ఉత్తరాంధ్ర జోలికి వస్తే ఉపేక్షించేది లేదు

 ఎంపీ రఘురామకృష్ణంరాజుకు మంత్రి అవంతి వార్నింగ్‌
 

 విశాఖపట్నం: ఉత్తరాంధ్ర జోలికి వస్తే ఉపేక్షించేది లేదని మంత్రి అవంతి శ్రీనివాస్‌ రావు.. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును హెచ్చరించారు. ఆదివారం రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'మీరు సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి భిక్షతో లోక్‌సభలో అడుగుపెట్టారనే విషయం గుర్తుంచుకోవాలి. వైయ‌స్ జగన్‌ చరిష్మాతో మాత్రమే మీరు నాగబాబుపై గెలుపొందర‌ని గుర్తు చేశారు. మీకు భిక్ష పెట్టిన సీఎంపై విమర్శలు చేయడం తగద‌ని హిత‌వు ప‌లికారు. 

అన్ని విష‌యాల్లో జోక్యం చేసుకోకండి
 నర్సాపురం పార్ల‌మెంట్ వ‌ర‌కు మాత్ర‌మే పరిమితం కావాల‌ని ర‌ఘురామ‌కృషంరాజుకు మంత్రి అవంతి సూచించారు.  అన్ని విషయాల్లో జోక్యం చేసుకోవడం సరికాదు. వైయ‌స్ఆర్‌సీపీ జెండాపై గెలిచిన మీరు టీడీపీ నాయకుల కంటే ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు. విశాఖ రాజధాని వద్దని చెప్పడానికి రఘురామ కృష్ణంరాజు ఎవరు..? ఇలా వద్దని మాట్లాడినందుకే చంద్రబాబు నాయుడ్ని వైజాగ్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు రాకుండా ప్రజలు అడ్డుకున్నారని చెప్పారు.  ఢిల్లీలో నాలుగు పార్టీల నాయకులు మీకు తెలుసుండొచ్చు. అలా అని అదేపనిగా పార్టీని విమర్శించడం తగదు. మీ పంథా మార్చుకోకపోతే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు క్షమించరు. పార్టీ విధానాలు నచ్చకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేయాల‌ని సూచించారు.   

న‌లంద కిశోర్ టీడీపీ అభిమాని
నలందా కిషోర్‌ అనారోగ్యంతో మృతి చెందార‌ని మంత్రి అవంతి పేర్కొన్నారు.  ఆ మరణాన్ని కూడా చంద్రబాబు, లోకేష్‌ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కిషోర్‌ టీడీపీ అభిమాని. ఆయన మరణానికి మేము కూడా సంతాపం తెలియజేస్తున్నాము. కరోనా ఎవరికైనా వస్తుంది. పార్టీలతో సంబంధం లేదు. నలందా కిషోర్‌ను పోలీసులు కర్నూలు తీసుకువెళ్లడంతో మరణించారని చంద్రబాబు, లోకేష్‌లు తప్పుడు ప్రచారం చేస్తున్నార‌ని ఖండించారు. నలందా కిషోర్‌పై అభిమానం ఉంటే అచ్చన్నాయుడు కుటుంబాన్ని పరామర్శించిన లోకేష్‌ ఇప్పుడు కిషోర్‌ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించడం లేదంటూ అవంతి శ్రీ‌నివాస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 

తాజా వీడియోలు

Back to Top