మళ్లీ సమగ్ర, మెరుగైన బిల్లుతో సభ ముందుకు 

విస్తృత, విశాల ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం 

3 రాజధానుల బిల్లు ఉపసంహరణపై అసెంబ్లీలో సీఎం వైయస్‌ జగన్‌

సీఆర్‌డీఏ రద్దు బిల్లు, వికేంద్రీకరణ బిల్లు ప్రస్తుతానికి రద్దు

వికేంద్రీకరణ సరైన విధానమని బలంగా నమ్మి అడుగులు ముందుకువేశాం

అమరావతి అంటే నాకూ ప్రేమే.. నా ఇల్లు ఇక్కడే ఉంది

3 రాజధానులపై అనేక అపోహలు, న్యాయపరమైన చిక్కులు సృష్టించారు

అందరికీ న్యాయం చేయాలన్నదే.. ప్రభుత్వ సదుద్దేశం

సమగ్రమైన బిల్లును ప్రవేశపెట్టి.. అన్ని వర్గాల ప్రజలను ఒప్పిస్తాం

అసెంబ్లీ: ‘‘మూడు రాజధానులకు సంబంధించిన బిల్లులోని ప్రభుత్వ సదుద్దేశాన్ని విఫులంగా వివరించేందుకు.. చట్ట, న్యాయపరంగా అన్ని సమాధానాలను బిల్లులోనే పొందుపరిచేందుకు బిల్లులను మరింత మెరుగుపరిచేందుకు, అన్ని ప్రాంతాలకు, అందరికీ విస్తృతంగా వివరించేందుకు, ఇంకా ఏమైనా మార్పులు అవసరం అయితే వాటిని కూడా పొందుపరిచేందుకు ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కు తీసుకొని.. మళ్లీ పూర్తి, సమగ్రమైన, మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శాసనసభలో ప్రకటించారు. విస్తృత, విశాల ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. 

శాసనసభలో సీఎం వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..

ఎటువంటి పరిస్థితుల్లో మూడు రాజధానుల నిర్ణయం వచ్చింది. ఎలాంటి పరిస్థితుల్లో ఆ నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సుదీర్ఘంగా చెప్పారు. 1953 నుంచి 1956 వరకు ఆంధ్రరాష్ట్రానికి రాజధానిగా కర్నూలు ఉండేది. ఆ రోజుల్లో గుంటూరులో హైకోర్టు ఉండేది. ఆ తరువాత 1956లో కర్నూలు నుంచి రాజధాని, గుంటూరు నుంచి హైకోర్టు రెండూ హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. తీసుకెళ్లేటప్పుడు ఈ మాదిరిగా జరిగింది కాబట్టి అక్కడి ప్రజల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకొని శ్రీబాగ్‌ ఒడంబడిక అవన్నీ చేసి.. రకరకాలుగా రాయలసీమకు న్యాయం చేస్తామని రోజుల్లో చెప్పడం జరిగింది. ఇవన్నీ చాలా సుదీర్ఘంగా ఆర్థికమంత్రి బుగ్గన వివరించారు. 

రాజధాని పెట్టడానికి గత ప్రభుత్వం చంద్రబాబు హయాంలో నిర్ణయం తీసుకోవడం. ఆ నిర్ణయం వివాదస్పదమని తెలుసు. అప్పట్లో శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఉల్లంఘించి చేసింది తెలుసు. అయినా కూడా 50 వేల ఎకరాల్లో రాజధాని నిర్మించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. నా ఇల్లు ఈ ప్రాంతంలోనే ఉంది. ఈ ప్రాంతం అంటే నాకు ఎటువంటి వ్యతిరేకత లేదు. ఈ ప్రాంతమంటే నాకు ప్రేమ కూడా. 

