తాడేపల్లి: ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఆర్టీసీ, ప్రభుత్వ సహకారంలో ఒక డ్రైవింగ్ స్కూల్ చొప్పున ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈ సదుపాయాలను ఆర్టీసీతో పాటు డ్రైవింగ్ శిక్షణ కోసం వినియోగించుకోవచ్చని సూచించారు. రహదారి భద్రతా మండలిపై సీఎం వైయస్ జగన్ అధ్యక్షతన సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలతో పాటు రోడ్డు ప్రమాదాలు జరగడానికి కారణాలు తదితర అంశాలను సీఎం వైయస్ జగన్కు అధికారులు వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించి అధికారులకు సీఎం వైయస్ జగన్ పలు కీలక సూచనలు చేశారు.
ప్రమాదాలకు గురైన వారి ప్రాణాలు కాపాడటం, నిర్ణీత సమయంలో ఆస్పత్రులకు చేర్చడంలో ‘108’ కీలక పాత్ర పోషిస్తున్నాయని అధికారులు సీఎం వైయస్ జగన్కు తెలిపారు. 108 వాహనాల ద్వారా చాలామంది ప్రాణాలు నిలబడుతున్నాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 1190 బ్లాక్ స్పాట్స్ గుర్తించామని, అందులో 520 స్పాట్స్ను రెక్టిఫై చేశామని అధికారులు వివరించారు. ఆర్ అండ్ బీ నిర్వహిస్తున్న నేషనల్ హైవేల్లోనూ 78 బ్లాక్ స్పాట్స్ను రెక్టిఫై చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. కొత్త జిల్లాలకు అనుగుణంగా ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న 16 మెడికల్ కాలేజీల్లోనూ ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అత్యాధునిక పద్ధతుల్లో ఎమర్జెన్సీ సర్వీసులు అందించాలని, ప్రమాదాలకు గురైనవారు కోలుకునేందుకు వీలుగా విశాఖలో రీహాబిలిటేషన్ సెంటర్ ఉండాలన్నారు. తిరుపతి బర్డ్ ఆస్పత్రుల్లో ఉన్న సదుపాయాలను మెరుగుపర్చాలని సూచించారు.
రోడ్డుపై లేన్ మార్కింగ్ చాలా స్పష్టంగా కనిపించేలా ఉండాలని సీఎం వైయస్ జగన్ అధికారులను ఆదేశించారు. బైక్లకు ప్రత్యేక లేన్, ఫోర్ వీల్లర్లకు ప్రత్యేక లేన్ ఏర్పాటుపై ఆలోచన చేయాలన్నారు. ఎంత స్పీడ్లో వెళ్లాలని సూచించేందుకు సైన్బోర్డులు ఉంచాలన్నారు. దీని వల్ల చాలా వరకు ప్రమాదాలు తగ్గే ఆస్కారం ఉంటుందన్నారు. రోడ్డు పక్కన దాబాల్లో మద్యం విక్రయాలు జరక్కుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమైన రోడ్డు పక్కన యాక్సెస్ బారియర్స్ ఉండాలన్నారు. క్రమం తప్పకుండా రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలపై అధికారులు సమీక్షించాలని ఆదేశించారు.
కీలక నిర్ణయాల అమలుకు ఆమోదం..
- రోడ్ సేఫ్టీ మీద లీడ్ ఏజెన్సీ ఏర్పాటుకు పచ్చ జెండా. పోలీసు, ట్రాన్స్పోర్ట్, హెల్త్ – రోడ్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి నిపుణులు ఇందులో ఉంటారు.
- రోడ్ సేఫ్టీ ఫండ్ ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్.
- ప్రమాద బాధితులకు చికిత్స కోసం క్యాష్లెస్ ట్రీట్ మెంట్ అందేలా నెట్వర్క్ ఆస్పత్రుల జాబితాలోకి ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయం.
- రోడ్డు ప్రమాద బాధితులను ఆస్పత్రులకు తీసుకొచ్చే వారిపట్ల మంచి ప్రోత్సాహం అందించాలి.
- ఐరాడ్ యాప్ వినియోగించుకుని ప్రమాదాలపై లైవ్ అప్డేట్ పొందేలా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలి.
- పీపీపీ పద్ధతిలో రవాణాశాఖద్వారా ఆటోమేటెడ్ ఎఫ్సీ టెస్టింగ్ ఏర్పాటుపై కార్యాచరణ.
- రోడ్డు ప్రమాద బాధితులకు బీమా పరిహారం దక్కేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.
ఈ సమావేశంలో రహదారులు, భవనాల శాఖ మంత్రి శంకర నారాయణ, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టీ. కృష్ణబాబు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, లా సెక్రటరీ వి.సునీత, రవాణాశాఖ కమిషనర్ పి.సీతారామాంజనేయలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.