మహానేత జయంతి రోజున ఆర్బీకేలు ప్రారంభం

వచ్చే ఉగాది నాటికి మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలకే ప్లాట్లు

వ్యాక్సిన్‌ విషయంలో సిఫార్సులకు తావులేదు

ఉన్నతాధికారుల ప్రవర్తనలో కూడా కాస్త సున్నితత్వం ఉండాలి

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశం

తాడేపల్లి: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి జయంతి రోజు (జూలై 8)న వైయస్‌ఆర్‌ రైతు భరోసా కేంద్రాలను ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్ర‌క‌టించారు. స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పలు అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కొత్తగా నిర్మాణం చేపట్టనున్న మెడికల్‌ కాలేజీలకు 30న శంకుస్థాపన చేస్తామన్నారు. వచ్చే ఉగాది నాటికి పట్టణాలు, నగరాల్లో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలకే ప్లాట్లు అందిస్తామని చెప్పారు. ఇందుకోసం దాదాపు 17 వేల ఎకరాలు అవసరం అవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. రకరకాల కేటగిరిల్లో ప్రభుత్వ, ప్రైవేట్‌ భూముల సేకరణ జరుగుతుందని వివరించారు. దాదాపు 3 లక్షల మందికి ప్లాట్లు అందిస్తామన్నారు. వివాదాల్లేని ప్లాట్లు రిజిస్ట్రేషన్, లాభాపేక్ష లేకుండా అర్హులకు ప్లాట్లు పంపిణీ చేస్తామన్నారు. లే అవుట్‌ను కూడా అభివృద్ధి చేస్తామని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు. 

ఇప్పటి వరకు 23,69,164 మందికి రెండు డోసుల వ్యాక్సిన్‌ ఇచ్చామని సీఎం చెప్పారు. 33,11,697 మందికి ఒక డోస్‌ ఇచ్చామన్నారు. దేశంలో 18 ఏళ్లకు పైబడ్డ వారికి 172 కోట్ల డోసులు అవసరమని, ఏపీకి మొత్తం 7 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు అవసరమన్నారు. 45 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సినేషన్‌ అయిపోయిన తర్వాత మిగిలిన వారికి రెండో డోస్‌ కోసం వేచి చూస్తున్న వారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. వ్యాక్సిన్‌ విషయంలో సిఫార్సులకు తావులేదన్నారు. 

ఉద్యోగుల పని విషయంలో ఒకరిద్దరు అధికారులు నిగ్రహం కోల్పోతున్నారని, ప్రతి ఒక్కరూ ఒత్తిడితో పనిచేస్తున్నారనే విషయాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. తిట్టి పనిచేయించుకోవడం వల్ల లాభం లేదని, ఉన్నతాధికారుల ప్రవర్తనలో కూడా కాస్త సున్నితత్వం ఉండాలన్నారు. 

 

Back to Top