పల్లెల పరిశుభ్రతకు పెద్దపీట వేయాలి

వైయస్‌ఆర్‌ జలకళ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి

‘శాశ్వత భూహక్కు– భూరక్ష’ సమర్థవంత అమలుకు మంత్రులతో కమిటీ 

గ్రామ సచివాలయాలు, విలేజ్‌ క్లినిక్స్, డిజిటల్‌ లైబ్రరీలన్నీ ఈఏడాదే పూర్తికావాలి

ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశం

తాడేపల్లి: గ్రామ సచివాలయాలు, విలేజ్‌ క్లినిక్స్‌ ఈ ఏడాది పూర్తికావాలని, డిజిటల్‌ లైబ్రరీలన్నీ కూడా ఈ ఏడాదే పూర్తికావాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. జియో ట్యాగింగ్‌ చేసి నిర్మాణాల తీరుపై సమీక్ష చేయాలన్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజాశంకర్, సెర్ప్‌ సీఈఓ రాజాబాబు, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ ఎండీ సంపత్‌కుమార్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ప్రాధాన్యతక్రమంలో పనులు చేపట్టాలని ఆదేశించారు. పల్లెలను పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమానికి పెద్దపీట వేయాలని సూచించారు. గ్రామాల్లో 14 వేల ట్రైసైకిళ్ల ఏర్పాటుకు, అర్బన్‌ ప్రాంతాలకు సమీపంలో ఉన్న పల్లెల్లో 1,034 ఆటోల కొనుగోలు, వీటితో పాటు మరిన్ని వాహనాల కొనుగోలుకు సీఎం వైయస్‌ జగన్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. 

రూరల్‌ ప్రాంతాల్లో వెట్‌ వేస్టేజ్‌ను తరలించే ఏర్పాట్లు ఉండాలన్నారు. దీని కోసం ప్రత్యేక నంబర్‌ గ్రామాల్లో డిస్‌ప్లే చేయాలని ఆదేశించారు. కాల్‌ చేయగానే సంబంధిత వాహనం సేకరించి ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌కు తరలించాలన్నారు. అపరిశుభ్రత, దోమల వల్ల వస్తున్న రోగాల పరిస్థితులను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. 

వైయస్‌ఆర్‌ జలకళ ప్రాజెక్టు చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అని, లక్ష మందికి పైగా రైతులకు ఉపయోగపడే ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలన్నారు. చిన్న చిన్న నదులపై ఉన్న బ్రిడ్జిల వద్ద చెక్‌డ్యామ్‌ తరహాలో నిర్మాణాలు చేయాలని ఆదేశించారు. కనీసం 3, 4 అడుగుల మేర అక్కడ నీరు నిల్వ ఉండేలా చేయాలన్నారు. తద్వారా భూగర్భ జలాలు బాగా పెరుగుతాయని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు. 

వైయస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ముగ్గురు మంత్రులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని, పంచాయతీ రాజ్, రెవెన్యూ, మున్సిపల్‌ శాఖ మంత్రులతో కమిటీ ఏర్పాటుకు సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. 

తాజా వీడియోలు

Back to Top