అనకాపల్లి జిల్లా: నర్సీపట్నం వైద్య కళాశాలకు సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అలాగే తాండవ–ఏలేరు ఎత్తిపోతల పథకం కాలువల అనుసంధాన ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అనకాపల్లి జిల్లా మాకవారిపాలెం మండలం భీమబోయినపాలెంలో 52.15 ఎకరాల్లో ఈ వైద్య కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో బోధనాస్పత్రి, వైద్య, నర్సింగ్ కళాశాలలు, వైద్య విద్యార్థుల హాస్టళ్లు, ఇతర నిర్మాణాలను అత్యాధునిక వసతులతో చేపట్టనున్నారు. ఏలేరు, తాండవ ప్రాజెక్టుల అనుసంధానానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. రూ.470.05 కోట్లతో చేపట్టిన ఈ అనుసంధానం పనులకు శంకుస్థాపన చేశారు. ఏలేరు ఎడమ కాలువను తాండవ కాలువతో అనుసంధానం చేయడం ద్వారా కొత్తగా 5,600 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు తాండవ ప్రాజెక్టు కింద 51,465 ఎకరాలను స్థిరీకరించనున్నారు.
వెనుకబడిన ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేసేందుకు మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో చేపట్టిన ప్రాజెక్టులను పూర్తిచేయాలన్న లక్ష్యంతో సీఎం వైయస్ జగన్.. గోదావరి జలాలను 8 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా రూ.17,411.40 కోట్లతో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు. తాజాగా.. ఏలేరు–తాండవ అనుసంధానం చేపట్టడం ద్వారా ఉత్తరాంధ్రలో సాగునీటి సదుపాయాలను మరింత మెరుగుపర్చి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడంలో సీఎం మరో అడుగు ముందుకేశారని రైతులు, నీటిపారుదలరంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు.