కర్నూలు చరిత్రలో ఈరోజు ఎప్పటికీ నిలిచిపోతుంది

కర్నూలు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు

విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో ప్రకటించిన సీఎం వైయస్‌ జగన్‌

న్యాయ రాజధానికి రోడ్డు, రైలు మార్గాలే కాదు.. ఎయిర్‌పోర్టు సౌకర్యం తెచ్చాం

రూ.110 కోట్లు ఖర్చుచేసి ఏడాదిన్నరలో విమానాశ్రయం పూర్తిచేశాం

ఒకేసారి 4 విమానాలు పార్కు చేసే సౌకర్యం కల్పించాం

పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో మీ అందరి హృదయాల్లోంచి మద్దతిచ్చారు

మీకోసం మరింత కష్టపడి పనిచేస్తానని మాటిస్తున్నా..

కర్నూలు: కర్నూలు చరిత్రలో ఈ రోజు ఎప్పటికీ నిలిచిపోతుందని, ఇంత వరకు రోడ్డు, రైలు మార్గాలే అందుబాటులో ఉండే ఈ జిల్లాలో ఇకమీదట నుంచి విమానప్రయాణం కూడా జరగబోతుందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  అన్నారు. రూ.110 కోట్లతో ఏడాదిన్నరలో ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును పూర్తిచేశామని చెప్పారు. తొలి దశ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి నివాళిగా.. ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్‌పోర్టుగా నామకరణం చేస్తున్నట్లు సీఎం వైయస్‌ జగన్‌ ప్రకటించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు ప్రారంభి.. జాతికి అంకితమిచ్చిన అనంతరం ప్రజలనుద్దేశించి సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. 

ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..

‘ఈనెల 28వ తేదీ నుంచి ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలు మొదలవుతాయి. ప్రారంభంలో బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభం అవుతాయి. ఒకేసారి నాలుగు విమానాలు పార్కు చేసుకునే విధంగా ఎయిర్‌పోర్టులో సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చాం. 

ఆరవ ఎయిర్‌పోర్టు..
ఇప్పటి వరకు రాష్ట్రంలో ఐదు విమానాశ్రయాలు ఉంటే.. ఇది 6వ విమానాశ్రయం కాబోతుంది. తిరుపతి, కడప, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, ఈ కర్నూలు ఎయిర్‌పోర్టుతో ఆరవ విమానాశ్రయం ప్రారంభం కాబోతుంది. ఈ ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు మనందరం నిర్మించుకోబోతున్న న్యాయరాజధానిలో మిగతా ప్రాంతాలు, మిగతా రాష్ట్రాలను కలిపే ఎయిర్‌పోర్టుగా నిలబడుతుంది. 

ఆ రిబ్బన్‌ కట్టింగ్‌లను మనమంతా కళ్లారా చూశాం..
ఇదే ఎయిర్‌పోర్టు విషయానికి వస్తే.. ఎన్నికలకు కేవలం నెల రోజుల గడువు ముందు 2019 ఫిబ్రవరిలో అనుకుంటా.. ఎయిర్‌పోర్టు పూర్తికాకముందే, అనుమతులు రాకముందే, కనీసం రన్‌వే పనులు కూడా పూర్తికాని పరిస్థితుల్లోనే ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి.. ఆయన పేరు చంద్రబాబు.. రావడం, రిబ్బన్‌ కటింగ్‌ చేయడం మనమంతా కళ్లారా చూశాం. ఆ రోజు నుంచి ఈ రోజుకు దాదాపుగా 2 సంవత్సరాలు కావొస్తుంది. 

పట్టుదలతో రూ.110 కోట్లు ఖర్చు చేసి..
కర్నూలులో ఇదే విమానాశ్రయం కచ్చితంగా రావాలని, పట్టుదలతో రూ.110 కోట్లు ఖర్చు చేసి.. పనులు చేయించి కేవలం ఏడాదిన్నర వ్యవధిలోనే ప్యాసింజర్‌ టర్మినల్‌ బిల్డింగ్, ఐదు ఫోర్లలో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ అడ్మిషన్‌ బిల్డింగ్, పోలీస్‌ బ్యారెక్, ప్యాసింజర్‌ లాంజ్, వీఐపీ లాంజ్, ట్యాంక్, సబ్‌స్టేషన్లు, రన్‌వేలోని బ్యాలెన్స్‌ పనులు ఇవన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయగలిగామని ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తున్నాను. ఇదొక్కటే కాకుండా ఆస్ట్రియా నుంచి దిగుమతి చేసుకున్న రెండు అధునాత అగ్నిమాపక శకటాలను కూడా ఇక్కడే అందుబాటులో ఉంచడం జరుగుతుంది. 

మంత్రికి, అధికారులకు అభినందనలు..
ప్యాసింజర్‌ టర్మినల్‌ వద్ద కార్‌ రెంటల్, బేబీకేర్, మెడికల్‌ కేర్‌ వంటి అన్ని సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. కర్నూలు విమానాశ్రయానికి ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ), పౌర విమానయాన డైరెక్టర్‌ జనరల్‌ (డీజీసీఏ) అనుమతులు తెప్పించడంలో, ఎయిర్‌పోర్టుకు సంబంధించి నిర్మాణాలు పూర్తి చేయడంలో మన మంత్రి, అధికారులు ఎంతగానో పనిచేశారని, వారందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. 

పరాయి పాలకుల గుండెల్లో నిద్రపోయిన యోధుడికి నివాళిగా..
నా ప్రసంగం ముగించే ముందు ఒక్క విషయం కచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మన దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చింది. భారత జాతీయ కాంగ్రెస్‌ 1885లోనే పుట్టింది. 1915లో గాంధీజీ మన దేశానికి తిరిగి వచ్చారు. 1917లో మొట్టమొదట సత్యాగ్రహం చంపవరం (బిహార్‌)లో జరిగింది. వీటన్నింటికంటే ముందు ఈ కర్నూలు గడ్డ మీద స్వాతంత్య్రానికి వంద సంవత్సరాల ముందే మొదటి స్వాతంత్య్ర పోరాటం అని చెప్పి చరిత్రకారులు 1857లో జరిగిన సిపాయి తిరుగుబాటు కంటే ముందే 1847లోనే రైతుల పక్షాన, పరాయి పాలకుల గుండెల్లో నిద్రపోయిన ఒక మహా స్వాతంత్య్ర సమరయోధుడు.. ఈ గడ్డ నుంచే వచ్చాడు. ఆ యోధుడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆయనకు నివాళిగా ఈ విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంగా నామకరణం చేస్తున్నామని సగర్వంగా తెలియజేస్తున్నాను. 

మనందరి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు..
దేవుడి దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ఇటీవలే పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ ఎన్నికల్లో మీ అందరి హృదయాల నుంచి మద్దతు పలికారు. మీ కోసం మరింతగా పనిచేస్తానని ప్రతి ఒక్క అక్కచెల్లెమ్మకు, ప్రతి ఒక్క సోదరుడికి, స్నేహితుడికి నిండు మనస్సుతో తెలియజేస్తున్నాను’ అని సీఎం వైయస్‌ జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు. 
 

Back to Top