రైత‌న్న‌కు అండ‌గా నిలుస్తున్న ప్ర‌భుత్వం మ‌న‌ది

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

రుణమాఫీ పేరుతో రైతన్నలను చంద్రబాబు మోసం చేశాడు

ఖరీఫ్‌లో పంటనష్టపోయిన 45,998 మంది రైతులకు రూ.39.39 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ

ఏ సీజ‌న్‌లో పంట న‌ష్టం జ‌రిగితే ఆ సీజ‌న్ ముగియ‌క‌మునుపే ప‌రిహారం అందిస్తున్నాం

వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ పంట రుణాలు సకాలంలో చెల్లించిన రైతుల ఖాతాల్లో రూ.160.55 కోట్లు జమ

సీజన్‌ ముగియముందే పంట నష్టపరిహారం రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం

కేవలం వైయస్‌ఆర్‌ రైతు భరోసా ద్వారానే రూ.25,971 కోట్లు రైతులకు అందించాం

నేటితో కలిపి పంట నష్టపోయిన 21.31 లక్షల మంది రైతన్నలకు రూ.1,834 కోట్లు అందించాం 

చంద్ర‌బాబు ప్ర‌భుత్వం సున్నావ‌డ్డీ ఎగ్గొట్టింది

గత ప్రభుత్వానికి, మనందరి ప్రభుత్వానికి మధ్య తేడాను గమనించండి

తాడేపల్లి: ‘రైతును అన్ని రకాలుగా ఆదుకోగలిగితేనే రాష్ట్రం బాగుపడుతుందని గట్టిగా నమ్మిన ప్రభుత్వంగా.. రైతన్నలకు అన్ని విధాలుగా తోడుగా ఉంటూ, అండగా నిలబడుతూ మన మూడు సంవత్సరాల ఐదు నెలల పాలన సాగింది’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేవలం వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ అనే ఒకే ఒక్క పథకం ద్వారా రైతులకు రూ.25,971 కోట్లు అందించగలిగామని, సున్నావడ్డీ పంట రుణాలు క్రమం తప్పకుండా ఇవ్వడంతో పాటు ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే ఆ సీజన్‌ ముగియకమునుపే రైతుల ఖాతాల్లో పరిహారం జమ చేస్తున్నామని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు. 2022 జూలై–అక్టోబర్‌ మధ్య (ఖరీఫ్‌లో) కురిసిన అధిక వర్షాలు, వరదలకు పంట నష్టపోయిన 45,998 మంది వ్యవసాయ, ఉద్యానవన రైతులకు రూ.39.39 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ పంట రుణాలు రబీ2020–21, ఖరీఫ్‌ 2021లో రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన 8,22,411 మంది రైతన్నలకు రూ.160.55 కోట్ల వడ్డీ రాయితీ సొమ్మును తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా రైతన్నల ఖాతాల్లో సీఎం వైయస్‌ జగన్‌ నేరుగా జమ చేశారు. 

రైతులను, రైతు కుటుంబాలను ఉద్దేశించి సీఎం వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..

‘‘దేవుడి దయ వల్ల మరో మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడుతున్నాం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. దాదాపుగా 62 శాతం జనాభా వ్యవసాయ రంగం మీదనే ఆధారపడి ఉంది. రైతును అన్ని రకాలుగా ఆదుకోగలిగితేనే ఏ రాష్ట్రమైనా బాగుపడుతుంది. ఇది గట్టిగా నమ్మిన ప్రభుత్వంగా.. రైతులకు అన్ని విధాలుగా తోడుగా ఉంటూ, అండగా నిలబడుతూ గత మూడు సంవత్సరాల ఐదు నెలల పరిపాలన సాగింది. 

క్రమం తప్పకుండా సున్నావడ్డీ పంట రుణాలు కరెక్ట్‌గా ఇవ్వడంతో పాటు, ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే ఆ సీజన్‌ ముగియకమునుపే రైతుల చేతుల్లో పెట్టుబడి కోసం  పరిహారం చెల్లిస్తున్నాం. క్రాప్‌ ఇన్సూరెన్స్‌ మరుసటి ఏడాది ఆ సీజన్‌ రాకముందే క్రమం తప్పకుండా కొత్త ఒరవడిని తీసుకొని వచ్చి.. వ్యవసాయ రంగంలో చాలా రకాల మార్పులకు అడుగులు వేశాం. రైతన్నలకు అందిస్తున్న ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ పథకం సొమ్ము గమనిస్తే.. ఈ రోజుతో కలుపుకొని మొత్తంగా రూ.200 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లోకి బటన్‌ నొక్కి జమ చేయడం జరుగుతుంది. 

