కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
ఇళ్ల నిర్మాణ సామగ్రిలో నాణ్యతాప్రమాణాలు పాటించాలి
23 Aug 2021 1:59 PM
జగనన్న కాలనీల్లో ఇంటర్నెట్ సదుపాయం ఉండాలి
90 రోజుల్లోగా అర్హులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలి
దసరా నాటికి ఎంఐజీ ప్లాట్ల కార్యాచరణ సిద్ధం చేయాలి
గృహ నిర్మాణ శాఖ అధికారులకు సీఎం వైయస్ జగన్ ఆదేశం
రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.5,120 కోట్లు ఆదా చేశామన్న అధికారులు
తాడేపల్లి: వైయస్ఆర్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ సామగ్రిలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పేదలందరికీ ఇళ్లు, టిడ్కో, ఎంఐజీ ఇళ్ల నిర్మాణం, 90 రోజుల్లో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఇళ్ల నిర్మాణ సామగ్రిలో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.5,120 కోట్లు ఆదా చేశామని, ఒక్కో ఇంటి నిర్మాణ సామగ్రి కొనుగోలులో రూ.32 వేలు ఆదా అవుతుందని, లబ్ధిదారుల కోరిక మేరకే నిర్మాణ సామగ్రి పంపిణీ చేస్తామని అధికారులు సీఎం వైయస్ జగన్కు వివరించారు. దీని కోసం ప్రత్యేక యాప్ రూపొందించామని తెలిపారు.
అనంతరం సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. ఇళ్ల నిర్మాణ సామగ్రిలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యుదీకరణకు అవసరమైన సామగ్రి కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు. జగనన్న కాలనీల్లో ఇంటర్నెట్ సదుపాయం ఉండాలని అధికారులను ఆదేశించారు.
జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణపనులు, ఇతరత్రా అంశాలపై సీఎం ఆదేశించిన విధంగా స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించామని తెలిపారు. వారినుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకున్నామని అధికారులు సీఎంకు వివరించారు. నిర్మించనున్న ఇళ్ల మ్యాపింగ్, రిజిస్ట్రేషన్, జాబ్కార్డుల జారీ, జియో ట్యాగింగ్ దాదాపుగా పూర్తయ్యిందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు జిల్లాల్లో అత్యధికంగా సంబంధిత కాలనీల్లో 80 శాతానికిపైగాకి ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని వెల్లడించారు.
అక్టోబర్ 25 నుంచి ప్రారంభం కావాలి..
ఆప్షన్ 3 కింద, అంటే ప్రభుత్వమే కట్టించి ఇవ్వాలన్న ఆప్షన్ ఎంపిక చేసుకున్న వారికి ఇళ్లు కట్టించి ఇచ్చే పనులు అక్టోబరు 25 నుంచి ప్రారంభం కావాలని సీఎం ఆదేశించారు. ఈలోగా అందుకు అవసరమైన సన్నాహకాలను పూర్తిచేయాలన్నారు. ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇవ్వాలన్న ఆప్షన్ను ఎంపిక చేసుకున్న చోట లబ్ధిదారులతో కలిసి గ్రూపులు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి డీపీఆర్లు సిద్ధంచేశామన్నారు. కాలనీల్లో ఇంటర్నెట్ సదుపాయంకూడా ఉండాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధికారులను ఆదేశించారు.
