జాతీయ సగటు కంటే అధికంగా ఏపీలో రికవరీ రేటు

కోవిడ్‌ –19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై  సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష

3148 బ్లాక్‌ ఫంగస్‌ కేసుల్లో 1095 మందికి సర్జరీలు 

50 అంతకంటే ఎక్కువ పడకలున్న ఆస్పత్రుల్లో జనరేషన్‌ ప్లాంట్లు ఏర్పాటు

21 రోజులలో కచ్చితంగా ఆరోగ్యశ్రీ, 104, 108 బిల్లులు చెల్లించాలి

హెల్త్‌హబ్స్‌కు స్థలాలు.. ఆవాసాలకు దగ్గరగానే ఉండేలా చూడాలి 

అమరావతి: క‌రోనా క‌ట్ట‌డికి రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లు స‌త్ఫ‌లితాలిస్తున్నాయ‌ని, జాతీయ సగటు కంటే అధికంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా రికవరీ రేటు ఉంద‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు సగటు 96.59శాతం ఉంటే.. ఏపీలో 96.67శాతం ఉంద‌ని చెప్పారు.  అత్యాధునిక వైద్య సదుపాయాలు అందాలన్నదే ప్ర‌భుత్వ ప్రధాన లక్ష్యమ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో శుక్ర‌వారం ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కోవిడ్‌ –19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై అధికారుల‌తో సమీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా  కోవిడ్‌ నియంత్రణ, నివారణ చర్యలపై ముఖ్యమంత్రికి అధికారులు వివరాలు అందించారు.

50వేల దిగువకు యాక్టివ్‌ కేసులు
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా పాజిటివిటీ రేటు 5.23 శాతం న‌మోదు అయ్యింఇ. 6 జిల్లాల్లో 5 కంటే తక్కువ పాజిటివిటీ రేటు ఉంది. కడప, గుంటూరు, నెల్లూరు, విజయనగరం, విశాఖపట్నం, కర్నూలు జిల్లాలలో 5 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు ఉంది. జాతీయ సగటు కంటే అధికంగా రికవరీ రేటు
దేశవ్యాప్తంగా రికవరీ రేటు సగటు 96.59శాతం, ఏపీలో 96.67శాతం ఉంద‌ని అధికారులు సీఎంకు వివ‌రాలు అందించారు. ప్రయివేటు ఆస్పత్రుల్లో అక్యుపై అయిన పడకల్లో 76.51శాతం పడకల్లో రోగులకు ఆరోగ్య శ్రీ కింద చికిత్స అందిస్తున్న‌ట్లు తెలిపారు. 104కు గణనీయంగా కాల్స్ త‌గ్గాయ‌ని, జూన్‌ 25న కేవలం 1021 కాల్స్ మాత్ర‌మే వ‌చ్చాయ‌ని ముఖ్య‌మంత్రికి అధికారులు వివ‌రించారు.

బ్లాక్‌ ఫంగస్‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాలి
బ్లాక్ ఫంగ‌స్‌పై అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సూచించారు. రాష్ట్రంలో 3148 బ్లాక్ ఫంగ‌స్ కేసులు న‌మోదు కాగా, ఇప్ప‌టికే 1095 స‌ర్జ‌రీలు చేశామ‌ని అధికారులు తెలిపారు.  బ్లాక్ ఫంగ‌స్ కార‌ణంగా రాష్ట్రంలో 237 మంది మ‌ర‌ణించారు. 1398 మంది డిశ్చార్జి కాగా,
మిగిలిన వారికి కొనసాగుతుంద‌ని వెల్ల‌డించారు. 

134 ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు
రాష్ట్ర వ్యాప్తంగా 134 ఆక్సిజన్‌ జనరేషన్‌(పీఎస్‌ఎ) ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు.
50 అంతకంటే ఎక్కువ పడకలున్న ఆస్పత్రుల్లో జనరేషన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామ‌ని చెప్పారు. సెప్టెంబరు నాటికి 97 ప్లాంట్లు ఏర్పాటవుతాయని, మిగిలిన 37 ప్లాంట్లు రానున్న మార్చి నాటికి పూర్తి చేస్తామని వెల్లడించారు.

