బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి

అధికారులకు సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశం

పరవాడలో సాయినార్‌ లైఫ్‌ సెన్సెస్త్‌ ఫార్మా కంపెనీలో ప్రమాదంపై సీఎం ఆరా

తాడేపల్లి: విశాఖ సమీపంలోని పరవాడలో సాయినార్‌ లైఫ్‌ సెన్సైస్‌ ఫార్మా కంపెనీలో ప్రమాదంపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. సీఎంవో అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ఇద్దరు మరణించారని, మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. ఒకరు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని, మరో ముగ్గురు సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. 

రియాక్టర్‌ వద్ద లీకేజీ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. సోమవారం రాత్రి 11:30 గంటలకు ప్రమాదం జరిగిందని, తమ దృష్టికి వచ్చిన వెంటనే ఫ్యాక్టరీ ప్రాంతానికి జిల్లా కలెక్టర్, సీపీ చేరుకున్నారని వివరించారు. ముందు జాగ్రత్తగా ఫ్యాక్టరీని షట్‌డౌన్‌ చేయించారని, ప్రమాదం ఫ్యాక్టరీలో ఓ రియాక్టర్‌ ఉన్న విభాగానికి పరిమితమని ఎలాంటి ఆందోళన అవసరంలేదని అధికారులు నివేదించారు. బాధితులను కలెక్టర్‌ వినయచంద్, విశాఖ సిటీ పోలీస్‌ కమిషనర్‌ మీనా పరామర్శించారని తెలిపారు. ఈ ఘటనపై విచారణ కూడా చేయిస్తున్నట్టు కలెక్టర్‌ వెల్లడించారన్నారు. 
 

Back to Top