మద్యపానం నియంత్రించాలన్నదే మా లక్ష్యం

సహజ మరణాలపై టీడీపీ రాజకీయం 

టీడీపీ తీరుపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆగ్ర‌హం

అమరావతి: మద్యపానం నియంత్రించాలన్నదే తమ లక్ష్యమని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. సాధారణ మరణాలపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం మరణాలపై టీడీపీ చేస్తోన్న అసత్య ప్రచారంపై ఆయన అసెంబ్లీలో స్పందిస్తూ.. నేచురల్‌ డెత్స్‌పై టీడీపీ రాజకీయం చేస్తోందన్నారు. సహజ మరణాలను కూడా వక్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు.

 కల్తీ మద్యం మరణాలు గతంలోనే అనేక సార్లు జరిగాయి. కల్తీ మద్యాన్ని తమ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తోందని.. రాష్ట్రంలో బెల్ట్‌ షాపులను సమూలంగా నిర్మూలించామన్నారు. ‘‘లాభాపేక్షతో గత ప్రభుత్వం మద్యం అమ్మకాలు జరిపింది. బడి, గుడి సమీపంలో కూడా యథేచ్ఛగా మద్యం అమ్మారు.’’ అని సీఎం ధ్వజమెత్తారు. సహజ మరణాలు దేశవ్యాప్తంగా జరుగుతుంటాయి. దేశంలో ఎక్కడైనా 90 శాతం సహజ మరణాలే ఉంటాయి. అన్ని మరణాలు ఒకే చోట జరిగినవి కాదు. సాధారణ మరణాలపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని’’ సీఎం మండిపడ్డారు. తమ హయాంలో 43 వేల బెల్టు షాపులను ఎత్తివేశామ‌ని స‌భ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వెల్ల‌డించారు. 

సీఎం ఏమన్నారంటే..

సాధారణ బడ్జెట్‌ మీద చర్చ ప్రారంభం కాబోతుంది. గౌరవ తెలుగుదేశం శాసనసభ్యులు ఇంకా మా పంథా మాదే అన్నట్టుగా నిరసన తెలుపుతూ, అల్లరి చేస్తూ, గొడవలు చేస్తూ వారి కార్యక్రమాన్ని వారు కొనసాగిస్తున్నారు. జంగారెడ్డి గూడెంలో జరిగిన విషయాల గురించి, అక్కడి పరిస్థితులు గురించి ఉపముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల నాని ఇంతకముందు సుదీర్ఘంగా చెప్పారు. 

జంగారెడ్డి గూడెం జనాభా 2011 జనభా లెక్కల ప్రకారం 48,994 మంది.  ప్రస్తుతం 2022లో ఉన్నాం. ఈ దశాబ్ద కాలంలో 12 శాతం గ్రోత్‌రేట్‌ తీసుకుంటే... అక్కడ జనాభా 54,880 మంది నివాసముంటున్నారు. ఇంత పెద్ద మున్సిపాల్టీలో జరిగిన మరణాలన్నీ ఒకేచోట జరిగినవి కాదు. మొత్తం మున్సిపాల్టీలో కలిపి జరిగిన మరణాలే వీళ్లు చెపుతున్న ఈ 18 మంది. దేశవ్యాప్తంగా,రాష్ట్ర వ్యాప్తంగా మరణాల సంఖ్య అంచనా 2 శాతం డెత్‌రేటు వేసుకున్నా.. కనీసం 90 మంది సహజంగానే అనారోగ్యం వల్ల, వయోభారం వల్ల, ప్రమాదాలు వల్ల కానీ చనిపోవటం అనేది ఎక్కడైనా జరుగుతుంది. అలాంటిది ఈ మాదిరిగా సహజ మరణాలను కూడా వక్రీకరించి మాట్లాడ్డం మనం ఇక్కడే చూస్తున్నాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏమిటంటే ప్రతినెలా 60 మంది చనిపోతుంటారు.

 ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... కల్తీ మద్యం తయారు చేసే వాళ్లను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సపోర్టు చేస్తుంది. చంద్రబాబునాయుడు గారి హయాంలో గతంలో అక్రమ మద్యం తయారీ జరిగింది. ఇప్పుడు కొత్తగా జరిగిందీ కాదు. వాళ్ల హయాంలో జరగనదీ, మన హయాంలో ఇప్పుడు కొత్తగా జరుగుతున్నదీ కాదు. అప్పుడూ జరిగింది. ఇప్పుడూ అక్కడక్కడా జరుగుతుంది, నేను కాదనడం లేదు. 

కాబట్టే... స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎస్‌ఈబీ) అనే ప్రత్యేకమైన పోలీస్‌ ఫోర్స్‌ను తీసుకొచ్చాం. ఎక్కడైనా ఇటువంటి కార్యక్రమాలు జరిగితే ఉక్కుపాదంతో అణిచివేయమని పూర్తి ఆదేశాలు ఇచ్చాం. ఎక్కడా ఉపేక్షించాల్సిన అవసరం లేదని చాలా స్పష్టమైన సంకేతాలు ఇచ్చాం. 

