కొత్త జిల్లాల‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ కీల‌క ఆదేశాలు

తాడేప‌ల్లి: ఉగాది నాటికి కొత్త జిల్లాల నుంచి కలెక్టర్లు, ఎస్పీలు కార్యకలాపాలు సాగించాలని ఉన్న‌తాధికారుల‌ను ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు కావాల్సిన వనరులపై సీఎం సమీక్షించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం ధర్మాన  కృష్ణదాస్, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఇప్పుడున్న జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలనే కొత్త జిల్లాలకు పంపాలని, వారికున్న అనుభవం కొత్త జిల్లాలకు ఉపయోగపడుతుందన్నారు. పరిపాలన సాఫీగా సాగడానికి వీరి అనుభవం ఉపయోగపడుతుందన్నారు. ఇప్పుడున్న 13 జిల్లాల‌ను 26 జిల్లాలు చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరింది. ఈ నెల 26 వరకు అభ్యంతరాలు తెలిపే అవకాశం ఇచ్చింది. 

Back to Top