తాడేపల్లి: సహకార బ్యాంకులు మన బ్యాంకులు, వాటిని కాపాడుకోవాలని, తక్కువ వడ్డీలకు రుణాలు వస్తాయి, దీనివల్ల ప్రజలకు, రైతులకు మేలు జరుగుతుందని, ఎంత వెసులుబాటు ఉంటుందో అంత తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వండి అని ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. సహకార శాఖపై సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల పనితీరు, వాటి బ్రాంచ్లు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పనితీరును ముఖ్యమంత్రి సమీక్షించారు. సహకార బ్యాంకుల బలోపేతంపై ఇప్పటివరకూ తీసుకున్న చర్యలను అధికారులకు సీఎం వైయస్ జగన్కు వివరించారు. డీసీసీబీలు, సొసైటీలు బలోపేతం, కంప్యూటరైజేషన్, పారదర్శక విధానాలు, ఆర్బీకేలతో అనుసంధానం తదితర అంశాలపై కీలకంగా చర్చించారు.
ఈ సందర్బంగా సీఎం వైయస్ జగన్ ఏమన్నారంటే..
``బ్యాకింగ్ రంగంలో పోటీని ఎదుర్కొనేలా డీసీసీబీలు, సొసైటీలు ఉండాలి. ఈ పోటీని తట్టుకునేందుకు ఆర్షణీయమైన వడ్డీరేట్లతో రుణాలు ఇవ్వండి. నాణ్యమైన రుణసదుపాయం ఉంటే బ్యాంకులు బాగా వృద్ధిచెందుతాయి. మంచి ఎస్ఓపీలను పాటించేలా చూడాలి. డీసీసీబీలు లాభాల బాటపట్టేలా చూడాలి. డీసీసీబీలు పటిష్టంగా ఉంటే.. రైతులు మేలు పొందుతారు. బంగారంపై రుణాలు ఇచ్చి మిగిలిన బ్యాంకులు వ్యాపారపరంగా లబ్ధి పొందుతున్నాయి. రుణాలపై కచ్చితమైన భద్రత ఉన్నందున వాటికి మేలు చేకూరుతోంది. ఇలాంటి అవకాశాలను సహకార బ్యాంకులు కూడా సద్వినియోగం చేసుకోవాలి. వాణిజ్య బ్యాంకులు, ఇతర బ్యాంకుల కన్నా తక్కువ వడ్డీకే బంగారంపై రుణాలు ఇవ్వడం ద్వారా ఖాతాదారులను తమవైపుకు తిప్పుకోవచ్చు. తద్వారా అటు ఖాతాదారులకు, ఇటు సహకార బ్యాంకులకు మేలు జరుగుతుంది.
వ్యవసాయ రంగంలో ఆర్బీకేల్లాంటి విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు ఈ రంగంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకనే వాటిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. రుణాల మంజూరులో ఎక్కడా రాజీ ఉండకూడదు, రాజకీయాలకు చోటు ఉండకూడదు. అవినీతికి, సిఫార్సులకు తావులేకుండా కేంద్ర సహకార బ్యాంకులు కార్యకలాపాలు సాగాలి. నిబంధనలు పాటిస్తున్నారా? లేదా? అన్నది చాలా ముఖ్యం. పాలనలో సమర్థతతో పాటు, అవినీతి లేకుండా ఉంటేనే, నాణ్యమైన సేవలు అందితేనే ప్రజలకు మేలు జరుగుతుంది. లేదంటే.. ప్రజలకు నష్టం వాటిల్లుతుంది. సహకార బ్యాంకుల్లో ఖాతాదారులకు విశ్వాసం కలిగించే చర్యలు తీసుకోవాలి. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్)బ్యాంకింగ్ కార్యకలాపాలు ఆర్బీకేల ద్వారా సాగాలి. ఆ మేరకు పీఏసీఎస్లను మ్యాపింగ్చేసి.. వాటి కింద వచ్చే ఆర్బీకేలను నిర్ణయించాలి.
ఆర్బీకేల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలను పీఏసీఎస్లతో అనుసంధానం చేయాలి. ఇప్పటికే ఆర్బీకేల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లు ఉన్నారు. వీరు రైతులకు, బ్యాంకులకు మధ్య అనుసంధాన కర్తగా వ్యవహరించాలి. అంతిమంగా, ఆర్బీకేలు, ఆర్బీకేల్లోని బ్యాంకింగ్ కరస్పాండెంట్లు రైతులకు, బ్యాంకులకు మధ్య ప్రతినిధులుగా వ్యవహరిస్తారు. ఈ వ్యవస్థ ఎలా ఉండాలన్న దానిపై అధికారులు బ్యాంకింగ్ నిపుణులతో మాట్లాడి ఒక విధానాన్ని రూపొందించాలి.
జిల్లాకేంద్ర సహకార బ్యాంకులు, సొసైటీల్లో చక్కటి యాజమాన్య విధానాలను తీసుకురావాలి. అంతిమంగా ప్రతి ఎకరా సాగుచేస్తున్న ప్రతిరైతుకూ మేలు జరగాలి. ఈ లక్ష్యం దిశగా సొసైటీలను నడిపించాలి. ప్రతిపాదనలను మరింత మెరుగ్గా తయారుచేసి నాకు నివేదించాలి. వ్యవసాయ సలహామండళ్ల సమావేశాల్లో బ్యాకింగ్ రంగంపై రైతులనుంచి వచ్చే ఫిర్యాదులు, సలహాలు, సూచనలు కూడా స్వీకరించి దానిపై తగిన విధంగా చర్యలు తీసుకోవాలి. ఆర్బీకేల్లో ఉన్న కియోస్క్లను సమర్థవంతంగా వాడుకోవాలి. బ్యాంకింగ్ కార్యకలాపాల్లో కూడా కియోస్క్లను సద్వినియోగం చేసుకోవాలి. రైతులకు సంబంధించి డాక్యుమెంట్లను కియోస్క్ల ద్వారా అప్లోడ్ చేసే సదుపాయం కూడా ఉండాలి. ఈమేరకు కియోస్క్ల్లో మార్పులు చేర్పులు చేయాలి`` అని ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నాబాబు, ఏపీ అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛైర్మన్ ఎం.వీ.యస్ నాగిరెడ్డి, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి వై.మధుసూధన్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.