సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోండి

విద్యుత్‌ రంగంలో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనే లక్ష్యం

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

అమరావతి: విద్యుత్‌ రంగంలో పెట్టుబడులు, మరిన్ని ఉద్యోగాల కల్పనే లక్ష్యమని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తి, ఆ విద్యుత్‌ను బయట అమ్మకోవాలనుకునే కంపెనీలకు, సంస్థలకు అనుకూలంగా పాలసీ తీసుకువస్తున్నామన్నారు. విద్యుత్‌రంగంపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఎనర్జీ ఎక్స్‌పోర్ట్‌ పాలసీ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్లాంట్లు పెట్టాలనుకునేవారికి సానుకూల వాతావరణం కల్పించేలా ఎనర్జీ ఎక్స్‌పోర్ట్‌ పాలసీ ఉండాలని అధికారులకు సూచించారు. లీజు ప్రాతిపదికన పరిశ్రమలకు భూములిచ్చే ప్రతిపాదనపై ఆయన చర్చించారు. దీనివల్ల భూములిచ్చేవారికి మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ప్రతి ఏటా రైతులకు ఆదాయం వస్తుందని, భూమిపై హక్కులు ఎప్పటికీ వారికే ఉంటాయని సీఎం వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు.

రాష్ట్రంలో మరో వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదనకు ఎన్టీపీసీ ముందుకు వస్తుందని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. వారికి అవసరమైన భూమిని ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. 10వేల మెగావాట్ల సోలార్‌ ప్లాంట్‌ నిర్మాణంపై కూడా ఈ సమావేశంలో అధికారులతో సీఎం వైయస్‌ జగన్‌ చర్చించారు. వీలైనంత త్వరగా సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వ్యవసాయానికి 9 గంటలపాటు నిరంతర విద్యుత్‌ కోసం ఫీడర్ల ఆటోమేషన్‌ ఏర్పాటు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే రెండేళ్లలోగా ఆటోమేషన్‌ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Back to Top