మందుల‌న్నీ జీఎంపీ, డ‌బ్ల్యూహెచ్‌వో ప్ర‌మాణాల‌తో ఉండాలి
ప్రభుత్వాసుపత్రుల్లో వినియోగించే మందులన్నీ జీఎంపీ ,  డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాలతో ఉండాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారులకు స్పష్టంచేశారు. అలాగే ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లోకూడా జీఎంపీ, డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాలున్న మందులు ఉండాల‌ని ఆదేశించారు. ఆస్పత్రుల్లో శానిటేషన్, రోగులకు అందించే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని సూచించారు. నిరంతరం మానిటరింగ్‌ చేయాల‌న్నారు. అలాగే ఆస్పత్రి భవనాల నిర్వహణ, వైద్య పరికరాల నిర్వహణపైనా ప్రత్యేక దృష్టిపెట్టాల‌ని ఆదేశించారు.
దీనిపై ప్రత్యేక ఎస్‌ఓపీలను తయారు చేయారు చేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై పటిష్టమైన  యంత్రాంగం ఉండాల‌ని, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, రోగులకు ఆహారంపై పర్యవేక్షణ ఉండాల‌ని సూచించారు.  వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది హాజరుపై పర్యవేక్షణ ఉండాలి
దీని కోసం ప్రత్యేక అధికారిని నియమించాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు.

ఆస్పత్రుల్లో నాడు–నేడు
ఆస్పత్రుల్లో నాడు – నేడు కార్యక్రమాలు చేపట్టిన తర్వాత వాటి  నిర్వహణకు చాలా ప్రాధాన్యత నివ్వాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. రోగులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందాలి . 21 రోజులలో కచ్చితంగా ఆరోగ్యశ్రీ, 104, 108 బిల్లులు చెల్లించాలని సూచించారు.

హెల్త్‌ హబ్స్‌
జిల్లాల్లో హెల్త్‌ హబ్స్‌పై సీఎంకు  అధికారులు వివ‌రాలు అందించారు. ఏయే చికిత్సలకోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారన్నదానిపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించారు. క్యాన్సర్, గుండెజబ్బులు, చిన్నపిల్లల సర్జరీలకోసం అధికంగా ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారని చెప్పారు. ఈ వ్యాధులకు వైద్యసేవలు ఇక్కడ హబ్స్‌లో అందేలా.. ఆ రకమైన స్పెషాల్టీ ఆస్పత్రుల ఏర్పాటుకు హబ్స్‌లో ప్రాధాన్యత ఇచ్చే దిశగా చూస్తున్నామని అధికారులు చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా వస్తున్న 16 మెడికల్‌కాలేజీలు, ఆధునీకరిస్తున్న 11 పాత వైద్య కళాశాలలు,  ఈ హెల్త్‌హబ్స్‌తో ఆరోగ్యరంగం బలోపేతం అవుతుంద‌ని వెల్లడించారు. హెల్త్‌హబ్స్‌కు స్థలాలు.. ఆవాసాలకు దగ్గరగానే ఉండేలా చూడాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశాలు జారీ చేశారు. అప్పుడే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారు. అత్యాధునిక వైద్య సదుపాయాలు అందాలన్నదే ప్రధాన లక్ష్యమ‌ని అధికారులకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ దిశా నిర్ధేశం చేశారు.

ఈ సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి (వైద్య,ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణశ్రీనివాస్‌ (నాని), సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, కోవిడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజిమెండ్‌ అండ్‌ వాక్సినేషన్‌) ఎం రవిచంద్ర, 104 కాల్‌ సెంటర్ ఇన్‌ఛార్జ్‌ ఎ.బాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్,  ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్‌ ఎ మల్లిఖార్జున్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ వి విజయరామరాజు, పరిశ్రమలశాఖ డైరెక్టర్‌ జెవిఎన్‌ సుబ్రమణ్యం, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

తాజా వీడియోలు

Back to Top