జూలై 1 నుంచి కొత్త మార్పులతో ‘వైయస్‌ఆర్‌ బీమా’ అమలు

మరణించిన వ్యక్తి కుటుంబానికి నేరుగా ప్రభుత్వసాయం

బీమా పరిహారంపై ప్రత్యేక అధికారిని నియమించాలి

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశం

తాడేపల్లి: వైయస్‌ఆర్‌ బీమా పథకంపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం వైయస్‌ జగన్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరణించిన వ్యక్తి కుటుంబానికి వైయ‌స్ఆర్ బీమా ప‌థ‌కం ద్వారా నేరుగా ప్రభుత్వ సాయం అందాలని అధికారులను ఆదేశించారు. కుటుంబంలో సంపాదించే 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు వ్యక్తి సహజంగా మరణిస్తే రూ. లక్ష సాయం అందించాలని, అదే విధంగా కుటుంబంలో సంపాదించే 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 5 లక్షల పరిహారం అందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. జూలై 1 నుంచి కొత్త మార్పులతో కూడిన వైయస్‌ఆర్‌ బీమా పథకాన్ని అమలు చేయాలని సూచించారు. జూలై 1లోగా క్లెయిమ్‌లన్నింటినీ పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. బీమా పరిహారాలపై దరఖాస్తు అందిన నెల రోజుల్లో చెల్లించాలని, ఇందుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని ఉన్నతాధికారులను సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. 

ఇవేకాకుండా  రైతుల మరణాలు, ప్రమాదవశాత్తూ మత్స్యకారులు మరణించినా, పాడిపశువులు మరణించినా తదితర వాటికి ఇచ్చే బీమా పరిహారాలన్నీకూడా దరఖాస్తు అందిన నెలరోజుల్లోగా చెల్లించాలని సీఎం ఆదేశించారు. దీనికోసం ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. నెలరోజుల్లోగా క్లెయిములను పరిష్కరించి బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలని సూచించారు. అన్నిరకాల ఇన్సూరెన్స్‌ క్లెయిములకు సంబంధించి ప్రతి 3 నెలలకు కలెక్టర్లు కచ్చితంగా నివేదిక ఇవ్వాలని ముఖమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. ఎన్ని క్లెయిములు వచ్చాయి? ఎన్ని పరిష్కరించాం? ఎంతమందికి పరిహారం చెల్లించామన్నదానిపై పర్యవేక్షణ చేయాల‌ని ఆదేశించారు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయినప్పుడు వారికి ఆసరాగా నిలవాల్సిన అవసరం ఉంద‌న్నారు. దీంట్లో జాప్యం ఉండకూడదు, ఎవ్వరికీ పట్టని వ్యవహారంగా ఉండకూడద‌ని సూచించారు. ఇన్సూరెన్స్‌ దరఖాస్తుల స్క్రీనింగ్‌ బాధ్యతను, గ్రామ,  వార్డు సచివాలయాలను అప్పగించాల‌ని ఆదేశించారు. 

ఆశించిన ఆదాయం రాకపోయినా​..
కేవలం కంప్యూటర్‌లో ఒకే ఒక్క బటన్‌ నొక్కడం ద్వారా డీబీటీ రూపంలో లబ్దిదారులకు రూ. 95 వేల కోట్లు బదిలీచేశామ‌ని, ఇవికాక నాన్‌డీబీటీ అంటే ఇళ్ల‌పట్టాలు, సంపూర్ణ పోషణ, ఆరోగ్యశ్రీ ఇవన్నీ కలిపితే రూ. 1.35 లక్షల కోట్లు బదిలీచేశామ‌న్నారు. ఎక్కడా అవినీతికి తావు లేకుండా ఈ బదిలీ జరిగింద‌ని చెప్పారు.  ఇవన్నీ విజయవంతంగా జరిగాయి అంటే ఆర్థికశాఖ అధికారుల శ్రమ వల్లే, వారిని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌త్యేకంగా అభినందించారు. కోవిడ్‌ కారణంగా మనం ఆశించిన ఆదాయం రాకపోయినా ఏ కార్యక్రమం కూడా ఆగకుండా అనుకున్న సమయానికే పూర్తిచేసుకుంటూ ముందుకెళుతున్నామ‌ని చెప్పారు.

తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, చీఫ్‌ సెక్రటరీ ఆదిత్యనాథ్‌ దాస్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ఎస్‌.రావత్, కార్మికశాఖ స్పెషల్‌ సీఎస్‌ అనంతరాం, గృహనిర్మాణ శాఖ సెషల్‌ సీఎస్‌ అజయ్‌జైన్, రావత్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కార్మికశాఖ స్సెషల్‌ కమిషనర్‌ రేఖారాణి, సెర్ప్‌ సీఈవో రాజాబాబు, వైయ‌స్‌ఆర్‌ బీమా స్టేట్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ రాజా ప్రతాప్, ఇతర ఉన్నతాధికారులు

Back to Top