థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలి

కోవిడ్‌ నివారణ చర్యలపై సమీక్షలో సీఎం వైయస్‌ జగన్‌

మరో వారం రోజుల పాటు నైట్‌ కర్ఫ్యూ

పీడియాట్రిక్‌ సూపర్‌ కేర్‌ ఆస్పత్రుల పనులను వేగవంతం చేయాలి

ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులందరికీ 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి

గర్భిణీ స్త్రీలకు వాక్సినేషన్‌పై అవగాహన క‌ల్పించాలి

పీహెచ్‌సీల్లోనూ ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందుబాటులో ఉంచాలి

వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశం

తాడేపల్లి: రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సమర్థవంతంగా కొనసాగుతోందని, సమర్థ నిర్వహణ ద్వారా ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ ఇవ్వగలిగామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కోవిడ్‌–19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రానికి ఇప్పటివరకు వ్యాక్సిన్‌ డోసులు 1,80,82,390 వచ్చాయని, ఇంకా (బ్యాలెన్స్‌డ్‌  డోసులు) వినియోగించాల్సిన డోసులు 8,65,500 ఉన్నాయన్నారు. ఇప్పటివరకు ప్రజలకు 1,82,49,851 డోసులు ఇచ్చామన్నారు. సమర్థ నిర్వహణ ద్వారా దాదాపుగా 11 లక్షల డోసులు ఆదా చేయగలిగామని చెప్పారు. ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులందరికీ 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయిందని, విదేశాలకు వెళ్లే వారిలో ఇప్పటివరకు 31,796 మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయిందన్నారు. 

45 సంవత్సరాల దాటిన వారికి వ్యాక్సినేషన్‌ పూర్తయిన తర్వాత ప్రయారిటీగా ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. గడిచిన మే నెల నుంచి ప్రైౖ వేటు ఆస్పత్రులకు 35 లక్షల వ్యాక్సిన్‌ డోసులను కేంద్రం కేటాయించిందని, వాటిల్లో కేవలం సుమారు 4,63,590 డోసులు మాత్రమే ప్రైవేట్‌ ఆస్పత్రులు వినియోగించాయన్నారు. ఆ కోటాను రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించాలని కేంద్రాన్ని కోరాలని అధికారులను ఆదేశించారు. గర్భిణీ స్త్రీలకు వాక్సినేషన్‌పై అవగాహన కలిగించాలని, వారికి వాక్సిన్‌ ఇవ్వాలని 
అధికారులకు సూచించారు.  

థర్డ్‌ వేవ్‌ సన్నద్దత
థర్డ్‌ వేవ్‌ వస్తుందన్న సమాచారం నేపథ్యంలో సన్నద్ధంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో నిర్మించదలచిన పీడియాట్రిక్‌ సూపర్‌ కేర్‌ ఆస్పత్రుల పనులను వేగవంతం చేయాలని సూచించారు. పోలీస్‌ బెటాలియన్స్‌లో కూడా కోవిడ్‌ కేర్‌ ఎక్విప్‌మెంట్‌ ఏర్పాటుతో పాటు వైద్యులను నియమించాలన్నారు. కమ్యూనిటీ ఆస్పత్రులు స్థాయివరకు ఆక్సిజన్‌ బెడ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పీహెచ్‌సీల్లో కూడా ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సబ్‌సెంటర్ల వరకు టెలీమెడిసిన్‌ సేవలు, ఇంటర్‌నెట్‌ సౌకర్యం అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. అప్పుడే వారితో పీహెచ్‌సీల వైద్యులు కూడా వీసీ ద్వారా అందుబాటులోకి వస్తారన్నారు. 

మరో వారం రోజులు.. 
కోవిడ్‌ ఆంక్షల్లో భాగంగా మరో వారం రోజుల పాటు నైట్‌ కర్ఫ్యూ కొనసాగించాలని ఆదేశించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయాలని, కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. జనసమూహాలపై కఠిన ఆంక్షలు కొనసాగించాలని ఆదేశించారు. 

ప్రైౖ వేటు ఆస్పత్రులు – ఆక్సిజన్‌ (పీఎస్‌ఏ) ప్లాంట్లు 
50 పడకలు దాటి ఉన్న ప్రతి ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లు ఏర్పాటు విషయంలో పురోగతిని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్లు సంబంధిత జిల్లాల్లో ప్రైౖ వేటు ఆస్పత్రులకు ఆదేశాలు ఇచ్చారని అధికారులు వివరించారు. ఈ ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం ఇన్సెంటివ్‌ ఇస్తుందని సీఎం వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు. 

యాక్టివ్‌ కేసులు 24,708 
పాజిటివిటీ రేటు 2.83 శాతం
3 కంటే తక్కువ పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాలు 8
3 నుంచి 5 మధ్యలో పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాలు 5

రికవరీ రేటు 98.05 శాతం
నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న బెడ్లు  94.19 శాతం
ప్రై వేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న బెడ్లు  76.07 శాతం
13వ దఫా ఫీవర్‌ సర్వే కూడా పూర్తయింది.  
104 కాల్‌ సెంటర్‌కు వస్తున్న రోజువారీ కాల్స్‌ 1000 లోపు 

బ్లాక్‌ ఫంగస్‌
తగ్గుముఖం పట్టిన బ్లాక్‌ ఫంగస్‌ కేసులు
గత వారంలో నమోదైన కేసులు 15 
మొత్తం కేసులు 4075
చికిత్స పొందుతున్నవారు 863

వ్యాక్సినేషన్‌
మొత్తం వ్యాక్సినేషన్‌ పూర్తయినవారు   1,41,42,094
సింగిల్‌ డోసు పూర్తయినవారు  1,00,34,337
రెండు డోసులు పూర్తయినవారు  41,07,757

ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, స్టేట్‌ కోవిడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ కె.ఎస్‌. జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనిజిమెంట్‌ అండ్‌ వాక్సినేషన్‌) ఎం రవిచంద్ర, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎం.టీ. కృష్ణబాబు, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి (హెచ్‌ఆర్‌) శశిభూషణ్‌ కుమార్, 104 కాల్‌ సెంటర్‌ ఇంఛార్జి ఎ.బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్‌ ఎ మల్లికార్జున్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
 

Back to Top