అమరావతి అటు విజయవాడ కాదు.. ఇటు గుంటూరు కాదు. అమరావతి నుంచి గుంటూరు, విజయవాడ 40 కిలోమీటర్లు. అమరావతిలో రోడ్లు, కరెంటు, డ్రైనేజీ వంటి బేసిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఏర్పాటు చేయడానికి గత ప్రభుత్వ లెక్కల ప్రకారం.. ఎకరాకు రూ. 2 కోట్లు అని లెక్కేశారు. 50 వేల ఎకరాలకు రూ.2 కోట్ల చొప్పున అంటే.. రూ.లక్ష కోట్ల అని లెక్కేశారు. లక్ష కోట్ల రూపాయలు అనేది ఈ రోజు లెక్కల ప్రకారం.. మరో పదేళ్లు పోతే రాజధాని కట్టడానికి, లక్ష కోట్ల రూపాయలు తెచ్చేందుకు పదేళ్లు పడుతుందో.. 20 ఏళ్లు పడుతుందో తెలియదు. పదేళ్లు పోతే లక్ష కోట్ల విలువ.. 6, 7 లక్షల కోట్ల రూపాయలకు వెళ్తుంది. 

కనీసం మన దగ్గరున్న డబ్బుతో రోడ్లు, డ్రైనేజీ, కరెంట్‌ ఇవ్వడానికి కూడా మన దగ్గర డబ్బులు లేని పరిస్థితుల్లో మనం ఉంటే.. రాజధాని అనే ఊహా చిత్రం ఇక్కడ సాధ్యమవుతుందా..? ఈ రకంగా ప్రజలను మభ్యపెట్టడం ధర్మమేనా..? అసలు మనకంటూ, మన పిల్లలకంటూ ఉద్యోగాలు కల్పించే పరిస్థితి ఎప్పటికి వస్తుంది. చదువుకున్న మన పిల్లలు ఉద్యోగాల కోసం ఎప్పుడూ పెద్దనగరాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వెళ్లాల్సిందేనా..? ఎప్పటికీ మనకు మార్పు ఉండదా అనే ఆలోచనల మధ్య నుంచి ఈ రోజు రాష్ట్రంలో ఉన్న  అతిపెద్ద నగరం విశాఖపట్నం. 

ఇటువంటి పెద్ద నగరంలో ఆల్రెడీ రోడ్లున్నాయి. ఆల్రెడీ డ్రైనేజీ, కరెంట్, అన్ని రకాల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫెసిలిటీ ఆల్రెడీ ఉన్నాయి. వాటి సుందరీకరణ మీద, వసతుల మీద శ్రద్ధ పెడితే ఆ నగరం.. ఐదు, పదేళ్లకు కచ్చితంగా హైదరాబాద్‌ వంటి పెద్ద నగరాలతో పోటీ పడే పరిస్థితి ఉంటుంది. ఇది వాస్తవమైన పరిస్థితి. ఇటువంటి వాస్తవాలను గుర్తెరిగి.. రాష్ట్రంలో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి.. రాష్ట్రం పూర్తిగా అభివృద్ధిలో పరిగెత్తాలనే తాపత్రయంతోనే విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ పెట్టాలని, అమరావతిలో లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌ పెట్టాలని, 1953–56 వరకు ఆంధ్రరాష్ట్రానికి కర్నూలు క్యాపిటల్‌.. అటువంటి క్యాపిటల్‌ను మార్పు చేశాం. అప్పటి నుంచి వారి ఆకాంక్షలు కూడా ఉన్నాయి.. వాళ్ల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకొని వాళ్లకు మంచి చేయాలనే ఉద్దేశంతో హైకోర్టు పెట్టాలని, జ్యుడీషియల్‌ క్యాపిటల్‌ కర్నూలులో పెట్టాలని నిర్ణయించాం. 