ఇందులో మొదటగా రైతన్నలకు అందిస్తున్న ఇన్‌పుట్‌ సబ్సిడీ వివరాలకు వస్తే.. 
2022 జూలై నుంచి అక్టోబర్‌ మధ్యలో కురిసిన అధిక వర్షాలు, వరదల కారణంగా దాదాపు 45,998 మంది వ్యవసాయ, ఉద్యానవన రైతన్నలకు నష్టం జరిగితే.. ఆ రైతన్నలు ఇబ్బందిపడకుండా ఉండేందుకు దాదాపుగా రూ. 40 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని ఈ ఖరీఫ్‌–2022 ముగియకమునుపే నేడు నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే ఆ సీజన్‌ ముగియకమునుపే రైతన్నలకు మంచి జరిగిస్తూ ఇన్‌పుట్‌ సబ్సిడీలో కొత్త ఒరవడిని తీసుకొచ్చాం. 

మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన దాదాపుగా 21.31 లక్షల మంది రైతన్నలకు మొత్తంగా ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.1834 కోట్లు అందించడం జరిగింది. ఈరోజు ఇస్తున్న సొమ్ముతో కలిపితే. 

వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ పంట రుణాలను ఒకసారి గమనిస్తే.. పంటలు వేసే ప్రతీసారి రైతన్నకు పెట్టుబడి కోసం తాను డబ్బులు బ్యాంకుల నుంచి తెచ్చుకుంటే ఆ రైతు సమయానికి చెల్లించగలిగితే ప్రభుత్వం తనకు తోడుగా ఉంటుందనే భరోసా ఈ వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ పథకం ద్వారా కల్పించాం. రైతులకు అన్ని రకాలుగా మంచి చేసే పరిస్థితి రావాలనే ఉద్దేశంతో సన్న, చిన్నకారు రైతులతో పాటు వాస్తవ సాగుదారులందరికీ పంట రుణాల మీద వడ్డీ భారాన్ని తగ్గించేందుకు వరుసగా మూడో ఏడాది పంట రుణాల మీద వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ పథకాన్ని ఈరోజు అమలు చేస్తున్నాం. 

గత సంవత్సరం రబీ, ఖరీఫ్‌కు సంబంధించి రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన 8,22,411 మంది రైతన్నలకు ఈరోజు రూ.160.55 కోట్ల వడ్డీ రాయితీ సొమ్మును నేరుగా వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది.

అన్నదాతలకు అండగా నిలుస్తూ ఈ–క్రాప్‌ డేటా ఆధారంగా పారదర్శకంగా సోషల్‌ ఆడిట్‌ కొరకు ఆర్బీకేల్లో ఆ జాబితాలను సైతం డిస్‌ప్లే చేసి.. లక్ష రూపాయల లోపు పంట రుణాలు తీసుకొని ఏడాదిలోపు తిరిగి చెల్లించిన రైతులందరికీ పూర్తి వడ్డీ రాయితీని మనందరి ప్రభుత్వం క్రమం తప్పకుండా ఇస్తూ వస్తుంది. ఇది మూడో సంవత్సరం. నేను అందిస్తున్న రూ.160.55 కోట్లతో కలిపితే.. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి.. చంద్రబాబు హయాంలో ఆయన ఎగ్గొట్టిన బకాయిలు కూడా కలుపుకుంటే సున్నావడ్డీ పథకం కింద 73.88 లక్షల మంది రైతులకు రూ.1834.55 కోట్లు నేరుగా జమ చేయడం జరిగింది. 

