భారత బ్యాడ్మింటన్‌కు చారిత్రాత్మక క్షణం!

శ్రీకాంత్ కిదాంబి, టీం ఇండియాకు  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అభినందనలు 

 
అమ‌రావ‌తి: భారత బ్యాడ్మింటన్ చరిత్రలో  థామస్‌ కప్‌ గెలిచిన మ‌న దేశ‌ జట్టుకు  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఇండోనేషియాపై భారత్ 3-0 తేడాతో విజయం సాధించ‌డం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. భారతదేశం తన మొదటి  థామస్‌కప్‌ను ఇంటికి తీసుకురావడంతో భారత బ్యాడ్మింటన్‌కు చారిత్రాత్మక క్షణం!. ఫైనల్స్‌లో అద్భుత విజయం సాధించినందుకు,చివరి షాట్ వరకు అద్భుతమైన ప్రయాణం చేసినందుకు శ్రీకాంత్ కిదాంబి, టీం ఇండియాకు అభినందనలు అంటూ వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

థామస్‌ కప్‌లో 14 సార్లు ఛాంపియన్‌ అయిన ఇండోనేషియాను ఓడించిన భారత్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఫైనల్‌ పోరులో సింగిల్స్‌, డబుల్స్‌ విభాగాల్లో జయకేతనం ఎగురవేసి విజయం సాధించింది.సింగిల్స్‌లో ఆంటోని గింటింగ్‌తో తలపడిన భారత యువ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు లక్ష్యసేన్‌.. తొలిరౌండ్‌లో 8-21తో వెనుకబడినా మిగతా రెండు రౌండ్లలో అనూహ్యాంగా పుంజుకొని 21-17, 21-16 తేడాతో విజయాన్ని నమోదు చేశాడు. అటు డబుల్స్‌లోనూ.. భారత ఆటగాళ్లు అదరగొట్టారు. ఇండోనేషియా జోడి అసాన్‌, సంజయపై సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌ శెట్టి గెలుపొందింది. 18-21, 23-21, 21-19 తేడాతో జయకేతనం ఎగురవేసింది. జొనాథన్‌ క్రిస్టీపై కిదాంబి శ్రీకాంత్‌ 21-15, 23-21 ఆధిక్యంతో విజయం సాధించాడు. 

Back to Top