అంబేడ్క‌ర్ భావ‌జాలంతో అనేక సంస్క‌ర‌ణ‌లు

దేశ సార్వభౌమాధికారానికి ప్రతీక మన రాజ్యాంగం

రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

అంబేడ్కర్‌ అందించిన ప్రజా ఆయుధం మన రాజ్యాంగం

రాజ్యాంగం మనకు క్రమశిక్షణ నేర్పే రూల్‌బుక్, గొప్ప టీచర్‌

రాష్ట్ర ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు

గొప్ప గ్రంథాన్ని అందించిన మహనీయుడు అంబేడ్కర్‌కు ఘన నివాళి

రాజ్యాంగాన్ని గౌరవించే ప్రభుత్వంగా 35 నెలల పాలనలో అనేక ముందడుగులు

2023 ఏప్రిల్‌లో విజయవాడలో అంబేడ్కర్‌ మహా విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నాం

రాజ్యాంగంలో చెప్పిన గ్రామస్వరాజ్యానికి రూపకల్పన చేసి తొలి ప్రభుత్వం మనది 

నామినేటెడ్‌ పనులు, పదవుల్లో 50 శాతానికి మించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రిజర్వేషన్‌ కల్పించాం

మంత్రి మండలిలో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే

డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా ఇప్పటి వరకు రూ.3,18,037 కోట్లు ఖర్చు చేశాం

విజయవాడ: ‘‘ప్రపంచ మానవ చరిత్రలోనే, ప్రజాస్వామ్య చరిత్రలోనే, సమానత్వ చరిత్రలోనే, సామ్యవాద చరిత్రలోనే, సంఘసంస్కరణల చరిత్రలోనే.. అత్యంత గొప్పదైన చారిత్రక గ్రంథం.. మన రాజ్యాంగం. ఈ పవిత్ర గ్రంథాన్ని రంచించిన  మహానుభావుడు డాక్టర్‌ బీ.ఆర్‌. అంబేడ్కర్‌’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాజ్యాంగంలోని మహోన్నత ఆశయాలకు ప్రతీరూపమైన ఆ మహనీయుడికి, ఆకాశమంతటి ఆ మహామనిషి బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌కు సీఎం వైయస్‌ జగన్‌ నివాళులర్పించారు. అంబేడ్కర్‌ భావజాలాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని మనసా, వాచా, కర్మణ గౌరవించే ప్రభుత్వంగా ఈ మూడున్నరేళ్ల పాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవానికి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ..
‘‘సామాజిక న్యాయానికి, సామాజిక సాధికారతకు ప్రతీక అయిన నా మంత్రివర్గ సహచరులు, అధికారులు, ప్రతీ ఒక్కరికీ, రాష్ట్రంలోని ప్రతీ అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వాతాతకు, ప్రతి సోదరుడు, స్నేహితుడికి, ప్రతి చిన్నారికి కూడా రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక అభినందనలు. 

మనదేశ ప్రజలు తమకోసం ఈ రాజ్యాంగాన్ని రాసుకొని, 1949లో తమకు తాము సమర్పించుకున్న రోజు నవంబర్‌ 26. ఈరోజు రాజ్యాంగ దినోత్సవం. మన రాజ్యాంగం దాదాపు 80 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసిన తరువాత తయారైన ప్రజల స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వాల మాగ్నాకార్టా.

ప్రపంచ మానవ చరిత్రలోనే, ప్రజాస్వామ్య చరిత్రలోనే, సమానత్వ చరిత్రలోనే, సామ్యవాద చరిత్రలోనే, సంఘసంస్కరణల చరిత్రలోనే.. అత్యంత గొప్పదైన చారిత్రక గ్రంథం. ఈ రాజ్యాంగం ఎంత గొప్పది అంటే.. 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు, 3 వేల కులాలు, ఉప కులాలతో కలిపితే 25 వేల కులాలు, ఏడు ప్రధాన మతాలు, 121 భాషలు, యాసలతో కలిపితే 19,500 భాషలు మాట్లాడే మన దేశానికి ఇన్ని కంప్లెక్సిసిటీస్, వేర్వేరు చరిత్రలు, భిన్నమైన భౌగోళిక స్వభావాలు ఉన్న దేశానికి, మన ప్రభుత్వాలకు, ఈ దేశంలోని 140 కోట్లపైగా ఉన్న ప్రజలకు క్రమశిక్షణ నేర్పే రూల్‌ బుక్‌. మనకు దిశానిర్దేశం చేసే ఒక గైడ్, ఒక ఫిలాసఫర్, ఒక టీచర్‌. 

