ప్రతి గ్రామానికి ఇంటర్నెట్‌ సదుపాయం

‌ఐటీ-ఎలక్ట్రానిక్‌ పాలసీపై  సీఎం వైయ‌స జ‌గ‌న్ స‌మీక్ష 
 

తాడేప‌ల్లి : వచ్చే మూడేళ్లలో ఇంటర్నెట్‌ సదుపాయాన్ని అన్ని గ్రామాలకూ కల్పించడమన్నది చాలా ముఖ్యమైన అంశమని ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఐటీ రంగం అభివృద్ధికి ఇది ఎంతో దోహదపడుతుందన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్‌ పాలసీలో అంశాలపైనా సమగ్రంగా చర్చించిన సీఎం వైయ‌స్‌ జగన్‌ ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌ బలంగా లేకపోతే.. అనుకున్న లక్ష్యాలు సాధించలేమని తెలిపారు. ఐటీ-ఎలక్ట్రానిక్‌ పాలసీపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చర్చించారు. రాష్ట్రంలో ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌ విస్తృతి, ప్రతి గ్రామానికీ ఇంటర్నెట్, గ్రామాల్లో ఇంటర్నెట్‌ లైబ్రరీ, కొత్తగా వస్తున్న ఐటీ, ఇతర టెక్నాలజీ అంశాల్లో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడంపైనా దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.

విశాఖలో ఎమర్జింగ్‌ టెక్నాలజీ యూనివర్శిటీపైనా సమావేశంలో చర్చించ్చిన సీఎం వైయ‌స్ జగన్‌ పాలసీలో పెట్టాల్సిన అంశాలపై అధికారులకు సూచనలు అందించారు. ప్రతి గ్రామానికి ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. ఇంటర్నెట్‌ లైబ్రరీని ఏర్పాటు చేయాలని, గ్రామంలో ఎవరైనా సరే ఈ సదుపాయాన్ని వినియోగించుకునేలా ఉండాలని అన్నారు. వర్క్‌ ఫ్రం హోం చేసుకునే సదుపాయం ఉంటుందని, ఇందుకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ- లైబ్రరీ కోసం భవనం కూడా కట్టాలని, దీనిపై కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు. గ్రామంలోని సచివాలయాలు, ఆర్బీకేలు అన్నీ కూడా ఇంటర్నెట్‌తో అనుసంధానం కావాలన్నారు. దీంతోటు అవసరమైన గృహాలకు ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఇవ్వాలని తెలిపారు.

ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ పార్క్‌
ఇంటిగ్రేటెడ్‌ టెక్నాలజీ పార్క్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆమోదం తెలిపారు. విశాఖపట్నంలో ఇంటిగ్రేటెడ్‌ టెక్నాలజీ పార్కు ఏర్పాటు చేసి ఇందులో హై ఎండ్‌ స్కిల్స్‌ యూనివర్శిటీ, ఇన్‌క్యుబేషన్‌ సెంటర్, ల్యాబ్స్, సీఓఈఎస్, ఐటీ, ఈసీ డిపార్ట్‌మెంట్‌ ఆఫీసు, స్టేట్‌ డేటా సెంటర్, ఐటీ టవర్స్‌ ఇవన్నీకూడా ఉండాలని సీఎం ఆదేశించారు.
చదవండి: తొలి దెబ్బ అదిరింది

ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ యూనివర్శిటీ
విశాఖలో ఏర్పాటు కాబోతున్న యూనివర్శిటీలో రోబోటిక్స్, ఆర్టిఫియల్‌ ఇంటెలిజెన్స్, క్లౌడ్‌ కంప్యూటింగ్, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీస్, డేటా అనలిటిక్స్‌ సైన్సెస్, అడ్వాన్స్‌డ్‌ ఎలక్ట్రానిక్స్, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, నీటివనరులు తదితర రంగాల్లో ఐటీ అప్లికేషన్లపై బోధన, పరిశోధన లక్క్ష్యంగా ఉండాలన్నారు. దేశంలోని ప్రఖ్యాత ఐఐటీ సహా వివిధ సాంకేతిక సంస్థల్లోని నిపుణులు దీనిపై త్వరలోనే నివేదిక సమర్పిస్తారని అధికారులు వెల్లడించారు. ఇంజినీరింగ్‌ సహా.. ఇతరత్రా సాంకేతిక విద్యను అభ్యసించిన వారికి నైపుణ్యాలను మెరుగుపరిచేందుకూ ఈ యూనివర్శిటీ ఉపయోగపడాలని సీఎం అన్నారు. యూనివర్శిటీ సహా ఐటీ సంబంధిత విభాగాలన్నీ ఒకే చోట ఉండాలని తెలిపారు

మూడు ఐటీ కాన్సెప్ట్ సిటీలు
విశాఖపట్నం, తిరుపతి, బెంగుళూరు సమీపంలో.. మూడుచోట్ల కనీసం 2 వేల ఎకరాల విస్తరణలో ఐటీ కాన్సెప్ట్‌సిటీలను ఏర్పాటు చేసేదిశగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఈ కాన్సెప్ట్ ‌సిటీల్లో మౌలిక సదుపాయాలు అత్యున్నత ప్రమాణాలతో ఉండాలన్నారు. నిర్మాణంలో ఆర్కిటెక్చర్‌ యునిక్‌గా ఉండాలని, ప్రతి కాన్సెప్ట్‌ సిటీకి సంబంధించిఒక ప్రత్యేకమైన మాస్టర్‌ ప్లాన్‌ ఉండాలని పేర్కొన్నారు. పాలసీలో ప్రతి అంశం పారదర్శకంగా ఉండాలన్నారు. ఐటీ ప్రగతికి దోహదపడాలని, రాష్ట్రాభివృద్ధికి సహాయపడాలని సూచించారు. అన్ని అంశాలపై ఆలోచనలు చేసి మంచి పాలసీని తీసుకురావాలన్నారు. కోవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో వర్క్‌ ఫ్రం హోం పెరిగిందన్న సీఎం వర్క్‌ ఫ్రం హోంను ప్రమోట్‌ చేయాలని సూచించారు. దీన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఏ రకంగా ఐటీ రంగానికి ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందిస్తామో పరిశీలన చేసి, దాన్ని పాలసీలో పెట్టాలని తెలిపారు.

కొప్పర్తి ఎలక్ట్రానిక్స్‌ పార్క్‌పై దృష్టిపెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. వీలైనన్ని పరిశ్రమలను తీసుకురావాలని, పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పనపై దృష్టిపెట్టాలని తెలిపారు. ఈ సమావేశానికి ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి,  ఉన్నత విద్యాశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సతీష్‌ చంద్ర, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు నీలం సాహ్ని,ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జీజయలక్ష్మి, ఐటీ శాఖ స్పెషల్‌ సెక్రటరీ బీ సుందర్, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ ఎమ్‌ఎమ్‌ నాయక్, ఏపీఎఫ్‌ఎస్‌ఎల్‌ ఎండీ ఎమ్‌ మధుసూదన్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

Back to Top