దిశ చట్టం పకడ్బందీగా అమలు చేయండి

ప్రతి జిల్లాలో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలి

13 మంది పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను నియమించండి

ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల్లో 176 పోస్టులకు జనవరిలో నోటిఫికేషన్‌ ఇవ్వాలి

దిశ చట్టం అమలుపై సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష

తాడేపల్లి: దిశ చట్టం పకడ్బందీ అమలుకు అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. దిశ చట్టం అమలుపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేయాలని, కోర్టుల ఏర్పాటుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని సూచించారు. 13 మంది పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకాన్ని త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో మరో రెండు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. విశాఖ, తిరుపతిలో కొత్తగా ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల్లో 176 పోస్టుల భర్తీకి జనవరిలో నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఆదేశించారు.  మహిళా పోలీస్‌ స్టేషన్లను అప్‌గ్రేడ్‌ చేయాలని, మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఒక డీఎస్పీ, ముగ్గురు ఎస్‌ఐలు, నలుగురు సపోర్టు సిబ్బంది ఏర్పాటుకు సీఎం వైయస్‌ జగన్‌ అంగీకరించారు. ప్రతి జిల్లాలో వన్‌స్టాప్‌ సెంటర్లను బలోపేతం చేయాలని, వన్‌స్టాప్‌ సెంటర్లలో ఒక మహిళా ఎస్‌ని నియమించాలన్నారు. అదే విధంగా దిశ యాప్‌ కూడా రూపొందించాలన్నారు. 100, 112 నంబర్లను ఇంటిగ్రేట్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. 

Back to Top