వీలైనంత త్వరగా వారికి వ్యాక్సినేషన్‌ పూర్తిచేయాలి

పీహెచ్‌సీల్లో ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు అందుబాటులో ఉంచాలి

ఏపీఎంఎస్‌ఐడీసీలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయాలి

ఆస్పత్రుల్లోనూ ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటుపై దృష్టి పెట్టాలి

మెడికల్‌ కాలేజీల నిర్మాణ పనులపై నివేదిక ఇవ్వండి

వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశం

కోవిడ్‌ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్‌పై సమీక్ష

తాడేపల్లి: కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇవ్వాలని, వీలైనంత త్వరగా వారికి వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. కోవిడ్‌ –19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..

‘‘ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు అందుబాటులో ఉంచాలి. కోవిడ్‌ నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం కొనుగోలు చేసిన కాన్సన్‌ట్రేటర్లు, డీ–టైప్‌ సిలిండర్లు, ఆక్సిజన్‌ జనరేషన్‌ (పీఎస్‌ఏ) ప్లాంట్ల నిర్వహణ కోసం ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దీనికోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. జిల్లాల వారీగా నిర్వహణ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించాలి. జిల్లా విస్తీర్ణం, ఆస్పత్రుల సంఖ్యను బట్టి తగిన సిబ్బందిని ఏర్పాటు చేయాలి. అవసరమైన శిక్షణనూ వీరికి అందించాలి. ఏపీఎంఎస్‌ఐడీసీలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయాలి. శిక్షణ అనంతరం వీరిని ఆస్పత్రి మేనేజిమెంట్‌కు అప్పగించాలి. ఐటీఐ, డిప్లమోలో దీనికి సంబంధించిన కోర్సులను ప్రవేశపెట్టాలి. ఆస్పత్రుల నిర్వహణలో కీలకమైన ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్వహణ, ఎలక్ట్రికల్, ఏసీ రిపేర్, ప్లంబింగ్‌తో పాటు ఇతర అనుబంధ వైద్య విభాగాల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేయాలి. నైపుణ్యం ఉన్న మానవ వనరుల సేవల కారణంగా.. ఆస్పత్రుల నిర్వహణ మెరుగ్గా ఉంటుంది. అంతే కాక చాలామందికి ఉద్యోగాలు వస్తాయి’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు.  

మిగిలిన ఆస్పత్రుల్లోనూ ఆక్సిజన్‌ ప్లాంట్లు
ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ (పీఎస్‌ఏ) ప్లాంట్ల ఏర్పాటుపైనా సీఎం సమీక్షించారు. ముందుగా 100 పడకల ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్ల ఏర్పాటు చేయించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. తర్వాత మిగిలిన ఆస్పత్రుల్లోనూ ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటుపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్లాంట్ల ఏర్పాటు ద్వారా వారికి ప్రభుత్వం తరపున 30 శాతం సబ్సిడీ ఇస్తున్నామన్నారు. పవర్‌ ఛార్జీల్లో కూడా ఊరటనిస్తున్నామని చెప్పారు.   

మరోసారి కేంద్రానికి లేఖ రాస్తాం..
మే, జూన్, జూలై నెలల్లో ప్రయివేటు ఆస్పత్రులకు 43,38,000 డోసులు ఇస్తే.. కేవలం 5,24,347 మాత్రమే వినియోగించారని సీఎం వైయస్‌ జగన్‌కు అధికారులు వివరించారు. ఈ వ్యాక్సిన్లను ప్రభుత్వానికి ఇస్తే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మరింత వేగంగా ముందుకు సాగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. దీనిపై మరోసారి కేంద్రానికి లేఖ రాస్తామని సీఎం తెలిపారు. 

ఇతర రాష్ట్రాల్లో కోవిడ్, వ్యాక్సినేషన్‌పై అధ్యయనం..
వివిధ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య, వ్యాక్సినేషన్, వ్యాక్సినేషన్‌ అనంతరం అక్కడి కోవిడ్‌ తీరు తదితర అంశాలపై అధ్యయనం చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. దీనికోసం ఒక కమిటీని నియమించాలని సూచించారు. ఈ అంశాలపై కమిటీ అధ్యయనం అనంతరం నివేదిక సమర్పించాలన్నారు. తద్వారా కోవిడ్‌ నివారణకు అవసరమైతే రాష్ట్రంలో అనుసరిస్తున్న విధానాల్లో మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. 

సమగ్ర నివేదిక ఇవ్వండి..
కొత్త మెడికల్‌ కళాశాల పనులపైనా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సమీక్షించారు. నూతన మెడికల్‌ కళాశాలల కోసం పెండింగ్‌ ఉన్న చోట భూసేకరణను పూర్తి చేయాలని ఆదేశించారు. కొత్త మెడికల్‌ కాలేజీల్లో పనుల ప్రగతిపై వచ్చే సమావేశంలోగా తనకు నివేదిక ఇవ్వాలన్నారు. 16 కాలేజీల పనులపై పూర్తి వివరాలు అందించాలన్నారు. ఒకవేళ పనులు మొదలు కాకపోతే.. వెంటనే పనులు మొదలుపెట్టించి ఆ వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వండని అధికారులను ఆదేశించారు. నాడు–నేడు వైద్యఆరోగ్యశాఖలో పనులపైనా ప్రజంటేషన్‌ ఇవ్వాన్నారు. 

సీఎంకు వివరాలందించిన అధికారులు
రాష్ట్రంలో గణనీయంగా తగ్గిన యాక్టివ్‌ కేసులు
ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 20,965 
డెయిలీ పాజిటివిటీ రేటు 2.51 శాతం
రికవరీ రేటు 98.25 శాతం
పాజిటివిటీ రేటు 3 కంటే తక్కువ ఉన్న జిల్లాలు 9
పాజిటివిటీ రేటు 5 కంటే తక్కువ ఉన్న జిల్లాలు 3
పాజిటివిటీ రేటు 5 కంటే ఎక్కువ ఉన్న జిల్లా 1 
ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న వారు 4426
కోవిడ్‌ కేర్‌ సెంటర్లులో ఉన్న వారు 2349 
నెట్‌ వర్క్‌ ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్న బెడ్లు 94.33 శాతం
ప్రై వేటు ఆస్పత్రుల్లో  ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్న బెడ్లు  75.25 శాతం
104 కాల్‌ సెంటర్‌కి వచ్చిన కాల్స్‌ 933 

వ్యాక్సినేషన్‌ 
రాష్ట్రంలో 2,04,17,764 డోసుల వ్యాక్సిన్లు పూర్తి
సింగిల్‌ డోసు కింద 1,03,24,702 మందికి వ్యాక్సినేషన్‌
50,46,531 మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్‌
మొత్తం 1,53,71,233 మందికి వ్యాక్సినేషన్‌

ఉపముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), డీజీపీ గౌతం సవాంగ్, స్టేట్‌ కోవిడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కె.ఎస్‌. జవహర్‌ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎం.టీ. కృష్టబాబు, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ కే.వి. రాజేంద్రనాథ్‌ రెడ్డి, 104 కాల్‌ సెంటర్‌ ఇంఛార్జి ఏ.బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి.మురళీధర్‌రెడ్డి ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. 
 

Back to Top