గాలివానకు పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం

వైయస్‌ఆర్‌ టెలీ మెడిసిన్‌ సమర్థవంతంగా అమలు చేయాలి

గుజరాత్‌ నుంచి వచ్చే మత్స్యకారులకు రూ.2 వేల చొప్పున ఇవ్వండి

సమీక్షా సమావేశంలో అధికారులకు సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశం

తాడేపల్లి: గాలివానకు పంటనష్టపోయిన రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పంట నష్టాన్ని వెంటనే అంచనా వేయాలని సూచించారు. కరోనా నియంత్రణ చర్యలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, తదితరులు హాజరయ్యారు.

గుజరాత్‌ నుంచి వస్తున్న మత్స్యకారుల వివరాలపై సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. మత్స్యకారులు వచ్చిన తరువాత ఒక్కొక్కరికి రూ. 2 వేలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు.  

వైయస్‌ఆర్‌ టెలీ మెడిసిన్‌ వ్యవస్థపై సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రతి జిల్లాకు ముగ్గురు జాయింట్‌ కలెక్టర్లను కేటాయిస్తున్నామని, అందులో ఒకరికి టెలీ మెడిసిన్‌ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని సూచించారు. టెలీ మెడిసిన్‌కు సంబంధించి సరైన ఎస్‌ఓపీని రూపొందించుకోవాలని, టెలీ మెడిసిన్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

కుటుంబ సర్వేలో గుర్తించిన వారికి పరీక్షలపై సీఎం వైయస్‌ జగన్‌ ఆరా తీశారు. ఇప్పటి వరకు 12,247 పరీక్షలు చేశామని అధికారులు వివరించారు. మిగిలిన వారికి కూడా వీలైనంత త్వరగా పరీక్షలు చేయాలని సీఎం సూచించారు.

చీనీ పంటకు ధర వచ్చేలా చూడాలని, గాలివానకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. గతేడాదితో పోలిస్తే రైతుల నుంచి ఎక్కువే కొనుగోలు చేశామని, గతంలో ప్రభుత్వం ఎప్పుడూ కొనుగోలు చేయని మొక్కజొన్నను కూడా సేకరిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. అరటి, టమాట ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుపై దృష్టిపెట్టాలని సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. 

Back to Top