రైతులకు నష్టం కలిగిస్తే ఊరుకోబోం  

 సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆగ్రహం  

తాడేపల్లి: రైతులకు నష్టం కలిగిస్తే ఊరుకోబోమని సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ హెచ్చరించారు. రైతులకు అండగా నిలిచేందుకు ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చినా సిండికేట్‌గా మారి రైతులను నష్టపరచడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆక్వా రైతుల ఫిర్యాదులపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. ముగ్గురు మంత్రులు, సీనియర్‌ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఆక్వా ధరల పతనం, ఆక్వా ఫీడ్‌ పెంపుపై సీఎంకు రైతులు, రైతు సంఘాల నేతల ఫిర్యాదు చేశారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గించేస్తున్నారని, ధరలు పతనమై నష్టపోతున్నామని రైతులు పేర్కొన్నారు. అలాగే ఆక్వాఫీడ్ విషయంలోనూ వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు పెంచారని ఫిర్యాదు చేశారు.
 
 
తన దృష్టికి వచ్చిన అంశాలను తీవ్రంగా పరిగణించిన సీఎం..  ముగ్గురు మంత్రులు, సీనియర్‌ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసిన సీఎం.. వారం రోజుల్లో నివేదిక అందించాలన్నారు. నివేదిక ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, సీఎస్‌, సీనియర్‌ అధికారులు విజయానంద్‌, పూనం మాలకొండయ్య, కన్నబాబులతో ప్రభుత్వం కమిటీని నియమించింది.

Back to Top