మా ఉద్దేశ్యం, మా తపన అంతా మద్యం వినియోగాన్ని తగ్గించాలనే. అదే ఉద్దేశ్యంతో అధికారంలోకి వచ్చిన వెంటనే 43వేల బెల్టు షాపులను పూర్తిగా లేకుండా చేశాం. చంద్రబాబునాయుడు గారి హయాంలో 43వేల బెల్టుషాపులు రాష్ట్రంలో ప్రబలి ఉంటే వాటిని పూర్తిగా రద్దు చేశాం. అంతే కాకుండా 4380 మద్యం షాపులు ఉండేవి. ఈ 4380 మద్యం షాపులు పక్కనే పర్మిట్‌ రూమ్‌లు అని అనుమతి ఇచ్చారు. అక్కడే 50–60 మంది కూర్చోవడం,  మద్యం తాగడం చేసేవారు. ఆడవాళ్లు ఎవరైనా ఆ దారిలో పోవాలంటే భయపడే పరిస్థితి ఉండేది. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేశాం. 

గతంలో లాభ ఆపేక్షతో మద్యాన్ని విచ్చలవిడిగా బెల్టుషాపుల ద్వారా అమ్మే కార్యక్రమం జరిగేది. విచ్చలవిడిగా మద్యం ప్రతి బడి పక్కన, ప్రతి గుడి పక్కన గ్రామంలో ఎక్కడ బడితే అక్కడే దొరికే పరిస్థితి ఉండేది. 
ఇవన్నీ కూడా పూర్తిగా పోయి, లాభ ఆపేక్ష ఉంటే ఏనాటికైనా వీటిని ఆపలేమనే ఉద్దేశ్యంతో... ప్రభుత్వమే రంగ ప్రవేశం చేసి మద్యం షాపులన్నీ ప్రభుత్వమే నడిపే కార్యక్రమం చేస్తుంది. కాబట్టే... ఫలానా సమయానికి మూసేయాలంటే సరిగ్గా అదే సమయానికి మద్యం షాపులు మూసివేస్తున్నారు. గతంలో రాత్రి 12గంటలు, ఒంటి గంట వరకు కూడా మద్యం షాపులు తెరిచి ఇష్టమొచ్చినట్లు తాగించే పరిస్థితి. ఎక్కడ కావాలంటే అక్కడే మద్యం దొరికేది. 

ఆ పరిస్థితులను పూర్తిగా మార్చివేసి, నిర్ణీత కాలపరిమితిలో, నిర్ణీత సమయాల్లో మాత్రమే మద్యం అందుబాటులో ఉండే పరిస్థితిని ఇవాళ తీసుకొచ్చాం. మనం తీసుకున్న చర్యలతో పాటు షాక్‌ కొట్టే విధంగా రేట్లు తీసుకొచ్చాం. దీనివల్ల మద్యం వినియోగం తగ్గింది. మద్యం వినియోగం తగ్గినా ఈ రకంగా రేట్లు ఎక్కువగా పెట్టడం వల్ల, అక్రమ మద్యంకు ఎక్కువ అవకాశం వస్తుంది. ఈ ధరలు తగ్గిస్తేనే అక్రమ మద్యాన్ని తగ్గించగలుగుతామని ఎస్‌ఈబీ నివేదిక దగ్గర నుంచి అందరూ, ప్రతిపక్షపార్టీల సహా అందరూ చెప్పడం మొదలుపెట్టేసరికి.... దాన్ని కూడా మంచి ఉద్దేశ్యంతో తీసుకుని మరలా ధరలు కూడా తగ్గించాం. మనం రేట్లు తగ్గించిన తర్వాత.. మన రేట్లు  ఎక్కువ, విపరీతంగా పెంచామని ఎవరూ చెప్పడానికి కూడా అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న రేట్లే మరలా తీసుకొచ్చాం. అలాంటప్పుడు కల్తీ మద్యం ఎలా ప్రబలుతుంది. ఏరంకగా కల్తీ మద్యం విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇవాళ కూడా చెబుతున్నా... కల్తీ మద్యం తయారు చేసే వాళ్లను రక్షించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వం ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉంది. ఎవరైనా అటువంటి కల్తీ మద్యం చేస్తుంటే... వాళ్లను ఉక్కుపాదంతో అణిచివేయమని స్పష్టమైన ఆదేశాలు ఎస్‌ఈబీకు ఉన్నాయి. ఎక్కడా దాచిపెట్టాల్సిన అవసరం లేదు. కానీ లేని విషయాన్ని ఉన్నట్టుగా, సహజమరణాలను కూడా అక్రమ మద్యం వల్ల చనిపోయినట్టుగా భ్రమకల్పిస్తూ... నానారకాలుగా యాగీ చేసి ఈ మాదిరిగా చేయడం తప్పు అని మాత్రం కచ్చితంగా గౌరవ తెలుగుదేశం సభ్యులకు ఈ సభద్వారా చెప్పదల్చుకున్నాను.

ఎందుకంటే ఈ రోజుకి అక్రమ మద్యంపై 13 వేల కేసులను ఎస్‌ఈబీ నమోదు చేసింది. తప్పు చేసిన వాళ్ల మీద ఎందుకు 13వేల కేసులు రిజిస్టర్‌ చేశామంటే....  అక్రమ మద్యం ఎక్కడా ఉండకూడదనే తపన, తాపత్రయంతోనే చేస్తున్నాం. ఇదే రకంగా చేస్తుంటే.... జరగని విషయాన్ని జరిగినట్టుగా, కల్తీ మద్యం వల్ల ఏదో జరిగిపోతుంది అన్నట్టు భ్రమ కల్పిస్తూ... వీరు చేస్తున్న అన్యాయమైన పనిని మాత్రం మానుకోవాలని చెప్పి మీ ద్వారా సభకు తెలియజేస్తున్నాను. అని సీఎం తన ప్రసంగం ముగించారు.

Back to Top