రైతన్నలకు అందించే సహాయం విషయంలో గత ప్రభుత్వానికి, మనందరి ప్రభుత్వానికి మధ్య ఎంతటి తేడా ఉందో కొన్ని విషయాలను అందరి దృష్టికి తీసుకొస్తాను.. 
– గతంలో వైయస్‌ఆర్‌ రైతు భరోసా వంటి పథకం ఏదీ లేదు. రైతులకు తోడుగా నిలబడిన పరిస్థితులు గతంలో లేవు. గతంలో గమనిస్తే.. 87,612 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని, బ్యాంకుల్లో పెట్టిన బంగారం తిరిగి ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని.. ఎన్నికల వేళ రకరకాలుగా ప్రకటనలు ఇచ్చి మోసం చేసిన పరిస్థితులు మనమంతా గమనించాం. 
మాఫీ చేస్తానని చివరికి మోసం చేసి.. తొలి సంతకంతో మాఫీ చేస్తానని ఆయన చెప్పడంతో అప్పుల మీద వడ్డీలు, వడ్డీల మీద చక్రవడ్డీలు తడిసి మోపెడై రైతుల రుణభారం రెట్టింపయిన పరిస్థితులు మనకు కనిపించాయి. బ్యాంకుల్లో పెట్టిన బంగారం వేలం వేసే పరిస్థితి.. బ్యాంకులు రోజూ పేపర్లలో నోటీసులు ఇచ్చే పరిస్థితిలు కనిపించేవి. చివరకు ఇంతా చేసిన తరువాత ఆ ఐదు సంవత్సరాల్లో కలిపి చంద్రబాబు ఇచ్చింది కేవలం రూ.15 వేల కోట్లు మాత్రమే. ఎక్కడ రూ.87,612 కోట్లు.. ఆ డబ్బు మీద చంద్రబాబు ఇచ్చిన రూ.15 వేల కోట్లు ఏ మేరకు సరిపోతాయి..?

అప్పటి వరకు ఉన్న సున్నావడ్డీ పథకాన్ని పూర్తిగా ఎత్తేసి, చివరకు రైతులు వడ్డీల మీద వడ్డీలు కట్టుకునే పరిస్థితి వస్తే.. ఐదేళ్ల కాలంలో ముష్టివేసినట్టుగా రూ.15 వేల కోట్లు ఇచ్చాడు. 

వైయస్‌ఆర్‌ రైతు భరోసా అనే ఒక్క పథకం ద్వారా ఈ మూడు సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వం రూ.25,971 కోట్లు ఇచ్చింది. తేడా ఎంతగా ప్రస్పుటంగా కనిపిస్తుందో గమనించండి. 

చంద్రబాబు ప్రభుత్వంలో ఐదేళ్లు వరుసగా కరువు సంవత్సరాలే. ప్రతీ సీజన్‌లో కరువు మండలాలు ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో ఇన్సూరెన్స్‌ సొమ్ము పెరగాలి. కానీ, అలా జరగకుండా రైతులకు చెల్లించిన సొమ్ము ఐదేళ్లలో కలిపి రూ.3,411 కోట్లు మాత్రమే. అందులోనూ తమ వాటా, ఇన్సూరెన్స్‌ వాటా రైతులే కట్టుకునే పరిస్థితి. 

మనందరి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా రైతన్నలు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉచిత పంటల బీమాను అమలు చేయడమే కాకుండా.. ఈ–క్రాప్‌ ద్వారా పంట వేసుకునే ప్రతీ రైతుకు బీమా వర్తించేలా ఆర్బీకేలతో ఆనుసంధానం చేశాం. రైతులు కట్టాల్సిన ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే కట్టి.. ఈ–క్రాప్‌ ఆధారంగా ప్రతీ రైతును ఇన్సూరెన్స్‌లోకి తీసుకువస్తున్నాం. పంట నష్టం జరిగిన ఈ మూడు సంవత్సరాల కాలంలోనే రూ.6,685 కోట్లు రైతులకు ఇన్సూరెన్స్‌ రూపంలో చెల్లించడం జరిగింది. ప్రతీ రైతు కూడా ఈ–క్రాప్‌ ద్వారా ఇన్సూరెన్స్‌ వర్తిస్తుంది. అప్పట్లో కొందరికి మాత్రమే ఇన్సూరెన్స్‌ వచ్చే పరిస్థితి. తేడా గమనించాల్సిందిగా కోరుతున్నాను. 

