా జగజ్జీవన్‌రాం, ఒక మౌలానా అబుల్‌ కలామ్, ఒక అల్లూరి, ఒక టంగుటూరి ప్రకాశం, ఒక మహానేత వైయస్సార్‌ గారు.. వీరందరినీ కలకాలం తలుచుకుంటూ ఉంటాం.  ఎందుకంటే వీరి శరీరాలకు మరణముంటుందేమో కానీ వీరి చేసిన మంచి పనులకు, వీరి భావాలకు మాత్రం ఎప్పటికీ మరణం ఉండదు అన్నది అంతే వాస్తవం.

    పాదయాత్రలో హామీ ఇచ్చాను...
    ఈ రోజు మరో విషయం కూడా మీ అందరితో పంచుకోవాలి. నా పాదయాత్ర సందర్భంగా స్టోన్‌ కటింగ్‌ అండ్‌ ఫాలిషింగ్‌ యూనిట్లకు సంబంధించి చిన్న, చిన్న యాజమాన్యాలతో పాటు ఒక్కొక్క యూనిట్‌లో కనీసం పదిమందికి ఉపాధి కల్పిస్తున్న చిన్న, చిన్న పారిశ్రామిక వేత్తలు గత ప్రభుత్వంలో వారికి జరుగుతున్న అన్యాయాలను నా దృష్టికి తీసుకువచ్చారు.
    అప్పుడు గ్రానైట్‌ పరిశ్రమకు మరలా మంచి రోజులు వస్తాయని నా పాదయాత్ర సందర్భంగా నేను ఇచ్చిన మాట నాకు ఈ రోజుకీ గుర్తుంది. 

    ఇచ్చిన మాట మేరకు మరలా స్లాబ్‌ సిస్టం అమలు...
    ఆ రోజు ఏదైతే చెప్పానో మహానేత హయాంలో మాదిరిగానే మళ్లీ స్లాబ్‌ సిస్టంను తీసుకువస్తున్నాం. ఇక్కడకు వచ్చే ముందే నేను ఈ విషయం గుర్తుపెట్టుకుని.. .ఇక్కడకి రాకమునుపే జీవో కూడా జారీ చేశాం.
    నాన్నగారి హయంలో తీసుకువచ్చిన ఆ స్లాబ్‌ విధానాన్ని.. 2016లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఫలితంగా అప్పటికే అంతంత మాత్రంగా నడుస్తున్న చిన్న, చిన్న గ్రానైట్‌ కర్మాగారాలన్నీ కూడా మరింత కష్టాల్లోకి కూరుకుపోయాయి. 

    జీవో నంబరు 58 – 7 వేల యూనిట్లకు లబ్ధి.
    దాదాపుగా 7 వేల యూనిట్లకు లబ్ది చేకూర్చే విధంగా కొత్త విధానాన్ని తీసుకువస్తూ.. మన ప్రభుత్వం జీవో నంబరు 58ని విడుదల చేసింది. 
    ప్రకాశం జిల్లాలో గెలాక్సీ గ్రానైట్‌ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.... 
    22 క్యూబిట్‌ మీటర్ల వరకూ ముడి గ్రానైట్‌ను ప్రాసెస్‌ చేసే యూనిట్లకు సింగిల్‌ బ్లేడ్‌కు రూ.27వేలు, మల్టీ బ్లేడ్‌కు రూ.54 వేలు నెలకు ఇచ్చేట్టుగా స్లాబ్‌ సిస్టంను తీసుకువస్తున్నాం. 

    శ్రీకాకుళం, రాయలసీమ జిల్లాల్లో అయితే సింగిల్‌ బ్లేడ్‌కు రూ.22వేలు, మల్టీబ్లేడ్‌కు రూ.44వేలు సీనరేజ్‌ స్లాబ్‌గా నిర్ణయించాం. ఇలా స్లాబ్‌ విధానం అమలు చేయడం వల్ల మన ప్రభుత్వానికి ఏడాదికి రూ.135 కోట్లు నష్టం వాటిల్లుతుంది. ఆ నష్టం జరుగుతుందని తెలిసినా కూడా మీ కడుపు నిండడం, మీరు బాగా ఉండడం అవసరం అని భావించి మరలా స్లాబ్‌ విధానాన్ని తీసుకువచ్చాం. 
    ఇప్పడు ప్రకటించిన ఈ కొత్త విధానం వల్ల చిన్న, చిన్న గ్రానైట్‌ పాలిషింగ్‌ యూనిట్లు మరలా ఊపందుకుంటాయి. వాటితో ముడిపడి ఉన్న రవాణారంగం, మార్కెటింగ్‌ రంగంలో కూడా అవకాశాలు మెరుగుపడతాయి. ఈ చిన్న, చిన్న పరిశ్రమలు ద్వారా కార్మికులకు మేలు జరుగుతుందని మనస్ఫూర్తిగా నమ్మి ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం.

