తాడేపల్లి: నిర్దేశించుకున్న గడువులోగా ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తిచేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. పోలవరం సహా ప్రాధాన్యతలుగా నిర్ణయించుకున్న ప్రాజెక్టులపై సీఎం వైయస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టుల వారీగా ఇప్పటివరకూ జరిగిన పనులు, భవిష్యత్తులో పూర్తిచేయాల్సిన పనులపైనా అధికారులతో సీఎం విస్తృత సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్, చీఫ్ సెక్రటరీ డాక్టర్ సమీర్ శర్మ, జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ నారాయణ రెడ్డి, ఆర్ అండ్ ఆర్ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
వీలైనంత త్వరగా డిజైన్లు తెప్పించుకోవాలి..
పోలవరంలో దిగువ కాఫర్ డ్యాం, ఈసీఆర్ఎఫ్ డ్యాంలకు సంబంధించిన పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. డౌన్ స్ట్రీం కాఫర్ డ్యాంకు సంబంధించి అన్ని డిజైన్లూ వచ్చాయని, జూలై 31 కల్లా పని పూర్తవుతుందని అధికారులు సీఎంకు వివరించారు. ఈసీఆర్ఎఫ్ డ్యాంకు సంబంధించి డిజైన్లు కూడా త్వరలో ఖరారవుతాయని సీఎం వైయస్ జగన్ తెలిపారు. వీలైనంత త్వరగా డిజైన్లు తెప్పించుకోవాలని సూచించారు. వెంటపడి మరీ పనులు చేయించుకోవాలన్నారు. ఆర్ అండ్ ఆర్పైన ప్రత్యేక దృష్టిపెట్టామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రాధాన్యతా క్రమంలో కుటుంబాలను తరలిస్తున్నామని చెప్పారు. మొదటి ప్రాధాన్యత కింద తరలించాలనుకున్న వారిని ఆగస్టుకల్లా తరలించేలా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. మొదటగా ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న 20,946 కుటుంబాల్లో ఇప్పటికే 7,962 మందిని తరలించామన్నారు. 3,228 మంది ఓటీఎస్ కు దరఖాస్తు చేసుకున్నారని, మిగిలిన 9,756 మందిని తరలించాలని చెప్పారు. వీరికి త్వరగా పునరావాసం కల్పించాలని, డీబీటీ పద్ధతుల్లో ఆర్ అండ్ ఆర్ కింద ప్యాకేజీలు చెల్లించాలని అధికారులను సీఎం వైయస్ జగన్ ఆదేశించారు.
గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజిగా నోటిఫై చేయాలి..
నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, అవుకు టన్నెల్–2, పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ వర్క్స్, పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ 1 నుంచి నీటి విడుదల, ఇదే ప్రాజెక్టులో టన్నెల్–2 పనులు, వంశధార–నాగావళి అనుసంధానం, వంశధార స్టేజ్ –2లో ఫేజ్–2 పనులపైనా సీఎం సమీక్ష నిర్వహించారు. నెల్లూరు బ్యారేజీ పనులు పూర్తిచేసి మే 15 నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధంచేస్తున్నామని అధికారులు సీఎం వైయస్ జగన్కు వివరించారు. సంగం బ్యారేజీ పనులు కూడా దాదాపుగా పూర్తి కావొచ్చాయని, మే 15 నాటికి పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్దం చేస్తామని చెప్పారు. సంగం బ్యారేజికి మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజిగా నోటిఫై చేయాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. అవుకు టన్నెల్–2లో మిగిలిపోయిన పనులు కేవలం 77.5 మీటర్లు, ఈసీజన్లో పనులు పూర్తిచేస్తామని, 120 రోజుల్లో పనులు పూర్తిచేసేలా ప్రణాళిక వేశామని అధికారులు వివరించారు. లైనింగ్ సహా ఆగస్టుకల్లా పనులు పూర్తయ్యేలా అన్నిరకాల చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం వైయస్ జగన్ ఆదేశించారు.
