పులివెందుల : దేశంలో అత్యంత ప్రాచుర్యం కలిగిన శ్రీ స్వామినారాయణ అంతర్జాతీయ గురుకుల విద్యాపీఠానికి ఏర్పాటుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి భూమి పూజ చేశారు. స్థానిక పులివెందుల పట్టణంలోని ఏపీ కార్లు వద్ద ఎదురుగా ఉన్న 12 ఎకరాల్లో రూ 60 కోట్ల వ్యయంతో శ్రీ స్వామి నారాయణ గురుకుల విద్యాపీఠాన్ని నిర్మించనున్నారు. తొలి విడతలో రూ 26 కోట్లు ఖర్చు చేయనున్నారు. 2025 సం నుంచి అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయని సంస్థ యాజమాన్యం తెలిపింది. జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం పులివెందులలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీ నారాయణస్వామి అంతర్జాతీయ గురుకుల విద్యాపీఠానికి సంబంధించిన స్వామీజీలతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం హైదరాబాదు, జడ్చర్ల నుంచి వచ్చిన గురుకుల పీఠానికి చెందిన విద్యార్థులతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వెంట జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయరామరాజు జెసి గణేష్ కుమార్, పులివెందుల ఆర్డీవో వెంకటేశం, పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్, గురుకుల పాఠశాల స్వామీజీలు,సర్వ శిక్ష అభియాన్ ప్రభాకర్ రెడ్డి, స్టెప్ సీఈవో సాయి గ్రేస్,రైల్వే కొండాపురం ఎంఆర్వో శోభన్ బాబు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.