తాడేపల్లి: గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ఈనెల 15వ తేదీ తరువాత పూర్తిస్థాయిలో అమలులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలతో మేలు చేస్తున్న వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం ప్రతి కుటుంబం ఆరోగ్యం పట్ల కూడా అంతే శ్రద్ధ తీసుకుంటూ ఫ్యామిలీ డాక్టర్ విధానానికి రూపకల్పన చేసింది. గతేడాది అక్టోబర్ 21 నుంచి ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్ రన్ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటి వరకూ 45,90,086 మందికి వైద్య సేవలు అందించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్ రన్ అమలు, వైద్య ఆరోగ్య శాఖలో నాడు – నేడు సహా వివిధ కార్యక్రమాల పురోగతిని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పరిశీలించారు.
డాక్టర్ వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ రిఫరల్ సేవలను ఫ్యామిలీ డాక్టర్ విధుల్లో భాగంగా చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశించారు. ఆరోగ్యశ్రీ సేవల్లో ఎలాంటి ఇబ్బంది, సమస్యలు ఎదురైనా ఫిర్యాదు చేసేందుకు వీలుగా కార్డులపై నంబర్ ఉంచాలని సూచించారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నప్పటికీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో వైద్యం అందించేందుకు డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని కార్డులపై ముద్రించాలన్నారు. రక్తహీనత బాధితుల వివరాలను వైయస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్కు అనుసంధానించి పౌష్టికాహారం అందించాలని అధికారులకు సూచించారు. అంతేకాకుండా పౌష్టికాహారం అందిస్తున్నారా? లేదా? అన్నది పర్యవేక్షించాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు.
పీహెచ్సీల్లో పూర్తిస్థాయిలో వైద్యుల నియామకం
ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలులోకి తెచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా 1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పూర్తిస్థాయిలో వైద్యుల నియామకాలను భర్తీ చేసినట్లు సీఎం వైయస్ జగన్కు అధికారులు వివరించారు. దీర్ఘకాలిక సెలవుల సమయంలో సేవలకు అంతరాయం కలగకుండా వైద్యుల అదనపు నియామకాలు చేపట్టామని వివరించారు. ప్రతి జిల్లాకు నలుగురు అదనపు వైద్యులను సిద్ధంగా ఉంచామన్నారు. ఇక డాక్టర్ల స్వల్పకాలిక సెలవుల సందర్భాల్లో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడకుండా ప్రతి 6–7 పీహెచ్సీలకు ఒక వైద్యుడిని అదనంగా నియమించామని, ఇలా రాష్ట్రవ్యాప్తంగా 175 మందిని రిజర్వ్లో ఉంచినట్లు స్పష్టం చేశారు.
మరిన్ని ఔషధాలు.. టెస్టింగ్ కిట్లు.. రిజర్వు వాహనాలు
రాష్ట్రంలో 10,032 వైయస్ఆర్ విలేజ్ క్లినిక్లకుగానూ ప్రతి చోటా ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్వో), ముగ్గురు నుంచి నలుగురు ఆశా కార్యకర్తలు ఉంటారని అధికారులు చెప్పారు. విలేజ్ క్లినిక్స్, 104 మొబైల్ మెడికల్ యూనిట్ల (ఎంఎంయూ)లో మందుల సంఖ్యను 67 నుంచి 105కి పెంచామన్నారు. విలేజ్ క్లినిక్స్లో 14 రకాల వైద్య పరీక్షల కిట్లను అందుబాటులో ఉంచామన్నారు. ప్రజలకు అందించే వైద్య సేవలను రియల్ టైమ్లో నమోదు చేసేందుకు టూల్స్ సిద్ధం చేశామన్నారు. 104 ఎంఎంయూలు ప్రస్తుతం 676 ఉండగా కొత్తగా 234 వాహనాలతో కలిపి మొత్తం 910 ఎంఎంయూలతో ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలవుతుందని వివరించారు. ప్రతి జిల్లాకు బ్యాక్ అప్ కింద మరో 104 ఎంఎంయూ వాహనాన్ని రిజర్వ్లో ఉంచుతున్నట్లు తెలిపారు.
ఉదయం 9 నుంచి 4 గంటల వరకు గ్రామాల్లోనే..
ఫ్యామిలీ డాక్టర్ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు గ్రామంలోనే ఉంటూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తారని అధికారులు తెలిపారు. జనరల్ ఓపీ, జీవన శైలి జబ్బులు, గర్భవతుల ఆరోగ్య సంరక్షణ, అంగన్వాడీ, పాఠశాలల సందర్శన, పిల్లల ఆరోగ్యంపై పరిశీలన, రక్తహీనత నివారణ తదితర అంశాలపై వైద్యులు దృష్టి పెడతారని చెప్పారు. మంచానికే పరిమితమైన రోగులకు ఇంటి వద్దే వైద్య సేవలు అందించడంతో పాటు పంచాయతీ కార్యదర్శితో కలిసి గ్రామంలో పారిశుద్ధ్యంపై పర్యవేక్షణ లాంటి విధులన్నింటినీ ఫ్యామిలీ డాక్టర్ నిర్వహిస్తారన్నారు. రక్తపోటు, మధుమేహం లాంటి జీవనశైలి జబ్బుల బాధితుల డేటా వివరాలు ఫ్యామిలీ డాక్టర్కు అందుబాటులో ఉంటాయన్నారు. వీరికి ఫాలో అప్ వైద్య సేవలను అందించడం కోసం ఈ డేటాను వినియోగిస్తామన్నారు. 108 అంబులెన్స్ల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ కండిషన్లో లేని వాహనాలను తొలగించి కొత్తవాటిని ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా కొత్తగా 108 అంబులెన్స్ వాహనాలు 146 కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న వైద్య కళాశాలల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కళాశాలల్లో 2023–24 విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేలా ఏర్పాట్లు జరుగుతున్నట్లు అధికారులు సీఎం వైయస్ జగన్కు వివరించారు. విజయనగరం వైద్య కళాశాలకు ఇప్పటికే ఎన్ఎంసీ అనుమతులు లభించాయని చెప్పారు.