అదే విధంగా విత్తనం నుంచి అమ్మకం వరకు రైతన్నకు అండగా ఉండే రైతు భరోసా కేంద్రాలు ప్రతీ గ్రామంలో కనిపిస్తున్నాయి. 10,778 రైతు భరోసా కేంద్రాలు ప్రతీ గ్రామంలోనూ రైతన్నకు నాణ్యమైన, క్వాలిటీ నిర్ధారణ చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు ఆర్బీకేల ద్వారా సరఫరా చేస్తున్నాం. 

ఆర్బీకేలు సలహాలు ఇస్తున్నాయి. పారదర్శకంగా ఈ–క్రాప్‌ నమోదు చేస్తున్నాయి. ప్రతీ పథకం కూడా పారదర్శకంగా అర్హులైన ప్రతీ రైతుకు కూడా అందించడంతో పాటు పంట కొనుగోలు సమయంలో కూడా రైతులు ఎక్కడా ఇబ్బంది పడకుండా, ఎక్కడైనా అలాంటి పరిస్థితి వస్తే.. వెంటనే సహాయ, సహకారాలు  అందించే గొప్ప వ్యవస్థ మన గ్రామంలోనే, మన కళ్ల ఎదుటనే ఆర్బీకేల రూపంలో కనిపిస్తున్నాయి. అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ అన్ని రకాలుగా గ్రామాల్లోనే తోడుగా నిలబడుతున్నాడు. 

ఇటువంటివి గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ జరిగింది లేదు. ఇటువంటి ఆలోచన కూడా కనీసం చేసింది లేదు. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు కనిపిస్తున్న పరిస్థితుల్లో తేడాను గమనించాలని కోరుతున్నాను. 

పంట నష్టానికి సంబంధించిన లెక్కింపు, సహాయం అందించడంలో ప్రతీ అంశంలో గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో గమనిస్తే.. 
గతప్రభుత్వంలో పంట అంచనాలన్నీ అశాస్తీ్రయంగా ఉండేవి. మధ్య దళారులు, ఉద్యోగుల చుట్టూ ఏళ్ల తరబడి రైతులు తిరిగినా కూడా వారికి పరిహారం అందుతుందో లేదో తెలియని దుస్థితి  ఉండేది. గత ఐదు సంవత్సరాల పాలనలో గమనిస్తే.. ఇన్‌పుట్‌ సబ్సిడీ పూర్తిగా ఎగ్గొట్టారు.. మరికొన్ని సందర్భాల్లో రెండు, మూడు సీజన్ల తరువాత అరకొర సాయం అందించడం గమనించాం. 

మనందరి ప్రభుత్వంలో ఈ–క్రాప్‌ ఆధారంగా  నమోదైన వాస్తవ సాగుదారులందరికీ నేరుగా వారి ఖాతాల్లోనే ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే ఆ సీజన్‌ ముగిసేలోపు పరిహారం జమచేస్తున్నాం. పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నాం. లబ్ధిదారుల పరిశీలన కోసం రైతు భరోసా కేంద్రాల్లో వారి జాబితాలను నోటీస్‌ బోర్డుపై ప్రదర్శిస్తున్నాం. ఎవరి గ్రామాల్లో వారు తమ వివరాలను చూసుకొని అర్హత ఉండి కూడా పొరపాటున వారి పేరు కనిపించకుండా ఉంటే వెంటనే ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తున్నాం. ఆ ఫిర్యాదులను వెరిఫై చేసి ప్రతీ సంవత్సరంలో జూలై, డిసెంబర్‌ మాసాల్లో సాయం అందించే గొప్ప కార్యక్రమం అమలు చేస్తున్నాం. తేడా గమనించాలని కోరుతున్నాను. 

కరువు వల్ల పంట నష్టానికి సంబంధించి గత ప్రభుత్వం ఏం చేసింది.. మన ప్రభుత్వం ఏం చేసిందని ఒక్కసారి గమనిస్తే.. రైతన్నలకు, వారి కుటుంబాలు గమనించాల్సి విషయాలు.. ఈ మూడున్నర సంవత్సరాల్లో ప్రస్పుటంగా కనిపిస్తుంది ఏంటంటే.. మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుడి దయ కచ్చితంగా ఉంటుంది. మూడున్నర సంవత్సరాల మన పరిపాలనలో ఒక్క సంవత్సరం కూడా ఒక్క కరువు మండలం కూడా ప్రకటించాల్సిన అవసరం లేకుండా రాష్ట్రంలో పరిపాలన సాగుతోంది. దేవుడిదయ ఇంత గొప్పగా ఉందని చెప్పడానికి ఇదొక నిదర్శనం. 