    పవర్‌ ఛార్జీలు తగ్గిస్తూ మరో మేలు కూడా....
    మరో కార్యక్రమం కూడా చేస్తున్నాం. చిన్న, చిన్న గ్రానైట్‌ పరిశ్రమలకు చంద్రబాబు హాయాం నుంచి ఇంతవరకు కరెంటు ఛార్జీలు హెచ్‌టీకి రూ.6.30, ఎల్‌టీకి రూ.6.70 ఉన్నాయి. ఆ ఛార్జీలను ఇకమీదట నుంచి రూ.2 తీసేస్తున్నాం.ఈ కరెంటు ఛార్జీలు రూ.2 తగ్గించడం వలన ఏకంగా రూ.210 కోట్లు ప్రభుత్వం మీద భారం పడుతుంది. ఈ రెండు కార్యక్రమాల వల్ల రూ.350 కోట్లు నష్టం వాటిల్లుతున్నా... దీనిమీద ఆధారపడి ఉన్న చిన్న, చిన్న పరిశ్రమలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, వాటి మీద ఆధారపడిన లక్షలాది మంది కార్మికులకు మంచి జరుగుతుంది. 
    దేవుడి దయతో వీళ్లందరికీ ఇంకా మంచి జరగాలని ఆశిస్తూ.. ఈ రెండు కార్యక్రమాలను ఇవాల్టి నుంచి అమలు చేస్తున్నాం. 

    వెలుగొండ నాడు–నేడు 
    ఒకవైపు చిన్న, చిన్న గ్రానైట్‌ పరిశ్రమలకు, కార్మికులకు చేసే మేలుతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రైతులందరికీ మేలు చేసే వెలుగొండ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు గతంలో పని ఎలా జరిగింది ఇప్పుడు ఎలా అడుగులు ముందుకు వేస్తున్నాం అని చెప్పాల్సి వస్తే... 

    వెలుగొండ ప్రాజెక్టులో మొదటి టన్నెల్‌ 18.80 కిలోమీటర్లు, రెండో టన్నెల్‌ 18.78 కిలోమీటర్లు. ఈ రెండు టన్నెల్స్‌కి సంబంధించిన పురోగతి చూస్తే.. 2014 చంద్రబాబు రాకమునుపు వరకు చూస్తే.. దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి ఈ ప్రాజెక్టు పనులను ఉరుకులు, పరుగులు పెట్టించారు.

    18.80 కిలోమీటర్ల మొదటి టన్నెల్‌లో దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి గారి సువర్ణ పరిపాలనలో 2014 వచ్చేనాటికి.. ఏకంగా 11.58 కిలోమీటర్లు మేర మొదటి టన్నెల్‌ పనులు పూర్తయ్యాయి.
    మరో 18.78 కిలోమీటర్ల రెండో టన్నెల్‌లో... 2014 వచ్చేటప్పటికి అంటే.. చంద్రబాబు హయాం నాటికి 8.74 కిలోమీటర్ల పురోగతి సాధించగలిగింది. 
    చంద్రబాబు సీఎం అయిన తర్వాత మొదటి టన్నెల్‌లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన పని కేవలం 4.33 కిలోమీటర్లు.
    రెండో టన్నెల్‌లో కేవలం 2.35 కిలోమీటర్లు మాత్రమే చేసి చేతులు దులుపుకున్నారు. 

    వెలుగొండ –2023 సెప్టెంబరు నాటికి జాతికి అంకితం....
    ఇటువంటి పరిస్థితుల్లో గర్వంగా మీ బిడ్డగా తెలియజేస్తున్నా.. మొదటి టన్నెల్‌కు సంబంధించి 18.80 కిలోమీటర్లకు గాను.. మిగిలిపోయిన 2.9 కిలోమీటర్లు ఇప్పటికే పూర్తి చేశాం. అంతే కాకుండా ఈ టన్నెల్‌ నుంచి యాక్సెస్‌ తీసుకుని రెండో టన్నెల్‌ పనులను కూడా వేగవంతం చేస్తున్నాం. రెండో టన్నెల్‌లో ఇప్పటికే 3.71 కిలోమీటర్లు పూర్తయింది. మిగిలిన 3.96 కిలోమీటర్లు కూడా సెప్టెంబరు 2023 నాటికి పూర్తి చేసి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తాం.
    ఈప్రాజెక్టును ప్రారంభించే ఎన్నికలకు వెళ్తాం.  ఈ ప్రాజెక్టు వల్ల ప్రకాశం జిల్లా రూపు రేఖలు అన్నీ సమూలంగా మారుతాయి. అలా మారాలని కోరుకుంటూ మంచి జరగాలని దేవుడిని ప్రార్ధిస్తున్నాను.

    జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ గారు  రెండు పనులు అడిగారు. ఒంగోలులో జిల్లా పరిషత్‌ కార్యాలయ భవనం శిధిలావస్థకు చేరింది, రూ.20 కోట్లతో కొత్త భవనం కోసం అడిగారు. దాన్ని మంజూరు చేస్తున్నాం. తుళ్లూరు మండలంలోని శివరాంపురంలో ఉన్న మొగలిగుండ్లు చెరువును మినీరిజర్వాయర్‌గా మార్చే పనిని చేపట్టాం. ఈ సందర్భంగా ఆ రిజర్వాయర్‌ పేరును బూచేపల్లి సుబ్బారెడ్డి రిజర్వాయర్‌ పేరుగా మార్చమని అడిగారు. అమ్మ అడగిన ఆ పని కూడా చేస్తూ.. ఆ ప్రాజెక్టును ఇక మీదట బూచేపల్లి సుబ్బారెడ్డి రిజర్వాయర్‌గా మార్పుచేస్తూ ఆదేశాలు ఇస్తున్నాను. 

     ఈ ప్రాంతానికి మంచి జరగాలని, మంచి చేసే అవకాశం దేవుడి ఇవ్వాలని,ఈరోజు తీసుకున్న నిర్ణయాల వల్ల చాలామంది జీవితాల్లో చిరునవ్వులు ఇంకా అధికం కావాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు.

Back to Top