స‌ద‌ర‌న్ జోన‌ల్ కౌన్సిల్ స‌మావేశం ప్రారంభం

స‌మావేశాన్ని లాంఛ‌నంగా ప్రారంభించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

హాజ‌రైన అతిథుల‌ను స‌త్క‌రించిన ఏపీ ముఖ్య‌మంత్రి

తిరుప‌తి: దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం తిరుప‌తిలోని తాజ్ హోట‌ల్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. స‌దర‌న్ జోన‌ల్ కౌన్సిల్ సమావేశానికి ఆంధ్రప్రదేశ్‌ ఆతిథ్యం ఇవ్వగా.. స‌మావేశాన్ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో కొన‌సాగుతున్న ఈ స‌మావేశానికి హాజ‌రైన అతిథుల‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఘ‌నంగా స‌త్క‌రించారు. ఈ సమావేశానికి కర్ణాటక సీఎం బొమ్మై, పుదుచ్చేరి ముఖ్య‌మంత్రి రంగ‌స్వామి, అండ‌మాన్ నికోబార్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ అడ్మిర‌ల్ డీకే జోషి, ల‌క్ష‌ద్వీప్ అడ్మినిస్ట్రేట‌ర్ ప్ర‌పుల్ ప‌టేల్‌, తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ తమిళిసై సౌందరరాజన్, తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ, త‌మిళ‌నాడు, కేర‌ళ నుంచి మంత్రులు ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. 

ఏపీ ప్రస్తావించనున్న అంశాలు  
- తెలుగు గంగకు సంబంధించి తమిళనాడు నుంచి రావాల్సిన బకాయిలు.
- పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలు.
- తెలంగాణా నుంచి రావాల్సిన రూ.6,300 కోట్ల విద్యుత్‌ బకాయిలు.
- రాష్ట్ర విభజన జరిగిన ఆర్థిక ఏడాది ఏర్పడిన రెవిన్యూ లోటు కింద రావాల్సిన నిధులు.
- రేషన్‌ బియ్యంలో హేతు బద్ధతలేని కేంద్రం కేటాయింపులు.
- తెలంగాణ నుంచి రావాల్సిన సివిల్‌ స‌ప్ల‌యిస్‌ బకాయిల అంశాలు.
- ఎఫ్‌డి ఖాతాల స్తంభన, ఆస్తుల విభజనలో అపరిష్కృత అంశాలు.
- కేఆర్‌ఎంబీ పరిధిలోకి జూరాల ప్రాజెక్టును తీసుకురావడం.
- నదుల అనుసంధానంపై కేంద్రం ప్రతిపాదనల ప్రస్తావన. రాష్ట్రానికి మేలు జరిగేలా, వీలైనంత త్వరగా సాకారం అయ్యే ప్రణాళికలు, రాష్ట్రం సూచిస్తున్న ప్రత్యామ్నాయాలు.
- ఇతర రాష్ట్రాలు ప్రస్తావించే అంశాల్లో రాష్ట్రానికి సంబంధించిన విషయాలు ఉంటే.. వాటిపై తగిన రీతిలో స్పందన.

Back to Top