అమరావతి: శాసన సభలో చంద్రబాబే రౌడీయిజం చేసి ఏదో జరిగిపోతుందని మళ్లీ పోడియం ముందు కూర్చుంటున్నారని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సభలో ఆవేశంతో ఊగిపోయారు. అధికార పక్షంవైపు వేలు చూపిస్తూ వాగ్యుద్దానికి దిగారు. టీడీపీ సభ్యులు అరుపులు, కేకలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. నిమ్మల రామానాయుడికి మాట్లాడే అవకాశం ఇచ్చినా వినియోగించుకోకుండా టీడీపీ సభ్యులు గలాటా సృష్టించడంపై సీఎం వైయస్ జగన్ టీడీపీ నేతల తీరుపై మండిపడ్డారు. తన తప్పులను కప్పిపుచ్చకునేందుకు చంద్రబాబు సభను పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. టీడీపీ సభ్యుడు లేవనెత్తిన అంశంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిందన్నారు. ఒకసారి క్లారిటీ ఇచ్చాక మళ్లీ అదే అంశంపై మాట్లాడటం ఎంతవరకు సమంజసమన్నారు. నెల రోజుల్లోనే ఇన్ఫుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం జరుగుతుందని, డీసెంబర్ 15 నాటికి పంట నష్ట వివరాలు ఇవ్వాలని ఇప్పటికే ఆదేశించామన్నారు. టీడీపీ సభ్యులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.