అక్టోబరు నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి టన్నెల్–2 పనులపై సీఎం సమీక్షించారు. నెలకు 400 మీటర్ల మేర పనులు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఇది మరింతగా పెంచి 500 మీటర్ల వరకూ టన్నెల్ తవ్వకం పనులు చేస్తామని చెప్పారు. టన్నెల్- 1 ద్వారా సెప్టెంబర్ నెలలో నీటి సరఫరా ప్రారంభోత్సవానికి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. 2023 నాటికి టన్నెల్ –2 సహా అన్నిరకాల పనులు పూర్తిచేసి.. రెండు టన్నెళ్ల ద్వారా నీళ్లు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. వంశధార – నాగావళి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అధికారులు సీఎంకు తెలిపారు. అక్టోబరు నాటికి పూర్తయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. వెలగొండ ప్రాజెక్టు కింద ఉదయగిరి, బద్వేలు ప్రాంతాలకు నీటిని అందించడానికి టెండర్లు పిలవాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు.
త్వరగా నేరడి పనులు ప్రారంభించాలి..
వంశధార నదిపై గొట్టా బ్యారేజి వద్ద నీటిని లిఫ్ట్ చేసి హిరమండలం రిజర్వాయర్లోకి పంపింగ్కు సంబంధించిన ప్రణాళికలు రూపొందిచాలని సీఎం ఆదేశించారు. వంశధారపై నేరడి వద్ద బ్యారేజీకి సన్నాహాలపై సీఎం సమీక్షించారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం దాదాపుగా ఏపీనే భరిస్తోందని, బ్యారేజీ నిర్మాణం చేస్తే ఒడిశా కూడా సగం నీటిని వాడుకునే అవకాశం ఉందన్నారు. ఇరు రాష్ట్రాలకూ ఇది ప్రయోజనకరమని, వీలైనంత త్వరగా నేరడి పనులు ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఉత్తరాంధ్రలోని నాలుగు ప్రాజెక్టు పనులపై సమీక్ష..
ఉత్తరాంధ్రలోని నాలుగు ప్రాజెక్టు పనులపై సీఎం సమీక్షించారు. తోటపల్లి బ్యారేజీ, గజపతినగరం బ్రాంచి కెనాల్, తారరామ తీర్థసాగర్, మహేంద్ర తనయ ఆఫ్షోర్ ప్రాజెక్టుపై సీఎం చర్చించారు. తోటపల్లి ప్రాజెక్టు కింద అన్ని పనులనూ వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. గజపతినగరం బ్రాంచ్ కెనాల్ కింద పనులనూ వేగవంతం చేయాలని సూచించారు. ఆర్థిక శాఖ అనుమతులు తీసుకుని టెండర్లు పిలవాలలన్నారు.
భూ సేకరణ తదితర అంశాలపై దృష్టిపెట్టాలి..
తారకరామ తీర్థసాగర్లో రిజర్వాయర్ పనులు పూర్తికావొచ్చాయని అధికారులు సీఎంకు వివరించారు. మిగిలిన పనులకు వెంటనే టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు. సారిపల్లి గ్రామంలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇవ్వాలని సూచించారు. టన్నెల్ సహా ఇతర పనులూ కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. మహేంద్ర తనయ ప్రాజెక్టు పనుల సమీక్షించిన సీఎం.. ప్రాజెక్టును పూర్తిచేయడానికి తదేక దృష్టిపెట్టాలని ఆదేశించారు. ఆర్థిక శాఖ అనుమతులు తీసుకుని టెండర్లు పిలవాలన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపైనా దృష్టిపెట్టాలని సూచించారు. మెయిన్ కెనాల్ను శ్రీకాకుళం వరకూ తీసుకెళ్లాలన్నారు. దీనికి సంబంధించిన భూ సేకరణ తదితర అంశాలపై దృష్టిపెట్టాలని ఆదేశించారు.