అణగారిన వర్గాలకు మరోసారి రాజ్యాధికారం

బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల  మంత్రి  చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ 

అదే ఇవాళ్టి ఆంధ్రప్రదేశ్‌ కొత్త మంత్రివర్గం

ఊహకు కూడా అందని విధంగా మంత్రివర్గ కూర్పు

మంత్రుల్లో 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు

70 శాతం పదవులు వారికే దక్కాయి

నిజంగా అది ఒక సామాజిక విప్లవం

 అందుకే చంద్రబాబుకు, టీడీపీకి దిక్కు తోచడం లేదు

అర్ధం లేని విమర్శలు. ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు

టీడీపీ హయాంలో బీసీలకు ఎంతో అన్యాయం

వారి కోసం చంద్రబాబు చేసిందేమీ లేదు

ఇచ్చిన పని ముట్లలోనూ అవినీతి వ్యవహారం

 తాడేపల్లి:  దేశ రాజకీయాలు, రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా, సామాజిక కోణంలో చూస్తే, ఊహకు కూడా అందని విధంగా మంత్రివర్గం ఏర్పాటు జరిగింద‌ని బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల  మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. అందుకే దీన్ని సామాజిక క్యాబినెట్‌ అని చెప్పాల‌ని అభివ‌ర్ణించారు. రాజ్యాధికారం అనేది కేవలం మాటల మూటలుగానే మిగిలిపోగా, వారి కోసం ఎందరో ఉద్యమాలు చేశారు. కానీ దాన్ని సాకారం చేసి చూపారు సీఎం జగన్‌గారు. ఆ దిశలోనే ఇవాళ ఏర్పడిన మంత్రివర్గంలో 17 మంత్రి బీసీ, ఎస్పీ, ఎస్టీ, మైనారిటీలు.. అంటే 70 శాతం ఉన్నారు. కొత్త మంత్రివర్గంలో బీసీలు, మైనారిటీలు 11 మంది, ఎస్సీలు 5గురు, ఒక ఎస్టీ ఉన్నార‌ని చెప్పారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

ఓర్చుకోలేకపోతున్న చంద్రబాబు:
    దీన్ని చూసి చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారు. బీసీలు తమ వెంటే ఉంటారని చెప్పుకునే చంద్రబాబు, తాను అధికారంలో ఉన్నప్పుడు వారిని కేవలం ఓటు బ్యాంక్‌ రాజకీయాలకు వాడుకుని, అభూత కల్పనలకే పరిమితం అయ్యారు. ఇవాళ కూడా టీడీపీ నాయకులు మీటింగ్‌ పెట్టి, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అసలు వారికి వాస్తవాలు తెలుసా? అసలు వారికి స్పృహ ఉందా? 

మీరు బీసీలను గుర్తించలేదు:
    మీరు ఏది మాట్లాడినా ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా?
రాష్ట్రంలో దాదాపు 139 కులాలు ఉంటే, ఆ కులాల్లో పుట్టిన వారు బీసీలుగా ఉన్నారు. వారిని గతంలో ఏ ప్రభుత్వం గుర్తించలేదు. అలాగే సంచార జాతులకు కూడా ఎలాంటి గుర్తింపు లేదు. కానీ 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన జగన్‌గారు, బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఆ విధంగా బీసీల ఆత్మగౌరవం పెంచడానికి ప్రయత్నించారు. కానీ మీరేం చేశారు? బీసీలకు పనికిమాలిన పనిముట్లు ఇచ్చారు. అవి ఉపయోగపడకపోగా, వాటిలోనూ కమిషన్లు కొట్టారు. అలాగే మీరు ఏనాడూ బీసీ కార్పొరేషన్ల గురించి ఆలోచించలేదు.

