కోవిడ్‌ చికిత్సలకు అధిక రేట్లపై సీఎం సీరియస్‌

అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు

కోవిడ్‌ బాధితులపై మానవత్వం చూపించాలి

అరగంటలో బెడ్‌ ఇవ్వాల్సిన బాధ్యత కలెక్టర్లదే

అధికారులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశం

తాడేపల్లి: కోవిడ్‌–19 చికిత్సలకు అధిక రేట్లపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు.. కోవిడ్‌ ఆస్పత్రుల నిర్వహణపై కలెక్టర్లు దృష్టిపెట్టాలని ఆదేశించారు. ప్రభుత్వం ఇచ్చిన జీఓలో పేర్కొన్న దానికంటే ఎక్కువ వసూలు చేస్తే కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయన్నారు. కోవిడ్‌ బాధితుల పట్ల మానవత్వం చూపించాలన్నారు. కోవిడ్‌ బాధితుడికి అరగంటలోగా బెడ్‌ ఇవ్వాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని ఆదేశించారు. స్పందనపై జిల్లా కలెక్టర్లతో సీఎం వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోవిడ్‌ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..

‘104, 14410 కాల్‌ సెంటర్లకు వచ్చే ఫోన్‌ కాల్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. కోవిడ్‌ ఆస్పత్రుల్లో సౌకర్యాలపై ఎప్పటికప్పుడు కలెక్టర్లు సమీక్షించాలి. కోవిడ్‌ ఆస్పత్రుల సేవలు నాణ్యంగా ఉండాలి. అన్ని కోవిడ్‌ ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. సీసీ కెమెరాల ద్వారా కోవిడ్‌ ఆస్పత్రులను మానిటరింగ్‌ చేయాలి. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించాలి. ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాలు నిరోధించే పరికరాలు ఉండేలా చూడాలి. 

పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఆస్పత్రులో హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేయాలి. హెల్ప్‌ డెస్క్‌లో ఆరోగ్య మిత్రలకు విధులు కేటాయించాలి. ఆరోగ్యశ్రీ పేషెంట్‌ వస్తే వారి పట్ల మానవత్వంతో వ్యవహరించాలి. ఆరోగ్య ఆసరా పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలి. పెషెంట్లు డిశ్చార్జ్‌ అయిన సమయంలో ఆరోగ్య ఆసరా అందించాలి. ఆరోగ్య ఆసరా పథకంపై జాయింట్‌ కలెక్టర్లు దృష్టిపెట్టాలి. తాత్కాలిక డాక్టర్లు, నర్సుల నియామకాలపై దృష్టిపెట్టాలి. కోవిడ్‌ ఆస్పత్రుల్లో పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించాలి.  దేశంలోనే అత్యధికగా పరీక్షలు చసి రికార్డు నెలకొల్పాం’ అని సీఎం వైయస్‌ జగన్‌ అన్నారు.
 

Back to Top