ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు రైతులకు వరం

గ్లోబల్‌ స్పైసెస్‌ ప్రాసెసింగ్‌ ఫెసిలిటీ యూనిట్‌ను ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌

ఆసియాలోనే అతిపెద్ద ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ మన రాష్ట్రంలోనే ఉంటుంది

ప్రాసెసింగ్‌ యూనిట్‌తో 14 వేల మంది రైతులకు మేలు జరుగుతుంది
 ∙
ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో గత మూడేళ్లుగా ఏపీ ప్రథమ స్థానంలో నిలిచింది

ఆర్‌బీకే విధానంతో రైతుల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నాం

కంపెనీలకు ఎలాంటి సమస్యలు వచ్చినా..ఒక్క ఫోన్‌ కాల్‌తో స్పందిస్తాం

ప‌ల్నాడు: ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు రైతులకు వరమని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు.  రూ.3,450 కోట్లతో ప్రతి జిల్లాలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లతో 33 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు.  శుక్రవారం పల్నాడు జిల్లా వంకాలయపాడులో ఐటీసీ సంస్థ ఏర్పాటు చేసిన గ్లోబల్‌ స్పైసెస్‌ ప్రాసెసింగ్‌ ఫెసిలిటీ యూనిట్‌ను సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. 

 ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...:

అందరికీ స్వాగతం. వేలాదిమంది రైతులకు మేలు చేసే ఇంత మంచి పరిశ్రమ ఏర్పాటు చేసినందుకు ఐటీసీ బృందానికి అభినందనలు. ఐటీసీ లిమిటెడ్‌ ఛైర్మన్‌ సంజీవ్‌ పూరి, స్పైసెస్‌ బోర్డు సెక్రటరీ సతియాన్, నా కేబినెట్‌ సహచరులకు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు, అతిధులందరికీ అభినందనలు.

ఐటీసీ స్పైస్‌ ప్లాంట్‌ – వండర్‌పుల్‌ మూవ్‌మెంట్‌.
 ఐటీసీ గ్లోబల్‌ స్పైస్‌ ప్లాంట్‌ ఇవాళ ఇక్కడ ప్రారంభం అవుతుంది. ఇది ఒక అద్భుతమైన ఘట్టం. దాదాపుగా రూ.200 కోట్ల పెట్టుబడి, ఏటా 20వేల మెట్రిక్‌ టన్నుల మిర్చితో పాటు మరో 15 రకాల సుగంధ ద్రవ్యాలన్నింటినీ కూడా ప్రాసెస్‌ చేసి ఇక్కడ నుంచి ఎగుమతి చేస్తారు. మిర్చితోపాటు అల్లం, పసుపు, ధనియాలు, యాలకులు వంటి 15 రకాల సేంద్రీయ సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్‌ చేస్తారు. ఈ ప్లాంట్‌ తొలిదశ పూర్తయింది. రెండో దశ కూడా మరో 15 నెలల్లో పూర్తవుతుందని చెబుతున్నారు. అది కూడా పూర్తయితే...  దేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే అతిపెద్ద సుగంధ ద్రవ్యాల ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ మన రాష్ట్రంలోనే ఉంటుందని ఐటీసీ ఛైర్మన్‌ సంజీవ్‌ పూరి చెప్పారు. ఇప్పటికే 20వేల మెట్రిక్‌ టన్నుల ప్రాసెసింగ్‌ యూనిట్‌ పెడుతున్నారు.. దీనివల్ల దాదాపుగా ప్రత్యక్షంగా, పరోక్షంగా 1500 మంది ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమం జరుగుతుంది .అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న 14వేల మంది రైతులకు ఇది ఒక గొప్ప వరంగా ఉపయోగపడుతుంది. నవంబరు 2020లో ఈ ప్లాంట్‌ నిర్మాణం ప్రారంభించారు. ఈ రోజు నవంబరు 2022 అంటే కేవలం 24 నెలల కాలంలోనే ఈ ప్లాంట్‌ నిర్మాణం ప్రారంభించి, పనులు పూర్తి చేసారు. ఇంత వేగంగా అడుగులు పడ్డాయి అంటే ఇందులో రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఎంత ఉందన్నదానికి వేరే నిదర్శనం అవసరం లేదు. 

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ – ఏపీ నెంబర్‌ వన్‌.
ఇక్కడ ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ గురించి మాట్లాడాలి. దీని నుంచి నేను మాట్లాడ్డం కన్నా... ఐటీసీ ఛైర్మన్‌ సంజీవ్‌ పూరి గారు ఆంధ్రప్రదేశ్‌లో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ గురించి గొప్పగా మాట్లాడారు. ఆయన నోట్లోంచిæ ఈ మాటలు రావడమే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రతి అధికారికి ఇదొక గొప్ప క్రెడిట్‌. 
గత మూడు సంవత్సరాల నుంచి ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో వరుసగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశంలోనే నెంబర్‌ వన్‌ స్ధానం ప్రతి సంవత్సరం తీసుకుంటుంది. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో మొట్టమొదటిసారిగా గత మూడు సంవత్సరాలుగా .. పరిశ్రమలను పెట్టే వాళ్లని కూడా అభిప్రాయాలను అడిగి, వాటిని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌కి సంబంధించిన మార్కులు ఇస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ గడిచిన మూడు సంవత్సరాలుగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో వరుసగా నెంబర్‌ వన్‌ స్ధానం తీసుకోవడం అంటే... ఇదొక గొప్ప మార్పు. గొప్ప సుగుణం. 

