కోవిడ్‌ పరిస్థితుల్లో వ్యవసాయరంగం మద్దతుగా నిలిచింది

విత్తనం నుంచి విక్రయం వరకు రైతుకు చేదోడుగా ఆర్బీకేలు

రాష్ట్రంలో పలు కార్యక్రమాలకు నాబార్డ్, బ్యాంకులు సహాయపడుతున్నాయి

గ్రామస్థాయిలో ఇ–క్రాపింగ్‌.. వ్యవసాయరంగంలో ఇది విప్లవాత్మక చర్య

ఫుడ్‌ ప్రాసెసింగ్, సహకార బ్యాంకులు, సొసైటీలను బలోపేతం చేస్తున్నాం

16 కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణంతో పాటు ఉన్నవాటిని ‘నాడు–నేడు’తో అభివృద్ధి 

స్కూళ్ల రూపురేఖలు మార్చి నాణ్యమైన విద్య అందించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాం

మత్స్యకారులు జీవనోపాధి కోసం హార్బర్లు, పోర్టులు, ఫిష్‌ల్యాండింగ్‌ సెంటర్లు

రాయలసీమ ప్రాంతంలో కరువు నివారణకు ప్రత్యేక దృష్టిసారించాం

నాబార్డ్‌ వార్షిక రుణ ప్రణాళిక సమీక్షలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

సమావేశానికి హాజరైన నాబార్డ్‌ చైర్మన్‌ జీఆర్‌ చింతల, మంత్రులు

తాడేపల్లి: కోవిడ్‌ పరిస్థితుల్లోనూ వ్యవసాయరంగం మద్దతుగా నిలిచిందని, రాష్ట్రంలో చేపడుతున్న పలు కార్యక్రమాలకు నాబార్డ్, బ్యాంకులు సహాయపడుతున్నాయని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కోవిడ్‌ సమయంలోనూ చాలా మంచి సహాయాన్ని అందించామన్నారు. నాబార్డ్‌ వార్షిక రుణ ప్రణాళికపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు,పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నాబార్డ్‌ చైర్మన్‌ జీఆర్‌ చింతల, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా స్టేట్‌ ఫోకస్‌ పేపర్‌ 2022-23ని సీఎం విడుదల చేశారు. 

ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..
ఆర్బీకేల ద్వారా ఇ– క్రాప్‌చేసి, పారదర్శకంగా చేస్తున్నాం. సాగుచేస్తున్న రైతులు నష్టపోతే ఆదుకుంటున్నాం. రైతుకు విత్తనం నుంచి పంట విక్రయం వరకూ కూడా ఆర్బీకేలు చేదోడుగా నిలుస్తున్నాయి. గ్రామ స్థాయిలో ఇ– క్రాపింగ్‌ చేస్తున్నాం. వ్యవసాయ రంగంలో ఇది విప్లవాత్మక చర్య. గ్రామీణ ప్రాంత నియోజకవర్గాల స్థాయిలో అగ్రిల్యాబ్స్‌ ఏర్పాటు చేశాం. 

ఆర్బీకేల స్థాయిలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో గణనీయంగా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాం. గోడౌన్లు, కోల్డ్‌ స్టోరేజీల్లాంటివి ఏర్పాటు చేస్తున్నాం. పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం. దీనికి నాబార్డు సహాయ సహకారాలు కావాలి. రైతులు చేస్తున్న ఉత్పత్తులకు అదనపు విలువ జోడించడానికే ఇవన్నీ చేస్తున్నాం. సహకార బ్యాంకులను, సొసైటీలను బలోపేతం చేస్తున్నాం. పారదర్శక విధానాలను తీసుకువస్తున్నాం.

ఆర్బీకేల్లో ఉన్న బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లు బ్యాంకులు, సొసైటీలకు అనుసంధాన కర్తలుగా వ్యవహరిస్తారు. దీనిపై బ్యాంకులతో కలిసి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయమని అధికారులకు ఇప్పటికే ఆదేశించాను. ఫుడ్‌ ప్రాసెసింగ్, కేంద్ర సహకార బ్యాంకులు, సొసైటీల బలోపేతంపై దృష్టిపెట్టాం. ఆర్బీకేల స్థాయిలో డ్రోన్లు తీసుకువస్తాం. వీటిని నిర్వహించే నైపుణ్యాలను గ్రామస్థాయిలోనే అభివృద్ధి చేస్తాం. వ్యవసాయరంగంలో భవిష్యత్తు టెక్నాలజీపై దృష్టిపెడతాం.

16 కొత్త మెడికల్‌ కాలేజీలను నిర్మిస్తున్నాం. ఇప్పటికే ఉన్న 11 మెడికల్‌ కాలేజీలను నాడు – నేడు కింద అభివృద్ధి చేస్తున్నాం. స్కూళ్లను మెరుగుపరుస్తున్నాం. నాణ్యమైన కనీస మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం. ఇంగ్లిషు మీడియాన్ని ప్రవేశపెట్టాం. పిల్లలకు సౌకర్యంగా ఉండేందుకు వీలుగా.. తెలుగు, ఇంగ్లిషు భాషల్లో పాఠ్య పుస్తకాలను ముద్రించాం. భవిష్యత్తులో ఈ పిల్లలు మంచి నైపుణ్యం ఉన్న మానవ వనరులుగా అభివృద్ధి చెందుతారు. గ్రామస్థాయిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని.. దాన్ని గ్రామీణ అర్థిక వ్యవస్థకు జోడించడంలో ఈ పిల్లలే ప్రధాన పాత్ర పోషిస్తారు. అందుకనే నాణ్యమైన విద్యను అందించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాం.

ఫ్లోరోసిస్‌ లాంటి నీటి సమస్యతో చాలా గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి. వీరికి రక్షిత తాగునీరు అందించే ప్రయత్నాలు ముమ్మరం చేశాం. మత్స్యకారులు జీవనోపాధి కోసం గుజరాత్‌ లాంటి రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితులు లేకుండా రాష్ట్రంలో హార్బర్లు, పోర్టులు, ఫిష్‌ల్యాండింగ్‌ సెంటర్లను నెలకొల్పే పనులు ప్రారంభం అయ్యాయి. రాయలసీమ ప్రాంతంలో కరువు నివారణ కోసం ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఎంపిక చేసిన ఈప్రాజెక్టులకు సకాలంలో పూర్తి చేయడానికి అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం.  

Back to Top