తాడేపల్లి: ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇంటి వద్దకే నిత్యావసరాలు పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి వివరించారు. ఖరీఫ్లో ధాన్యం సేకరణ, రేషన్ డోర్ డెలివరీపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈనెల మూడో వారంలో రేషన్ డోర్ డెలివరీ వాహనాలు ప్రారంభిస్తామని, అదే రోజు 10 కిలోల రైస్ బ్యాగ్ ఆవిష్కరించనున్నట్లు సీఎం వైయస్ జగన్ చెప్పారు. ఫిబ్రవరి 1 నుంచి ఇంటి వద్దకే నిత్యావసరాలు పంపిణీ ప్రారంభించనున్నట్లు వివరించారు.
ఈ సందర్భంగా 9,260 మొబైల్ యూనిట్లు, అధునాతన తూకం యంత్రాలు సిద్ధం చేశామని ఉన్నతాధికారులు సీఎం వైయస్ జగన్కు వివరించారు. ‘అదే విధంగా 2.19 కోట్ల నాన్ ఓపెన్ క్యారీ బ్యాగులు సిద్ధమయ్యాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, క్రిస్టియన్, మైనార్టీలకు నిత్యావసరాల పంపిణీ వాహనాలను అందజేయనున్నాం. వాహనాల లబ్ధిదారులకు 30 శాతం సబ్సిడీ, 60 శాతం బ్యాంకు రుణం, 10 శాతం మాత్రమే లబ్ధిదారుడి వాటా మాత్రమే. సంక్షేమ కార్యక్రమంలోభాగంగా ఆయా కార్పొరేషన్ల ద్వారా రుణాలు అందించారు. ప్రతి జిల్లాలో పౌరసరఫరాల సంస్థ ద్వారా లోన్ ఫెసిలిటేషన్ క్యాంపుల నిర్వహణ' చేపట్టినట్లు తెలిపారు.
సమీక్షా సమావేశంలో పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, పౌరసరఫరాల కమిషనర్ కోన శశిధర్, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ ఏ.సూర్యకుమారితో పాటు, ఆ శాఖకు చెందిన పలువురు సీనియర్ అధికారులు హాజరయ్యారు.