రూ.3450 కోట్లతో 26 జిల్లాల్లో పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ....
ఇటువంటి పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఇంకా ఎక్కువ రావాలని ఇప్పటికే కార్యాచరణ చేశాం. 26 జిల్లాలు ఏర్పాటు చేశాం.  ప్రతి జిల్లాలోనూ రైతులు స్ధానికంగా పండించే పంటలన్నింటికీ కూడా ఇంకా మెరుగైన ధర రావాలి, రైతులకు ఇంకా మెరుగైన పరిస్థితులు ఉండాలి, వాల్యూ ఎడిషన్‌ ద్వారా అది సాధ్యమవుతుందని 26 పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను రూ.3450 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్‌ చేసింది. దీనివల్ల ప్రతి జిల్లాలో ఉన్న రైతులకు మేలు చేయడమే కాకుండా దాదాపు 33వేల ఉద్యోగాలు కూడా కల్పించగలుగుతాం. 
ఇందులో ఫేజ్‌ –1 కు సంబంధించి 10 యూనిట్ల కోసం రూ.1250 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే కార్యక్రమాలు డిసెంబరు, జనవరిలో శంకుస్ధాపన చేయనున్నాం. ఇవన్నీ ఒక్కసారి పూర్తయితే, మరో రెండు మూడేళ్లలో ఈ 26 అందుబాటులోకి వస్తాయి. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా, రైతన్నలకు ఇది ఒక పెద్ద వరంగా మారనుంది. 

రైతుల ఉత్పత్తులకు వాల్యూ ఎడిషన్‌....
ఈ స్పైస్‌ ప్లాంట్‌కు సంబంధించిన ప్రొసీజర్‌ ఎలా ఉంటుందని విచారణ చేశాను. వీళ్ల ప్రొసీజర్‌ ఎలా ఉంటుంది, ఏమేం చేస్తారో కూడా విచారణ చేశాను. మెటీరియల్‌ వచ్చిన వెంటనే క్లీనింగ్, గ్రేడింగ్, డీస్టీమింగ్, గ్రైండింగ్, బ్లెండింగ్, స్టీమ్‌ స్టెరిలైజేషన్, ప్యాకింగ్‌ ఇటువంటి రకరకాల పద్ధతిలో ఈప్రాసెసింగ్‌ పూర్తిచేసుకుంటే రైతులు పండించిన పంటకు వాల్యూ ఎడిషన్‌ జరుగుతుంది. ఎక్స్‌పోర్ట్‌ మార్కెట్‌లో వీటి అమ్మకం కూడా సులభమవుతుందనే ఉద్ధేశ్యంతో ఈ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇటువంటి ప్రాసెసింగ్‌ యూనిట్లు మన రాష్ట్రంలో రావడం వల్ల మన రైతులుకు కచ్చితంగా మేలు జరుగుతుంది. ఇన్ని వందల కోట్ల రూపాయిలతో పెట్టుబడితో ఇక్కడ ప్రాసెసింగ్‌ యూనిట్‌ పెట్టారు కాబట్టి.. మన రైతుల ఉత్పత్తులకు మెరుగైన రేటు ఇచ్చి.. మన రైతులను చేయిపట్టుకుని నడిపించే కార్యక్రమంలో ఐటీసీ ముందడుగు వేస్తుంది. 

ఇటువంటి గొప్ప మార్పులు వ్యవసాయరంగంలో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి గొప్ప మార్పుల్లో మొట్టమొదటి తొలి అడుగు మన ప్రభుత్వం రాగానే ప్రతి గ్రామంలో రైతుభరోసా కేంద్రాల స్ధాపనతో పడింది. 
ప్రతి గ్రామంలో ఆర్బీకే స్ధాపన ద్వారా రాష్ట్రంలో దాదాపు 10,668 ఆర్బీకేల స్ధాపించాం. ప్రతి ఆర్బీకేలోనూ అగ్రికల్చర్‌ గ్యాడ్యుయేషన్‌ చదివిన ఒక అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ను నియమించి.. రైతును చేయిపట్టుకుని విత్తనం నుంచి విక్రయం వరకూ తోడుగా ఉండే గొప్ప మార్పును గ్రామాల్లో తీసుకొచ్చి, గొప్ప విప్లవం సృష్టించాం. 

ఒక్క ఫోన్‌ కాల్‌ దూరంలో– ప్రభుత్వం...
ఐటీసీ సంస్ధ ఈ రాష్ట్రంలో ఇంకా మెరుగైన పరిస్థితుల్లోకి పోవాలని, రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఐటీసీకి అన్ని రకాల మద్ధతు ఇచ్చే విషయంలో వెనుకడుగు ఎప్పుడూ ఉండదని ఐటీసీ యాజమాన్యానికి తెలియజేస్తున్నాను. 
సంజీవ్‌ పూరి గారికి మరొక్క విషయం తెలియజేస్తున్నాను. 
 మీకు ఎప్పుడు ఏ సమస్య  వచ్చినా కూడా... రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఫోన్‌ కాల్‌ దూరంలో ఉంటుంది. ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకొండి.  మీ కష్టాన్ని మా కష్టంగా భావించి.. సాధ్యమైనంత వేగంగా దాన్ని పరిష్కరిస్తాం. ఇది మా మాట. ఇంత మంచి ప్రాజెక్టు ఏర్పాటు చేసినందుకు మీకు మరొక్కసారి ధన్యవాదములు తెలియజేస్తున్నాను అని  సీఎం తన ప్రసంగం ముగించారు. 

ఈ కార్యక్రమంలో  జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఐటీసీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Back to Top