ఈనెల 20 నుంచి `సంపూర్ణ గృహ హ‌క్కు` రిజిస్ట్రేష‌న్‌

రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలి

ఉన్న‌తాధికారుల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశం

తాడేప‌ల్లి: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద లబ్ధిదారుల ఇళ్ల‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి జాప్యం లేకుండా అప్రూవల్స్‌ ఇవ్వాలని సూచించారు. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంపై తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు. పథకం అమలుపై దిగువస్థాయి అధికారులకు, లబ్ధిదారులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించారు. ఈ సంద‌ర్భంగా అధికారుల‌కు ప‌లు అంశాల‌పై దిశానిర్దేశం చేశారు. 

ఇప్పటివరకూ 52 లక్షలమంది ఈ పథకం కింద నమోదు చేసుకున్నార‌ని, 45.63 లక్షల లబ్ధిదారుల‌ డేటాను ఇప్పటికే సచివాలయాలకు ట్యాగ్ చేశామ‌ని అధికారులు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించారు. వీటిపై క్షేత్రస్థాయిలో ఎంక్వైరీలు పూర్తిచేస్తున్నామ‌ని, ఎప్పటికప్పుడు దరఖాస్తులను పరిశీలించి వారికి అప్రూవల్స్‌ ఇస్తున్నామ‌ని అధికారులు తెలిపారు. మరో 10 రోజుల్లో పూర్తిస్థాయిలో అప్రూవల్స్‌ ఇస్తామని అధికారులు ముఖ్య‌మంత్రికి వివ‌రించారు. 

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం లబ్ధిదారులకు క్లియర్‌ టైటిల్‌తో రిజిస్ట్రేషన్ చేయాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. దీనికోసం తగిన విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి జాప్యం లేకుండా అప్రూవల్స్‌ ఇవ్వాలన్నారు. క్షేత్రస్థాయిలో ఎంక్వైరీలు కూడా.. నిర్దేశించుకున్న సమయంలోగా పూర్తిచేయాలని సూచించారు. ఆస్తులపై పూర్తి హక్కులు దఖలు పడతాయని లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. ల‌బ్ధిదారుల‌కు, కిందిస్థాయి అధికారులకూ అవగాహన కల్పించే కార్యక్రమాలను చేప‌ట్టాల‌ని సూచించారు.  

రిజిస్ట్రేషన్ల కోసం తగినన్ని స్టాంపు పేపర్లను తెప్పించుకున్నామని అధికారులు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కు తెలిపారు. 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేప‌ట్టాల‌ని సీఎం ఆదేశించారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్‌ నవంబర్‌ 20 నుంచి ప్రారంభించి.. డిసెంబర్‌ 15 వరకూ రిజిస్ట్రేషన్ చేప‌ట్టాల‌న్నారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాల‌ని అధికారుల‌ను మ‌రోమారు ఆదేశించారు. 

ఈ సమీక్షా సమావేశానికి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై. శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి. ఉషారాణి, ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ దవులూరి దొరబాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Back to Top