చంద్రబాబు ఐదేళ్ల పాలనలో సగటున ఏటా రాష్ట్రంలో సగం మండలాలు ఎప్పుడూ కరువు మండలాలుగానే  ఉండేవి. అప్పట్లో అంతటి కరువు వచ్చినప్పటికీ సాయం కూడా కరువే. 
– వరద నష్టపరిహారం చూస్తే 2015 నవంబర్, డిసెంబర్‌ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు జరిగిన 260 కోట్ల పంట నష్టానికి, 2018లో కరువు వల్ల ఖరీఫ్‌లో 1830 కోట్లు, రబీలో రూ.356 కోట్ల పంట నష్టానికి గతంలో అందించిన సాయం పెద్ద గుండు సున్నా. నిజంగా పంట నష్టం జరిగినా కూడా ఇన్‌పుట్‌ సబ్సిడీ పూర్తిగా ఎగ్గొట్టారు. 

మనందరి ప్రభుత్వంలో పాలసీలోకి మార్పు తీసుకొచ్చాం. ఈ మార్పు తరువాత 2020 జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకు కురిసిన భారీ వర్షాలకు వరదలకు నష్టపోయిన 3.80 లక్షల మంది రైతులకు రూ.285 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని అదే సంవత్సరం అక్టోబర్‌లోనే అందించాం. 
– 2020 నవంబర్‌ చివర్లో వచ్చిన నివర్‌ తుపాన్‌ వల్ల నష్టపోయిన 8.35 లక్షల మంది రైతులకు రూ.645.99 కోట్లను డిసెంబర్‌–2020లోనే అందించాం. 
– 2021 సెప్టెంబర్‌ చివర్లో వచ్చిన గులాబ్‌ తుపాన్‌ కారణంగా, నవంబర్‌లో అధిక వర్షాలతో నష్టపోయిన 6.31 లక్షలమంది రైతులకు రూ.564 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని అదే సీజన్‌ నవంబర్‌లో అందించాం. 
ఇలా ఎప్పటికప్పుడు సీజన్‌ ముగిసేలోగా అందిస్తున్నాం. అవసరం ఉన్నప్పుడు రైతులకు సహాయం అందితేనే రైతు తన కాళ్ల మీద తాను నిలబడ గలుగుతాడని చెప్పి ప్రతీ అడుగూ వేస్తూ 1835 కోట్లను రైతులకు సమయానికి అందించామని గమనించండి. 

సున్నావడ్డీ గత ప్రభుత్వానికి, మనందరి ప్రభుత్వానికి మధ్య తేడా గమనించండి. 
– మొత్తంగా రూ.1180 కోట్ల పంట రుణాల మీద వడ్డీ రాయితీ సొమ్మును గత ప్రభుత్వం బకాయిలు పెట్టింది. రైతులే కాకుండా బ్యాంకులు కూడా గగ్గోలు పెట్టిన పరిస్థితులు చూశాం.
– మనందరి ప్రభుత్వం వచ్చిన తరువాత గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను సైతం మనమే పూర్తిగా అందించాం. 73.88 లక్షల రైతన్నలకు వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ పంట రుణాల కింద ఇచ్చిన సొమ్ము అక్షరాల రూ.1834.55 కోట్లు అందించాం. 