మన దేశ సార్వభౌమాధికారానికి ప్రతీక మన రాజ్యాంగం. ఇంత గొప్పదైన మన రాజ్యాంగాన్ని మనకు అందించింది ఎవరంటే.. పుస్తకం ముట్టుకోవడానికి అంతకు ముందు వీలులేని సమాజంలో జన్మించి, ఎవ్వరూ చదవనన్ని చదువులు చదివి, ఎవరికీ లేనన్ని డిగ్రీలు, విదేశీ డిగ్రీలు సైతం సంపాదించుకొని, ఈ దేశం మారటానికి, నిలబడటానికి, ప్రపంచంతో పోటీపడటానికి, ఎదగడానికి, ప్రగతిపథంలో పరిగెత్తడానికి కావాల్సిన ఆలోచనలు, ఈ రూల్‌ బుక్, రాజ్యాంగ పుస్తకాన్ని, ఈ పవిత్ర గ్రంథాన్ని రంచించిన మహానుభావుడు అంబేడ్కర్‌. 

ఈ రాజ్యాంగం 72 ఏళ్లుగా మన సామాజిక వర్గాల చరిత్రలను తిరగరాసింది.. రాస్తూనే ఉంది. ఈ పుస్తకం మన ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, మహిళా చరిత్రల గతిని మార్చింది. మారుస్తూ ఉంటుంది. ఈ పుస్తకం మన భావాలను, భావజాలాలను మార్చింది.. మారుస్తూనే ఉంటుంది. ఈ రాజ్యాంగమే గత 72 సంవత్సరాలుగా మన సంఘ సంస్కర్త, ఈ పుస్తకమే మన మధ్య ఎన్ని భిన్నత్వాలు ఉన్నా.. వజ్రోత్సవ దేశ స్వాతంత్రాన్ని నిలబెట్టింది.. ఇక మీదట నిలబెడుతూనే ఉంటుంది.

నిస్సాహాయులకు, నిరుపేదలకు, అణగారిన వర్గాల వారికి అధికార దుర్వినియోగం జరిగినప్పుడు, ప్రభుత్వాల ఇనుప పాదాల కింద నలిగిపోయేవారి రక్షణకు దైవం ఇచ్చిన ప్రజా ఆయుధం ఈ రాజ్యాంగం. రాజ్యాంగంలోని మహోన్నత ఆశయాలకు ప్రతీరూపమైన ఆ మహనీయుడికి, ఆకాశమంతటి ఆ మహామనిషికి, బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ గారికి అంజలి ఘటిస్తూ.. ఇదే విజయవాడ నడుమ 2023 ఏప్రిల్‌లోనే అంబేడ్కర్‌గారి మహా విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నాం. అంబేడ్కర్‌ గారి భావజాలాన్ని, మన రాజ్యాంగ స్ఫూర్తిని మనసా, వాచా, కర్మణ గౌరవించే ప్రభుత్వంగా ఈ మూడున్నరేళ్ల పాలనలో ఎలాంటి ముందడుగులు వేశామో క్లుప్తంగా చెబుతాను. 

– రాజ్యాంగంలో చెప్పిన గ్రామస్వరాజ్యానికి రూపకల్పన చేసి దేశంలోనే తొలిసారిగా గ్రామ సచివాలయాలు, గ్రామ వలంటీర్ల వ్యవస్థను అమలు చేస్తున్న తొలి ప్రభుత్వం మనదే. 

– ప్రభుత్వ బడుల్లో పేదలకు ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకునే అవకాశమే లేకుండా చేయడం ద్వారా రూపం మార్చుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పట్ల పాటిస్తున్న నయా అంటరానితనం మీద సీబీఎస్ఈ ఇంగ్లిష్‌ మీడియం మొదలు, బైలింగ్వల్‌ టెక్ట్స్‌బుక్స్, డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌ల వరకు విద్యారంగంలో సంస్కరణల ద్వారా దండయాత్ర చేస్తున్న ప్రభుత్వం కూడా మనది. 

– నామినేటెడ్‌ పదవులు, నామినేటెడ్‌ పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకంగా చట్టం చేసి అమలు చేసిన తొలి ప్రభుత్వం మనదే. అందులోనూ 50 శాతం మహిళలకు రిజర్వేషన్‌ కల్పించిన మొట్టమొదటి ప్రభుత్వం కూడా మనదే. 

– మహిళా సాధికారతకు అర్థం చెబుతూ.. జగనన్న అమ్మ ఒడి, వైయస్‌ఆర్‌ చేయూత, వైయస్‌ఆర్‌ ఆసరా, వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ, 30 లక్షల  ఇళ్ల పట్టాలు అక్కచెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్, ఇప్పటికే మంజూరు చేసిన 21 లక్షల ఇళ్ల నిర్మాణం, దిశా యాప్, దిశా పోలీస్‌ స్టేషన్ల వంటి అనేక ముందడుగులు వేసిన మహిళా ప్రభుత్వం కూడా మనదే. 