బీసీలకు అన్యాయం చేశారు:
    బీసీలకు ప్రధానంగా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. కానీ  చంద్రబాబు ఏం చేశారు? ఆరోగ్యశ్రీలో 2100 ప్రొసీజర్లు ఉంటే, వాటికి 1000కి తగ్గించారు. జగన్‌గారు సీఎం కాగానే, ఆరోగ్యశ్రీలోకి దాదాపు 2500 ప్రొసీజర్లు తీసుకొచ్చారు. బీసీలు బాగు పడాలంటే వారి చేతిలో ధనమైనా ఉండాలి. లేదా వారు బాగా చదువుకోవాలి. అయితే మీరు ఏనాడైనా ఆ కోణంలో ఆలోచించారా?
    గతంలో బీసీలకు మహానేత వైయస్సార్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేశారు. తద్వారా వారు బాగా చదువుకునేలా చూశారు. అలా వారి జీవితాలు మార్చాలని చూశారు. అదే చంద్రబాబు సీఎం కాగానే, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నీరు గార్చారు. ఆ విధంగా బీసీల సంక్షేమాన్ని కూడా ఆయన నీరు గార్చారు. కేవలం రూ.35 వేల ఫీజు మాత్రమే చెల్లించడం వల్ల చాలా మంది బీసీలు ఉన్నత విద్యకు దూరమయ్యారు.
    గతంలో పేదలు ప్రభుత్వ పథకాలు పొందాలంటే జన్మభూమి కమిటీలను ఆశ్రయించాల్సి వచ్చేది. అందులో అంతులేని అవినీతి జరిగేది. కానీ ఇవాళ సచివాలయ వ్యవస్థ ద్వారా, ప్రభుత్వ పాలన ఇంటి గడప వద్దనే అందుతోంది. ప్రభుత్వ పథకాలు డోర్‌ డెలివరీ అవుతున్నాయి.

ఇది బీసీల ప్రభుత్వం:
    జగన్‌గారి సామాజిక కోణం ఒక్కటే. పేదింటి పిల్లలు బాగా చదువుకోవాలి. వారి కుటుంబాలు బాగా ఎదగాలి. అందు కోసం ఆయన ఎన్నెన్నో పథకాలు అమలు చేస్తున్నారు. అవి మంచి ఫలితాలు ఇస్తున్నాయి.
    అమ్మ ఒడి ద్వారా నిరుపేద కుటుంబాల పిల్లలు బాగా చదువుకుంటున్నారు. ఫీజు ఎంతైనా పూర్తిగా ఫీజు చెల్లించడం ద్వారా, పేదింటి పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు. ఉన్నత చదువులు చదువుతున్నారు. మరోవైపు నాడు–నేడు కార్యక్రమంలో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు పూర్తిగా మార్చేస్తున్నారు. విద్యాదీవెన, వసతి దీవెన, గోరుముద్ద వంటి అనేక పథకాల ద్వారా బీసీలను ఆదుకుంటున్నారు. 
ఇది బీసీల ప్రభుత్వం. బీసీలను ఉద్ధరించడంపైనే పాలకుడి ఆలోచన ఉంది. ఇవన్నీ చూసి చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారు.

మంత్రుల్లో అన్ని వర్గాలు:
    ఇవాళ మంత్రివర్గంలో ఎవరెవరున్నారో చూడండి. యాదవులు, పోలనాటి వెలమలు, కొప్పుల వెలమలు, కురుబలు, శెట్టి బలిజలు, తూర్పు కాపులు, గౌడలు, బోయలు ఉన్నారు. 11 మంది మంత్రులు వారే.
ఇవన్నీ చూసి మీకు ఏం చేయాలో దిక్కు తోచడం లేదు. కళ్లు చెదిరిపోయి ఏం మాట్లాడాలో తెలియక, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.

చర్చకు వచ్చే ధైర్యం ఉందా?:
    పదే పదే మాట్లాడితే ప్రజలు నమ్ముతారని టీడీపీ నాయకులు అనుకుంటున్నారు. కానీ వారు నమ్మబోరు. అందుకే మీరు ఏం చెప్పినా ప్రజలు మీ వెంట రారు. మీకు ధైర్యముంటే చర్చకు రండి. 14 ఏళ్ల పాలనలో బీసీలకు చంద్రబాబు ఏం చేశారు? ఈ 34 నెలలో పాలనలో జగన్‌గారు బీసీలకు ఏం చేశారన్నది చర్చిద్దాం. ఇవాళ మహాత్మ జ్యోతిబా పూలే జయంతినాడు సామాజిక కోణంలో క్యాబినెట్‌ కూర్పు జరిగింది. 

