ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదు

అధికారుల సమావేశంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌

యాజమాన్యాలకు, టీచర్లకు, విద్యార్థులకు మంచిచేయాలన్నదే ఉద్దేశం

ఎయిడెడ్‌ విద్యాసంస్థల స్థాపన వెనుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు అందిస్తున్న తోడ్పాటులో భాగమే ఇది

ఆ సంస్థలను నడుపుతున్న వారికి సహాయంగా నిలిచే కార్యక్రమం

ప్రభుత్వం కల్పించిన అవకాశాలను ఐచ్ఛికంగా, స్వచ్ఛందంగా వినియోగించుకోవచ్చు 

లేదా ఇప్పడున్నట్టుగా నడుపుకోవచ్చు

ఇందులో  ఎలాంటి బలవంతం లేదు

 తాడేప‌ల్లి: ఎయిడెడ్‌ విద్యాసంస్థల చుట్టూ జరుగుతున్న రాజకీయాలు, రెచ్చగొట్టే ధోరణులు బాధాకరమని, దీంట్లో రాజకీయాలను తీసుకురావడం దురదృష్టకరమని, ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ అన్నారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని స్పష్టంచేశారు. మంగ‌ళ‌వారం ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాలయం అధికారులతో సమావేశంలో సందర్భంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు ప్రభుత్వం వ్యతిరేకమనే కోణంలో జరుగుతున్న ప్రచారాలు, కథనాలను అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ఎయిడెడ్‌ విద్యాసంస్థల యాజమాన్యాలు, అందులో పనిచేస్తున్న టీచర్లు, విద్యార్థులకు మంచి చేయాలనే ఉద్దేశంతో కొన్ని అవకాశాలు కల్పించామన్నారు. ఈ అవకాశాలు వెనుక కారణాలను సీఎం వివరించారు. సీఎంగారి మాటల్లోనే....

  గతంలో డబ్బు ఉన్నవారు, ఆస్తిపాస్తులు ఉన్నవారు ఛారిటీ కింద భవనాలు నిర్మించారు. అందులో ఎయిడెడ్‌ పాఠశాలలు, కాలేజీలు పెట్టారు. 

 తర్వాత కాలంలో ఈ స్కూళ్లు, కాలేజీలు నడపడం అన్నది ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారింది. 

  ఇంకోవైపు ప్రభుత్వాలు కూడా గడచిన 20–25 సంవత్సరాలుగా ఎయిడెడ్‌ పోస్టులను భర్తీచేయకపోవడంతో ఆ పోస్టులు కరిగిపోతూ వచ్చాయి. ఒక విధాన నిర్ణయంలో భాగంగా ఇదిచేశాయి. 

 దీనివల్ల యాజమాన్యాలే టీచర్లను నియమించుకుని ఎయిడెడ్‌ స్కూళ్లను నడపాల్సిన పరిస్థితి వచ్చింది. 

 ఈ దశలో ఎయిడెడ్‌ స్కూళ్లను, కాలేజీలను నడపడానికి మళ్లీమళ్లీ డబ్బులు పెట్టాల్సిన పరిస్థితులు వచ్చాయి. యాజమాన్యంలోని వ్యక్తులకు ఈ విద్యాసంస్థలను నడిపేందుకు అవసరమైన సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. సంస్థల వ్యవహారాలను దగ్గరుండి చూసుకునే పరిస్థితులు లేకుండా పోయాయి. 

 ఈ కారణాలన్నీ కూడా ఎయిడెడ్‌ స్కూళ్లు, కాలేజీల నిర్వీర్యానికి దారితీశాయి. భవనాలన్నీకూడా శిథిలావస్థకు చేరాయి. రిటైర్‌ అయిన టీచర్ల స్థానే కొత్తవారిని నియమించుకోవడంకూడా యాజమాన్యాలకు ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారింది. ఒకవేళ టీచర్లను పెట్టినా క్వాలిటీ లోపించింది. 

 మరోవైపు ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచర్లుకూడా చాలాకాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. తమను ప్రభుత్వంలో భాగంగా గుర్తించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఎయిడెడ్‌ స్కూళ్లన్నీ శిథిలావస్థకు చేరుతున్నాయని, ప్రభుత్వంలో భాగం కానీయకుండా తమ కడుపులు కొడుతున్నారని కూడా వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.  

 ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్‌ విద్యాసంస్థల వెనుకున్న ఉద్దేశాల రక్షణకు, ఎయిడెడ్‌ యాజమాన్యాలకు సహాయకారిగా ప్రభుత్వం ఐచ్ఛికంతో కూడిన విధంగా, స్వచ్ఛందంగా కొన్ని అవకాశాలను కల్పించింది. 

 
నడపలేని పరిస్థితుల్లో ఉన్న విద్యా సంస్థలను ఉన్నది ఉన్నట్టుగా ప్రభుత్వానికి అప్పగిస్తే.... నాడు–నేడులో భాగంగా పునరుద్ధరిస్తాం. విద్యార్థులకు సరిపడా టీచర్లను భర్తీచేస్తాం. చారిటీకింద విద్యాసంస్థలను పెట్టిన దాతల పేర్లను కొనసాగించడం ద్వారా యాజమాన్యాల ఉద్దేశాలను నెరవేరుస్తాం. ఎయిడెడ్‌ విద్యాసంస్థల స్థాపన వెనుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు అందిస్తున్న తోడ్పాటులో భాగమే ఇది. ఆ సంస్థలను నడుపుతున్న వారికి సహాయంగా నిలిచే కార్యక్రమం ఇది. 

  తాము ప్రభుత్వంలో భాగమయ్యేలా చూడాలంటూ ఎయిడెడ్‌ టీచర్లు డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో, వారి డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుని, వారిని సరెండర్‌ చేసి, ప్రయివేటుగా నడుపుకోవచ్చు.

 లేదా ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా యథా ప్రకారం నడుపుకోవచ్చు. 

 ఇప్పటికే ప్రభుత్వంలో విలీనానికి అంగీకారం తెలిపిన ఎయిడెడ్‌ విద్యాసంస్థలు, తిరిగి తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనుకుంటే... అలాకూడా చేయొచ్చు. దీనికికూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. యథాతథంగా తమ విద్యాసంస్థలను నడుపుకోవచ్చు.

 ఎయిడెడ్‌ విద్యాసంస్థల యజమానులకు, అందులో పనిచేస్తున్న టీచర్లకు, విద్యార్దులకు మంచి చేయాలని, మెరుగైన స్కూళ్లగా వాటిని తీర్చిదిద్ది నడపాలనే ఉద్దేశంతోనే ఐచ్ఛికంగానే ఈ అవకాశాలను వారు వినియోగించుకోవచ్చు. ఇందులో ఎలాంటి బలవంతం లేదని ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ వివరించారు.

Back to Top