– రాజధానికి సేకరించిన భూములను పేదల ఇళ్ల స్థలాలకు కేటాయిస్తే.. సామాజిక సమతూల్యత దెబ్బతింటుందని వాదించిన దుర్మార్గం భారతదేశంలో మొలకెత్తుతుందని బహుశా రాజ్యాంగనిర్మాతలు ఆరోజు ఊహించి ఉండకపోవచ్చు. ఇలాంటి వాదనలతో కూడా మనం యుద్ధం చేస్తున్నాం. 

–వాహన మిత్ర, రైతు భరోసా, పెన్షన్‌ కానుక, ఆసరా, సున్నావడ్డీ, లా నేస్తం, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, అమ్మ ఒడి, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, వసతి దీవెన, విద్యా దీవెన, చేదోడు, తోడు, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, విద్యా కానుక, గోరుముద్ద, 30 లక్షల ఇళ్ల పట్టాలు, చేయూత, బడులు, ఆస్పత్రుల్లో నాడు–నేడు.. ఇలా ఏ పథకాన్ని తీసుకున్నా కూడా పేదరికం నుంచి సామాజిక, ఆర్థిక తారతమ్యాల నుంచి బయటపడేందుకు చిత్తశుద్ధితో గట్టి ప్రయత్నం చేయాలన్న సంకల్పం నుంచి పుట్టినవే. 

– మన ఈ 35 నెలల పాలనలో ఒక్క డీబీటీ ద్వారానే లంచాలు, వివక్షకు తావులేకుండా నేరుగా ప్రజలకు అందించిన మొత్తం ఇప్పటి వరకు రూ.1,76,517 కోట్లు. 

– గత 35 నెలల్లో డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా అందించిన మొత్తం రూ.3,18,037 కోట్లు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అందినది అక్షరాల 79 శాతం. సామాజిక న్యాయానికి ఎంతగా కట్టుబడి ఉన్నామో ఈ అంకెలే సాక్ష్యం. 

– నా మంత్రివర్గ సహచరులనే తీసుకుంటే.. మంత్రిమండలిలో 75 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజికవర్గాలే. 

– రెండు మంత్రివర్గాల్లోనూ 5గురికి డిప్యూటీ సీఎం పదవులు ఇస్తే.. అందులో నలుగురు (80శాతం) నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ వర్గాలకే అవకాశం కల్పించాం. 

– శాసనసభ స్పీకర్‌గా బలహీనవర్గాలకు చెందిన వ్యక్తి, మండలి చైర్మన్‌గా ఎస్సీని నియమించడమే కాకుండా.. శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా మైనార్టీకి చెందిన నా అక్కను ఆ స్థానంలో కూర్చోబెట్టాం. సామాజిక న్యాయ చరిత్రలో ఇదొక సరికొత్త అధ్యాయం. 

– ఈ మూడు సంవత్సరాల్లో రాజ్యసభకు 8మందిని పంపితే.. అందులో నలుగురు బీసీలే. శాసనమండలికి అధికార పార్టీ నుంచి పంపిన 32 మందిలో 18 మంది నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలవారే అని సగర్వంగా తెలియజేస్తున్నాను. 

– 13 జిల్లాల పరిషత్‌ చైర్మన్‌ పదవుల్లో 9 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే కేటాయించిన ప్రభుత్వం మనది. 

– మున్సిపల్‌ కార్పొరేషన్లలో 86 శాతం, మున్సిపాలిటీల్లో 69 శాతం, మండల ప్రజాపరిషత్‌ చైర్మన్లలో 67 శాతం నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజికవర్గాలకే కేటాయించిన ప్రభుత్వం మనది. 

– వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్‌ పదవుల్లో నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మొత్తం 58 శాతం పదవులు ఇచ్చాం. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడమే కాకుండా.. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ను నియమించిన ప్రభుత్వం కూడా మనదే. 

35 నెలల్లో సామాజిక న్యాయంలో మనందరి ప్రభుత్వం మనసు పెట్టి తీసుకొచ్చిన మార్పులు. రాజ్యాంగ స్ఫూర్తిని తూచా తప్పకుండా పాటిస్తున్న మనందరి ప్రభుత్వానికి దేవుడి దయ, ప్రజలందరి చల్లని ఆశీస్సులు కలకాలం ఉండాలని కోరుకుంటున్నాను. 
 

తాజా వీడియోలు

Back to Top