తాడేపల్లి: వినాయక చవితి పండుగ సందర్భంగా రాజ్యసభ సభ్యులు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలన్నీ తొలగిపోయి రాష్ట్రం మరింత విస్తృతంగా ప్రగతి సాధించాలనీ... ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉండాలనీ ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయసాయిరెడ్డి భక్తిశ్రద్ధలతో గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సకల శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా, ఆటంకాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా, భక్తి శ్రద్ధలతో హిందువులు గణనాథున్ని ఆరాధిస్తారని ఆయన పేర్కొన్నారు. జ్ఞానం, లక్ష్య సాధన, నైతిక విలువలు, ప్రకృతి పరిరక్షణ వంటి సుగుణాలను వినాయక చవితి పండుగ మనకు నేర్పుతుందని తెలిపారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా కుల, మత, రాజకీయాలకు అతీతంగా కలసిమెలసి, శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరిసేలా, ఆనందంతో జరుపుకోవాలని ఆయన కోరారు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా వాటిని వినాయకుని దీవెనలతో అధిగమిస్తూ, సకల జన సంక్షేమమే లక్ష్యంగా, ముఖ్యమంత్రి వైయస్ జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను నిర్విఘ్నంగా అమలు చేస్తున్నదని ఆయన స్పష్టం చేశారు. తలపెట్టిన కార్యాలు ఏ అవాంతరాలు లేకుండా జరిగేలా, సుఖ శాంతులతో జీవించేలా, ప్రజలందరికీ ఆ ఏకదంతుని దీవెనలు అందాలని ఆయన మనస్పూర్తిగా ఆకాంక్షించారు. ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మంత్రి జోగి రమేష్, శాసనమండలి విప్ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, సోషల్ మీడియా ఇన్చార్జ్ గుర్రంపాటి దేవేంద్రరెడ్డి, అంకంరెడ్డి నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.