మాజీమంత్రి పేర్నినానిపై కేసు

మరో 29 మంది వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై కూడా కేసు నమోదు

కృష్ణా: మాజీ మంత్రి పేర్ని నాని(Ex Minister Perni Nani)పై చిలకలపూడి పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. మచిలీపట్నం ఆర్‌ఆర్‌ పేట పీఎస్‌లో వివాదం సృష్టించారని నానిసహా 29 మందిపై కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ ఆయనపై అభియోగం నమోదు చేశారు. 
ఏపీ వ్యాప్తంగా టీడీపీ డైరెక్షన్‌లో పోలీసు యంత్రాంగం పని చేస్తున్న పరిస్థితులు చూస్తున్నవే. వైయ‌స్ఆర్‌సీపీ  చలో మెడికల్‌ కాలేజీ నేపథ్యంలో పార్టీ నగర అధ్యక్షుడు మేక సుబ్బన్నపై కేసు నమోదు చేశారు. పీఎస్‌కు పిలిపించుకుని ఆయనను ఉద్దేశించి సీఐ ఏసుబాబు అనుచితంగా మాట్లాడారు. ఈ విషయం తెలుసుకున్న పేర్ని నాని మరికొందరు కార్యకర్తలతో కలిసి పీఎస్‌కు చేరుకుని సీఐని నిలదీశారు.  దీంతో కేసు నమోదు చేశామ‌ని ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు తెలిపారు. అయితే ఈ పరిణామాలపై పేర్ని నాని స్పందించారు. తానేం పోలీసులకు వ్యతిరేకంగా కాదని.. మేయర్ భర్తపై సీఐ చేసిన అనుచిత వ్యాఖ్యలను మాత్రమే తాను ఖండించానని, ఆ సీఐ టీడీపీకి అనుకూలంగా పని చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇదిలా ఉంటే.. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగానే పేర్ని నానిపై కేసు నమోదు చేయించిందని వైయ‌స్ఆర్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 

Back to Top