మూడు ప్రాంతాల ప్రజలకు అన్ని రకాలుగా డీసెంట్రలైజేషన్‌ ద్వారా మంచి జరిగించాలనే తాపత్రయంతో అడుగులు ముందుకేశాం. అటువంటి పరిస్థితుల మధ్య ఈ రోజు ఏమేమి జరిగాయో మన కళ్లముందే చూశాం. 3 రాజధానుల ఆలోచన చేసినప్పటి నుంచి ఒకటిన్నర, రెండుసంవత్సరాల కాలంలో.. రకరకాలుగా దీన్ని వక్రీకరిస్తూ, అపోహలు సృష్టిస్తూ, న్యాయపరమైన చిక్కులు సృష్టిస్తూ, రకరకాలుగా తీసుకెళ్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఒక ప్రకటన చేయాల్సి వస్తుంది.

రాజధానుల వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే, మూడు ప్రాంతాలకు న్యాయం చేసేలా, మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభమై ఉంటే.. ఈ రోజు దాని నుంచి మంచి ఫలితాలు ఈపాటికే అందుబాటులోకి వచ్చి ఉండేవి. నాటి శ్రీబాగ్‌ ఒడంబడిక స్ఫూర్తితో వెనకబడిన ఉత్తరాంధ్ర సహా అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. 

గతంలో కేంద్రీకరణ ధోరణిలు.. ఒక్కచోటే అభివృద్ధి కేంద్రీకరణ పరిస్థితుల ధోరణులను ప్రజలు ఎంత వ్యతిరేకించారో 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పు ద్వారా ప్రస్పుటంగా వ్యక్తమైంది. మరోసారి హైదరాబాద్‌ లాంటి సూపర్‌ క్యాపిటల్‌ మోడల్‌ వద్దే వద్దని, అటువంటి చారిత్రక తప్పిదానికి ప్రభుత్వం పాల్పడవద్దని, ప్రజల తీర్పు స్పష్టం చేసింది.. కాబట్టే వికేంద్రీకరణ సరైన విధానమని బలంగా నమ్మి అడుగులు ముందుకువేశాం. 

అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాలు, వీరందరి ఆశలు, ఆకాంక్షలు ప్రభుత్వంపరిగణలోకి తీసుకుంది కాబట్టే.. వాటిని ఆవిష్కరించింది కాబట్టే.. మన ప్రభుత్వాన్ని గడిచిన ఈ రెండున్నరేళ్ల కాలంలో జరిగిన ఏ ఎన్నికలను తీసుకున్నా.. ప్రజలు మనసారా ఈ ప్రభుత్వాన్ని దీవిస్తూ వచ్చారు. అయితే.. వికేంద్రీకరణకు సంబంధించి అనేక అపోహలు, అనేక అనుమానాలు, అనేక కోర్టు కేసులు, న్యాయ పరమైన విధానాలు, దుష్ప్రచారాలు.. ఇలా ఈ రెండేళ్ల కాలంలో వీటినే ప్రచారం చేశారు. 

అందరికీ న్యాయం చేయాలన్న ప్రభుత్వ సదుద్దేశాన్ని పక్కనపెట్టి, కొందరికి అన్యాయం జరుగుతుందన్న వాదనను కూడా కొంతమంది ముందుకు తోయడం మనమంతా మన కళ్లతో చూశాం. ఈ నేపథ్యంలో వికేంద్రీకరణ అవసరాన్ని మూడు రాజధానులకు సంబంధించిన బిల్లులోని ప్రభుత్వ సదుద్దేశాన్ని విఫులంగా వివరించేందుకు.. చట్టం, న్యాయపరంగా అన్ని సమాధానాలను బిల్లులోనే పొందుపరిచేందుకు బిల్లులను మరింత మెరుగుపరిచేందుకు, అన్ని ప్రాంతాలకు, అందరికీ విస్తృతంగా వివరించేందుకు, ఇంకా ఏమైనా మార్పులు అవసరం అయితే వాటిని కూడా పొందుపరిచేందుకు ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కు తీసుకొని.. ఇంతకు ముందు చెప్పిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని మళ్లీ పూర్తి, సమగ్రమైన, మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది. విస్తృత, విశాల ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాం.

 

తాజా వీడియోలు

Back to Top