తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నేడు `జగనన్న వసతి దీవెన` నగదు విడుదల చేయనున్నారు. అనంతపురం జిల్లా నార్పల వేదికగా విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. ఇచ్చిన మాట మేరకు సంక్షేమ క్యాలెండర్లో భాగంగా సీఎం వైయస్ జగన్ `జగనన్న వసతి దీవెన` అమలు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.912.71 కోట్ల ఆర్థిక సాయాన్ని కంప్యూటర్లో బటన్ నొక్కి జమ చేయనున్నారు. ఈ మొత్తంతో కలిపి ఇప్పటి వరకు 25,17,245 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.4,275.76 కోట్లు జమ చేసినట్లు అవుతుంది. గత ప్రభుత్వంలో అరకొరగా ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయడమేగాక 2017 నుంచి పెండింగ్ పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లను కూడా వైయస్ జగన్ ప్రభుత్వం చెల్లించింది. ఈ బకాయిలు, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతిదీవెన కింద ఇప్పటివరకు వైయస్ జగన్ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ.14,223.60 కోట్లు. వసతి దీవెన పథకం కింద ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థుల భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం క్రమం తప్పకుండా వైయస్ జగన్ ప్రభుత్వం అందిస్తోంది. విద్యారంగంలో అనేక సంస్కరణకు శ్రీకారం చుట్టిన సీఎం వైయస్ జగన్.. అధికారంలోకి వచ్చిన ఈ 46 నెలల కాలంలోనే ఒక్క విద్యా రంగంపై రూ.58,555.07 కోట్లు ఖర్చు చేశారు.