ఇది రైతన్న మీద,  వ్యవసాయం మీద గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి మధ్య ఎంత తేడా ఉందో గమనించండి. 
– గత ప్రభుత్వం విపత్తుల సహాయ నిధికి, ధరల స్థిరీకరణ నిధిని ఎన్నికల వాగ్దానంగా మాత్రమే చెప్పి.. రైతులను మోసం చేసిన పరిస్థితి. 
– ఈరోజు మన ప్రభుత్వం ఆ రెండింటిని అమల్లోకి తీసుకొనివచ్చి రైతన్నలకు అన్ని రకాలుగా తోడుగా నిలబడుతోంది. 
– గతప్రభుత్వం ఏనాడూ రైతన్నలకు 9 గంటల పాటు పగటి పూట నాణ్యమైన విద్యుత్‌ ఇచ్చేందుకు ఏ చర్య తీసుకున్న పరిస్థితులు లేవు. 
– పగటి పూట రైతులకు ఉచితంగా నాణ్యమైన విద్యుత్‌ ఇవ్వాలంటే ఫీడర్లలో కెపాసిటీలేని పరిస్థితిలో ఐదేళ్ల పాలన సాగింది. 
– మనం వచ్చిన తరువాత ఫీడర్ల కెపాసిటీని మెరుగుపరిచేందుకు రూ.1700 కోట్లు ఖర్చు చేశాం. రైతులకు 9 గంటల పాటు ఉచితంగా పగటిపూట కరెంట్‌ ఇచ్చే గొప్ప మార్పు తీసుకొచ్చాం. పైగా గతంలో దాదాపుగా రూ.9 వేల కోట్లు కరెంటు బకాయిలు ఎగ్గొట్టిన మహానుభావుడు చంద్రబాబు. 

గత ప్రభుత్వం పాడి రైతులకు ఏ విధంగా అన్యాయం చేయాలని చూస్తే.. కేవలం వారికి సంబంధించిన కంపెనీలు బాగుపడాలి, రైతులకు ఏరకంగా నష్టపోయిన పట్టించుకున్న పరిస్థితి లేదు. 
మనందరి ప్రభుత్వం వచ్చిన తరువాత అమూల్‌ సంస్థను తీసుకొని వచ్చాం. కోఆపరేటివ్‌ రంగంలో ప్రపంచంలో అతిపెద్ద సంస్థగా ఉన్న అమూల్‌ను తీసుకొచ్చి మన రాష్ట్రంలో పాల వ్యాపారం మొదలుపెట్టించాం. అమూల్‌ వచ్చిన తరువాత ప్రతీ కంపెనీ కూడా ధరలతో పోటీపడుతున్నాయి. పాల రేట్లు ఏ విధంగా పెరిగాయో ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. 

– గత ప్రభుత్వం ఐదేళ్లలో ధాన్యం సేకరణ.. సంవత్సరానికి రూ.7–8 వేల కోట్ల ధాన్యం సేకరణ చేస్తే.. 
– మనందరి ప్రభుత్వం వచ్చిన తరువాత సంవత్సరానికి ధాన్యం సేకరణకు రూ.13 వేల కోట్ల పైచిలుకు ఖర్చు చేస్తున్నాం. ఈ–క్రాపింగ్‌ ద్వారా ప్రతీ రైతన్నను ఆర్బీకేల ద్వారా ఐడెంటిఫై చేసి, ప్రతీ ఎకరా కొనుగోలు చేసే వ్యవస్థలోకి గొప్ప మార్పు తీసుకువచ్చాం. 
– గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో ధాన్యం కోసం చేసిన ఖర్చును.. మనం ఈమూడు సంవత్సరాల్లోనే దాటేశాం. 
– ఇవన్నీ చేయగలిగాం కాబట్టే దేవుడి దయ వల్ల 2014 నుంచి 2019 మధ్యలో మన రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 154 లక్షల టన్నులు అయితే.. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి మూడేళ్లలోనే సగటున 167 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. 13 లక్షలటన్నుల దిగుబడి పెరుగుదల కనిపిస్తుంది. 
ప్రతీ అడుగులోనూ ప్రభుత్వం రైతులకు తోడుగా, అండగా ఉంటూ దేవుడి దయ వల్ల ఇది సాధ్యమైంది. 
ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా జరగాలని, రైతన్నలు ఇంకా సంతోషంగా ఉండాలని, రైతులకు ఎంత చేసినా అది తక్కువే అవుతుందని మరోసారి మనవి చేస్తూ.. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు మనందరి ప్రభుత్వంపై ఎల్లప్పుడూ ఉండాలని, ఇంకా మంచిచేసే అవకాశం దేవుడి దయతో రావాలని కోరుకుంటున్నాను. 
 

Back to Top