90రోజుల్లోగా ఇళ్లపట్టాల కార్యక్రమంపై సమీక్ష
అర్హులకు 90 రోజుల్లోగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఆగస్టు 22 వరకూ ఇళ్లపట్టాల కోసం కొత్తగా వచ్చిన 3,55,495 అప్లికేషన్లు వచ్చాయని, ఇందులో అర్హత ఉన్న దరఖాస్తులు 1,99,201, వెరిఫికేషన్కోసం పెండింగులో ఉన్న అప్లికేషన్లు 9,216, వీరికి పట్టాలు ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
టిడ్కో ఇళ్లపై సమీక్ష
టిడ్కో గృహాల్లో ఫేజ్–1లో భాగంగా 85,888 ఇళ్ల పనులు పూర్తి చేశామని అధికారులు సీఎంకు వివరించారు. ఈ కాలనీల్లో మౌలిక వసతుల పనులు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. డిసెంబర్ 2021 నాటికల్లా ఈ ఇళ్లు లబ్ధిదారులకు అందిస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఫేజ్ –2 ఇళ్లు జూన్ 2022 నాటికి, ఫేజ్ –3 ఇళ్లు డిసెంబర్ 2022 నాటికి పూర్తవుతాయని చెప్పారు. నిర్దేశిత సమయంలోగా ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామన్నారు.
ఎంఐజీ ప్లాట్లపై సీఎం సమీక్ష
పట్టణాలు, నగరాల్లోని మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరలకే ప్లాట్లు పథకాన్ని కూడా ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమీక్షించారు. దాదాపు 3.94 లక్షల ప్లాట్లకు డిమాండ్ ఉందని అధికారులు తెలిపారు. 150, 200, 250 గజాల విస్తీర్ణంలో ప్లాట్ల కోసం వివిధ రకాలుగా భూముల గుర్తిస్తున్నట్లు చెప్పారు. విజయదశమి నాటికి కార్యాచరణ సిద్ధంచేసి అమలు తేదీలు ప్రకటించాలని సీఎం వైయస్ జగన్ అధికారులను ఆదేశించారు.
9 నగరాల్లో మూడు నగరాలు ఏపీవే..
కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ స్వచ్ఛభారత్ మిషన్ అర్బన్లో భాగంగా అందించే వాటర్ ప్లస్ సర్టిఫికేషన్కు ఏపీ నుంచి మూడు నగరాలకు చోటుదక్కిందని మంత్రి బొత్స సత్యనారాయణ సీఎం వైయస్ జగన్కు వివరించారు. దేశ వ్యాప్తంగా కేవలం 9 నగరాలు మాత్రమే వాటర్ప్లస్ సర్టిఫికెట్ సాధిస్తే.. అందులో 3 నగరాలు ఆంధ్రప్రదేశ్ నుంచి అర్హత సాధించాయని తెలిపారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లు వాటర్ ప్లస్ సర్టిఫికెట్ పొందాయని మంత్రి బొత్స వెల్లడించారు. ఇళ్లు, వాణిజ్య సముదాయాల నుంచి డ్రైన్లు, నాలాలుతో పాటు ఇతర వ్యర్ధ జలాల శుద్ధి, నిర్వహణ, పునర్వినియోగాన్ని నిర్దేశిత ప్రమాణాల మేరకు సమర్థవంతంగా నిర్వహించే నగరాలకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ వాటర్ ప్లస్ సర్టిఫికెట్ అందిస్తుందన్నారు. రాష్ట్రంలో మూడు నగరాలు వాటర్ ప్లస్ సర్టిఫికెట్లు సాధించడంపై అధికారులను ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రశంసించారు.
ఉన్నత ప్రమాణాలు దిశగా అడుగులు వేయాలి..
ఉత్తమ తాగునీటి సరఫరా విధానాలు, మురుగునీటి నిర్వహణపై మార్గదర్శకాలను కలెక్టర్లుకు, కమిషనర్లకు పంపించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాల్టీలలో ఈ గైడ్లైన్స్ అమలయ్యేలా చూడాలన్నారు. తద్వారా రాష్ట్రంలోని పట్టణాలు ఉన్నత ప్రమాణాలు దిశగా అడుగులు వేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి నగరం, మున్సిపాల్టీ కూడా సర్టిఫికెట్ పొందిన నగరాల స్థాయిని చేరుకోవాలని సూచించారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, ఆర్థికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, ఏపీ టిడ్కో ఎండీ శ్రీధర్, గృహనిర్మాణశాఖ కార్యదర్శి రాహుల్ పాండే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ నారాయణ భరత్ గుప్తా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.