నరసన్నపేట: ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో బూత్ లెవెల్ ఏజెంట్లు అత్యంత కీలక పాత్ర పోషించాలని జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. శనివారం నరసన్నపేట నియోజకవర్గ స్థాయి బీఎల్ఏల శిక్షణ కార్యక్రమం యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ, నియోజకవర్గంలోని ప్రతి ఓటును క్షుణ్ణంగా పరిశీలించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా బీఎల్ఏలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. జూన్ 15 నుంచి జూలై 14 వరకు నిర్వహించనున్న ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమంలో భాగంగా బూత్ లెవెల్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ డోర్ టు డోర్ సర్వేలో పాల్గొనాలని కోరారు. అనర్హుల ఓట్ల తొలగింపు, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను పకడ్బందీగా పర్యవేక్షించాలని ఆయన స్పష్టం చేశారు. పార్టీ బలోపేతంతో పాటు ఓటర్ల జాబితా పటిష్టత కోసం ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్ఐఆర్ టాస్క్ ఫోర్స్ ఇన్చార్జ్ కుంబా రవిబాబు, రాష్ట్ర కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి, పార్లమెంటరీ సమన్వయకర్త తమ్మినేని సీతారాం, టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్, నియోజకవర్గ పరిశీలకులు, బూత్ కమిటీ అధ్యక్షులు, ఐటీ వింగ్ నాయకులు, బీఎల్ఏలు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.