తాడేపల్లి: నెల రోజుల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని అధికారులకు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నెల రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు చెప్పినట్లు గుర్తు చేశారు. నెలఖరులోగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం నియంత్రించాలనే ఆర్డినెన్స్ తెచ్చామన్నారు. పోలీసు యంత్రాంగం దీన్ని ఛాలెంజ్గా తీసుకోవాలని సూచించారు. డబ్బు, మద్యం పంపినట్లు రుజువు అయితే ఎన్నికల తర్వాత కూడా అనర్హత వేటు, మూడేళ్ల జైలు శిక్ష విధించాలన్నారు. గ్రామాల్లో ఉన్న మహిళా పోలీసు, పోలీసు మిత్రలను ఉపయోగించుకోవాలన్నారు. స్థానిక ఎన్నికల నిర్వాహణ దేశానికే ఆదర్శం కావాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన నిరోధానికి ప్రత్యేక యాప్. ఏం జరిగినా ఈ యాప్లో నమోదయ్యేలా గ్రామ, వార్డు వాలంటీర్లకు శిక్షణ ఇవ్వాలని సీఎం అధికారులకు సూచించారు.