బీసీలకు గుర్తింపు. ప్రాధాన్యం:
    బీసీల రాజ్యాధికారం కోçసం సీఎం శ్రీ వైయస్‌ జగన్, 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. వాటిలో 672 మంది డైరెక్టర్లు, ఇంకా ఇతర కార్పొరేషన్లలో 210 మంది డైరెక్టర్లు నియమితులయ్యారు. ఆ విధంగా దాదాపు 921 మందికి రాష్ర స్థాయి పదవులు వచ్చాయి. ఇంకా ఛైర్మన్‌ పదవులు కూడా ఉన్నాయి.
    అదే విధంగా మీరు రాజ్యసభ టికెట్లు ఎప్పుడైనా ఆలోచించారా? అదే జగన్‌గారు, 4 రాజ్యసభ టికెట్లలో రెండింటిని బీసీలకు ఇచ్చారు. గతంలో బీసీ మంత్రులు 7గురు మాత్రమే ఉండగా, ఇవాళ 11 మంది ఉన్నారు. వాస్తవానికి మీ హయాంలో బీసీలకు ఏమీ చేయలేదు. 

ఇతర వర్గాలకూ న్యాయం:
    అన్ని సామాజిక వర్గాలకు కూడా జగన్‌గారు న్యాయం చేశారు. క్షత్రియ వర్గానికి చెందిన వ్యక్తికి చీఫ్‌ విప్, ఒక బ్రాహ్మణుడికి ప్రణాళిక సంఘం వైస్‌ ఛైర్మన్‌ పదవిని, వైశ్యుడైన కోలగట్ల వీరభద్రస్వామికి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ పదవి ఇస్తున్నారు.
    అందుకే టీడీపీ నాయకులు ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించాలి. నిజానికి మీ హయాంలో బీసీలకు ఒరగబెట్టిందేమీ లేదు. టీడీపీ నేత యనమల ఏవో లెక్కలు చెబుతారు. అంతే తప్ప, ఆ పార్టీ బీసీలకు చేసిందేమీ లేదు. కాబట్టి అనవసర మాటలు కట్టి పెట్టండి.

బీసీల కోసం చిత్తశుద్దితో..:
    రాష్ట్రంలో బీసీల గురించి ఆలోచించింది. వారి బాధలు తొలగించడానికి తొలుత మహానేత వైయస్సార్‌ కృషి చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేశారు. ఆ తర్వాత సీఎం శ్రీ వైయస్‌ జగన్‌గారు చిత్తశుద్దితో కృషి చేస్తున్నారు.
    జగన్‌గారు అనేక పథకాల ద్వారా బీసీల్లో ఆత్మస్థైర్యం పెంచారు. జగన్‌గారు ఒక సామాజిక విప్లవకారుడిగా, అణగారిన వర్గాల వారి గురించి ఆలోచించారు. వారి అభ్యున్నతి కోసం పని చేస్తున్నారు. అందుకే బీసీలు, మైనారిటీలు అందరూ ఆయనను దేవుడిలా కొలుస్తున్నారు.
    అందుకే మీరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ఏమీ సాధించలేరు. ఇవాళ్టి క్యాబినెట్‌ కూర్పు ఒక సామాజిక విప్లవం. దీంతో ఇక మీరు ఏం చేసినా ప్రజలు నమ్మరు. అందుకే లేనిది ఉన్నట్లు చెప్పడం మానండి. ప్రజలను మోసం చేయడం వదలండి.. అని మంత్రి శ్రీ వేణుగోపాలకృష్ణ అన్నారు.

తాజా వీడియోలు

Back to Top