మున్సిప‌ల్ ఉద్యోగుల‌కు 010 ప‌ద్దులో జీత‌భ‌త్యాలు 

కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో సంస్కరణలపై సీఎం వైయ‌స్‌‌ జగన్‌ సమీక్ష  

తాడేపల్లి: ప్రజలకు మెరుగైన సేవలందించడంతో పాటు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు మరింత అభివృద్ధి చెందే విధంగా ప్రణాళిక (ఎస్‌ఓపీ) రూపొందించాలని ముఖ్య‌మంత్రి వైయ‌స జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధి​కారులను ఆదేశించారు. మున్సిపాలిటీల ఉద్యోగుల జీతభత్యాలను 010 పద్దు ప్రకారం ప్రభుత్వమే చెల్లిస్తుంద‌ని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, సిఫార్సులకు అనుగుణంగా పట్టణ స్థానిక సంస్థలైన (యూఎల్‌బీ) కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో చేపట్టాల్సిన సంస్కరణలపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.  

ఆ డబ్బును స్థానికంగానే ఖర్చు చేస్తాం
 మున్సిపాలిటీల ఆదాయాన్ని ప్రభుత్వం ముట్టుకోదని, ఆ డబ్బును స్థానికంగానే ఖర్చు చేస్తుందని సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ స్పష్టం చేశారు. పలు అభివృద్ధి పనులు, కార్యక్రమాల కోసం ఈ మొత్తాన్ని వ్యయం చేయాలని అధికారులను ఆదేశించారు.  మున్సిపాలిటీలు స్వయం సమృద్ధి సాధించాలి. ఆ దిశగా అడుగులు వేయాల‌ని ఆకాంక్షించారు.

ప్రతి రోజూ తప్పనిసరిగా చెత్తను తరలించాలి
 ప్రతి రోజూ తప్పనిసరిగా చెత్తను తరలించాలి. వీధులనూ పరిశుభ్రం చేయాలి, డ్రైనేజీలను తరుచూ క్లీన్‌ చేయాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సూచించారు. శానిటేషన్‌, వాటర్‌ అండ్‌ సీవరేజ్‌కు సంబంధించి రోజువారీ నిర్వహణ వ్యయాన్ని (ఓ అండ్‌ ఎం) మాత్రమే ఛార్జీలుగా వసూలు చేయాలి. శానిటేషన్‌ బాగుండాలి, వాటర్‌ అండ్‌ సీవరేజ్‌ కూడా పక్కాగా ఉండాలి. ఎస్‌ఓపీ రూపొందించాలి. మున్సిపాలిటీలలో ఆదాయం ఎంత? వాటి వ్యయం ఎంత? జీతాల కోసం ఎంత ఖర్చు చేస్తున్నారు? అభివృద్ధి పనులకు ఎంత వ్యయం చేస్తున్నారు? వంటి అన్నీ తెలుసుకుని, ఇంకా ఏం చేస్తే బాగుంటుందన్న దానిపై ఎస్‌ఓపీ రూపొందించండి అని సీఎం వైయ‌స్ జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ నీలం సాహ్ని, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, మున్సిపల్‌ శాఖ కార్యదర్శి శ్యామలరావు, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ విజయకుమార్‌తో పాటు, ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

Back to Top